Drishyam 3 | మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణను సొంతం చేసుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా మరోసారి ‘దృశ్యం’ ఫ్రాంచైజీ శక్తిని నిరూపించింది. మొదటి రెండు భాగాలు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేయడంతో మూడో భాగంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా జార్జ్కుట్టి పాత్ర చుట్టూ తిరిగే ఉత్కంఠభరిత కథ, అతని కుటుంబం ఎదుర్కొనే పరిస్థితులు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. గతంలో జరిగిన సంఘటనల నుంచి తెలివిగా బయటపడిన జార్జ్కుట్టి ఈసారి కూడా తన కుటుంబాన్ని కాపాడగలడా? లేక చట్టం వలలో చిక్కుకుంటాడా? అనే అంశాల చుట్టూ కథ నడుస్తోంది.
ఈసారి చిత్రంలో కేవలం థ్రిల్లింగ్ అంశాలే కాకుండా భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేశారు. కుటుంబ బంధాలు, భయం, బాధ, మానసిక ఒత్తిడి వంటి అంశాలను దర్శకుడు హృదయానికి హత్తుకునేలా చూపించారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకుపోతోంది. తాజాగా సినిమా విజయాన్ని పురస్కరించుకుని మేకర్స్ ‘బిహైండ్ ద సీన్స్’ వీడియోను విడుదల చేశారు. ఇందులో షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర క్షణాలు, నటీనటుల అనుభవాలు, సన్నివేశాల చిత్రీకరణ కోసం తీసుకున్న శ్రమను చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో మోహన్లాల్తో పాటు మీనా, అన్సిబా హసన్, ఎస్తర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిఖ్, కళాభవన్ షాజోన్, ఇర్షాద్, గణేష్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమాచారం ప్రకారం, హిందీ వెర్షన్ను 2026 అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో సాధించిన విజయాన్ని బాలీవుడ్లో కూడా కొనసాగించాలని చిత్ర బృందం భావిస్తోంది.