జనానికి రకరకాల రంగులుంటాయి, తనకంటూ ఒక రంగు లేకుండా అన్ని రంగులనూ కలుపుకొనేది ప్రభుత్వం.
జనానికి రకరకాల పక్షపాతాలుంటాయి, తనకంటూ ఒక పక్షపాతం లేకుండా ఉండేది ప్రభుత్వం.
జనానికి రకరకాల సంస్కృతులుంటాయి, తనకంటూ ఒక సంస్కృతి లేకుండా అన్ని సంస్కృతులను ప్రతిఫలించేది ప్రభుత్వం.
జనానికి రకరకాల మతాలుంటాయి, తనకంటూ ఒక మతం లేకుండా అన్ని మతాలకు సమదూరం పాటించేది ప్రభుత్వం.
జనం తనను తప్పు పడతారు, ధిక్కరిస్తారు, అయినా వారిపట్ల పగబట్టిన శత్రువులా కాకుండా తల్లిలా స్పందించేది ప్రభుత్వం.
…మనసుకు హాయి గొలిపే ఈ ఆశాభావం కల్లూరి భాస్కరం గారిది. సీనియర్ జర్నలిస్ట్, పురాణేతిహాసాలపైన పట్టు వున్న రచయిత, సమాజం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించే ప్రగతిశీల పౌరుడు. కల్లూరి భాస్కరం తాజా పుస్తకం ‘గాంధీత్వ నుంచి హిందుత్వ దాకా’లో దేశ సమకాలీన పరిస్థితులను విశ్లేషించారు.1920 దశకపు గాంధీయిజం నుం చి ప్రస్తుత మోదీ పాలన వరకూ వందేళ్ళకు పైగా భారత ముఖచిత్రాన్ని ఆవిష్కరించిన్రు. పుస్తకంలోని కొన్ని ఆసక్తికర పరిశీలనలు:
‘గాంధీత్వకు భిన్నంగా కుల మత ప్రాంతభాషా వైవిధ్యాలపైన, వైరుధ్యాలపైనా కృత్రిమంగా తెర వేసి మెజారిటీ మతప్రాతిపదికపై ఏకపక్ష, నిర్బంధ ఐక్యతను నిర్మించడం హిందుత్వ భావజాల లక్ష్యం. గాంధీని గౌరవిస్తున్నట్టు కనిపిస్తూనే, తమతో ఎంతోకొంత భావసారూప్యం ఉందనుకునే పటేల్ను, గాంధీతో సైద్ధాంతికంగా విరోధించిన సుభాష్ చంద్రబోస్ తదితరులను విస్మృతులన్న ముద్రతో తను సొంతం చేసుకుని ప్రముఖంగా ముందుకు తెస్తూ గాంధీని మసకబార్చే ప్రయత్నం చేస్తోంది. నెహ్రూ వారసత్వం రాజకీయంగా ఇంకా ఉనికిని చాటుకుంటోంది కనుక నెహ్రూ శీలహననానికి ప్రత్యక్షంగానే పాల్పడుతోంది.’
‘ఏకవ్యక్తి కేంద్రిత అధికారం, వ్యక్తిపూజ, సడలింపు లేని సైద్ధ్దాంతిక కుటుంబ వారసత్వం అప్రజాస్వామికాలు కావా?
అనువంశిక నాయకత్వం ఒక్కటే అప్రజాస్వామికమా?’
‘మోదీ ప్రభుత్వం ఏం చేసినా ఒప్పేనని గుడ్డిగా సమర్థించే ఒక బలమైన మధ్యతరగతి విద్యావంతవర్గం ఈ మూడేళ్లలోనూ మరింతగా బలం పుంజుకుంది. నోట్లరద్దు కారణంగా సామాన్య ప్రజానీకం పడిన కడగండ్లకు చీమ కుట్టినంత బాధ కూడా ప్రభుత్వంలో, ప్రభుత్వానికి అండగా ఉన్న మేధావివర్గాలలో వ్యక్తం కాకపోవడంలోని రహ స్యం ఇదే. ప్రభుత్వం పాటించవలసిన రాజధర్మం, నైతికవిలువలతో సహా అన్నింటినీ పునర్నిర్వచించే ప్రక్రియలో ఈ వర్గం సహభాగస్వామి. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఏం చేసినా అందులో తప్పునే చూసిన ఈ వర్గం, ఇప్పుడు ప్రభుత్వం ఏ చేసినా ఒప్పునే చూడడం దాని రాజకీయ పాక్షికతకు తిరుగులేని నిరూపణ’
‘మనలో జాతివివక్ష ఉంటే నల్లవారైన దక్షిణ భారతీయులతో ఎలా సహజీవనం చేస్తున్నామని ప్రశ్నిస్తూ దేశం మొత్తానికి పెద్ద షాకిచ్చారు బీజేపీ ఎంపీ, జర్నలిస్టు కూడా అయిన తరుణ్ విజయ్. ఎన్ని కోణాల నుంచి చూసినా ఈ వ్యాఖ్యలో రాజకీయ ఇంగితం కాదుకదా, సాధారణ ఇంగితం కూడా కనిపించదు. జర్నలిస్టు కూడా అయిన ఒక విద్యావంతుని మాటల్లో ఉండవలసిన కనీస తర్కం, హేతుబద్ధత, విజ్ఞత కనిపించవు. మనలో జాతివివక్ష ఉంటే ‘నల్ల’వారైన దక్షిణ భారతీయులతో ఎలా సహజీవనం చేస్తున్నామన్నప్పుడు, దక్షిణ భారతీయులను మినహాయిస్తున్న ఈ ‘మనం’ ఎవరు? ‘ఉత్తర భారతీయు’లనే కదా? అంటే, ఈ దేశం ‘తెల్ల’వారైన ఉత్తర భారతీయుల సొత్తు, అయినా సరే వారు ఎంతో పెద్ద మనసుతో ‘నల్ల’వారైన దక్షిణ భారతీయులకు కూడా ఇక్కడ చోటిచ్చి వారితో సహజీవనం చేస్తున్నారనే అర్థం.’
‘గవర్నర్ చేయవలసింది రూలు బుక్కును అనుసరించడమే. కానీ, గవర్నర్ ఆ రూలు బుక్కును పక్కన పెట్టి కొత్త రూలు బుక్కు తెరిచారు. ప్రమాదకరమైన కొత్త ఆనవాయితీని సృష్టించారు. రాజ్యాంగబద్ధంగా సాఫీగా జరిగిపోవలసిన ఒక రాజకీయ ప్రక్రియలోకి ‘రాబోయే కోర్టు తీర్పు’ అనే కొత్త కోణాన్ని తెచ్చా రు. ఎప్పుడో రాబోయే కోర్టు తీర్పును దృష్టి లో పెట్టుకుని రేపు అనేక రాష్ర్టాలలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వ్యక్తులను అధికారంలోకి రాకుండా నివారించడం, రోజుల తరబడి ప్రతిష్టంభనను కొనసాగించడం, తెర వెనక బేరసారాలకు అవకాశమివ్వడం అనే సరికొత్త పాత్రను గవర్నర్కు కల్పించారు.’
‘భారతదేశంలో ఈ రోజున జరుగుతున్నది అక్షరాలా యుద్ధం… భావజాలాల మధ్య యుద్ధం. భావజాల ఘర్షణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడది యుద్ధ రూపం ధరించి, నానాటికీ తీవ్రమవుతోంది. యుద్ధంలోని ఒక పక్షం వారికి అదనంగా అధికార బలం ఉంది కనుక అది క్రమంగా భౌతిక యుద్ధంగా కూడా మారుతోంది. అది దాని సహజ పరిణామం. దేశద్రోహి, పాకిస్తాన్ ఏజెంట్ మొదలైన ముద్రలు వేయడం.. అరెస్టులు చేయడం… దాడులు చేయడం… న్యాయ స్థానాలు సైతం భౌతిక యుద్ధ క్షేత్రాలు కావడం… ఇదీ దాని క్రమం.’
‘ప్రపంచవ్యాప్తంగా నియంతలు అవలంబించే విధానాలు స్థూలంగా:
1. కుహనా జాతీయవాదం
2. హక్కుల హరణ
3. జాతీయ భద్రత పేరుతో సాయుధ బలగాలపై ఆధారపడటం
4. సమాచార, ప్రసార మాధ్యమాలను గుప్పిటలో ఉంచుకోవడం
5. మతం ద్వారా ప్రభుత్వాన్ని నడపడం
6. తమను ఎదిరించే ‘శత్రువుల’ను ఏకాకులను చేయడం.
7. ఎక్కడా పారదర్శకత లేకుండా చూసుకోవడం.’
‘లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఉద్యమానికి వేదిక కల్పించిన విద్యార్థుల ఉద్యమం తాలూకు ఆకాంక్షలు సోదిలోకి రాకుండా పోయాయి. బలమైన కాంగ్రెసేతర ప్రత్యామ్నాయం గురించిన జేపీ ఆశలూ అడుగంటిపోయాయి. వాటి సమాధుల మీదే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే (మిథ్యా?) ఛత్రం కింద పాత రాజకీయశక్తులే కొత్త ఊపిరి పోసుకున్నాయి. కొత్త నాయకత్వాలు ఉనికిలోకి వచ్చాయి. ఇవన్నీ కాంగ్రెస్కు కార్బన్ కాపీలుగానే రుజువయ్యాయి. కాంగ్రెసేతర శక్తులకు జేపీ పునరుజ్జీవనమిచ్చాడు. కానీ జేపీకి కాంగ్రెసేతర శక్తులు ఏమిచ్చాయనేది శేషపశ్న.’
‘శత్రుదేశాలు కూడా పోట్లాటకు విరామమిచ్చి మాట్లాడుకుంటాయి. దేశంలో ఘర్షించుకునే భిన్నభావజాలాల మధ్య మాటలు ఉండవద్దా? మాటలు లోపించిన శూన్యాన్ని చావులతో నింపుదామా? ఉమ్మడి అజెండాతో కలసి పనిచేయడానికి రాజ్యాంగం పరచిన వేదికను గుర్తిద్దామా?’
– మహానామ
(నేడు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా..)