ప్రత్యేక రాష్ట్రంలో ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వ పథకం అందింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఉన్న అన్ని కుటుంబాలకు ఏదో ఒక పథకం లేదా ఒక్కో కుటుంబానికి రెండు అంతకుమించి పథకాలు అందాయి. అంతేకాదు అభివృద్ధి ఫలాలు పథకాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సబ్బండ వర్గాలకు చేరాయి. ఇవే కేసీఆర్ను రాబోయే ఎన్నికల్లో సునాయాసంగా గెలిచేలా చేస్తున్నాయి.
కేసీఆర్ గెలుపు ఖాయమంటూ అనేక సర్వేలు చెబుతున్న మాట వాస్తవం. సర్వేలు చేస్తున్న సంస్థలు, చెప్తున్న విషయాలు అంత ఆషామాషీగా తీసుకోరాదు. సర్వేల వెనుక క్షేత్రస్థాయిలో జరిపిన అధ్యయనం, అన్ని వర్గాల ఓటర్ల అభిప్రాయాలు ఉంటాయి. సర్వే ఏదైనా గెలిచేది కారేనని ముక్తకంఠంతో చెప్తున్నాయి.
వాస్తవానికి సర్వేలే కాదు. సామాన్యులు కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారనే చెప్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో తొమ్మిదేండ్లుగా తెలంగాణ ప్రజలు కనీవినీ ఎరుగని పథకాలు, ప్రగతిని చూస్తున్నారు. దేశం నివ్వెరపోయేలా చేస్తున్న కార్యక్రమాలే కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతాయని అంటున్నారు. దీనికి ప్రాతిపదికలు ప్రగతి రూపంలో చాలా ఉన్నాయి.
రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యం గత ఏ ఇతర ప్రభుత్వాలు ఇవ్వలేదంటే అతిశయోక్తి కాదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే పింఛన్లు. రాష్ట్రంలో దాదాపు అన్ని వర్గాలు కలిపి 44,12,882 మం ది పింఛన్లు పొందుతున్నారంటే తెలంగాణలో సంక్షేమం ఏ మాదిరిగా ఉందో మనం అంచనా వేయవచ్చు.
పింఛన్లు ఒక్కటే కాదు. రాసుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల ద్వారా ఆడబిడ్డల పెండ్లికి ప్రభుత్వం ద్వారా రూ.1, 00,116లు అందుతున్నాయి. దివ్యాంగులకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 1,25,145 చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు 13,32,964 మంది నిరుపేద ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభు త్వం కల్యాణలక్ష్మి కింద దాదాపు రూ.12 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇక ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికింద రూ.10 లక్షల గ్రాంటును అందజేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 38,323 మంది దళితులను గుర్తించి రూ.3832.30 కోట్లను అందజేసింది. షెడ్యూల్డ్కులాల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ.92,640.41 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
అదేవిధంగా సామాజిక సమానత్వం సాధించడంలో భాగంగా కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రూ.2.5 లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నది. ఇప్పటివరకు 6,315 మంది జంటల కులాంతర వివాహాలకు ప్రోత్సాహాన్ని అందించింది. ఎస్సీ హాస్టళ్ల నిర్వహణ కోసం రూ.1976.91 కోట్లు ఖర్చు చేసింది. అంబేద్కర్ ఓవర్సీస్ కింద విదేశాల్లో విద్య కోసం రూ.20 లక్షల స్కాలర్ షిప్ను అందిస్తున్నది ప్రభుత్వం. ఇప్పటివరకు 1031 మందికి రూ.179.92 కోట్లను అందజేసింది. దళితులకు మూడెకరాలు కింద గడిచిన పదేండ్లలో 17,097.09 ఎకరాలను ప్రభుత్వం 6,998 మందికి అందజేసింది. దీనికోసం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక రూ.769.17 కోట్లను ఖర్చుచేసింది. దళితులను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు 1,60,914 మందికి 2013.64 కోట్ల రూపాయలను సబ్సిడీ ద్వారా అందజేసింది. ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి ఇంటికి 101 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందజేసింది.
ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు గురుకు ల పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేసింది. స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది.ఎస్టీ సబ్ ప్లాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.43,936.32 కోట్లను ఖర్చు చేసింది. గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలను మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. పోడు పట్టాలు అందజేయడంతోపాటు గిరిజనులపై ఉన్న కేసులను ఎత్తివేసింది.
బీసీ సంక్షేమంలో భాగంగా లక్ష రూపాయలను అందజేస్తున్నది. 119 నియోజకవర్గాల్లో కలిపి 5950 మందికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలను మంజూరు చేసి వాటి కోసం విలువైన స్థలాలను కేటాయించింది. బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. నేతన్నకు సాయం వంటి కార్యక్రమాలను చేపట్టింది. బీసీల కోసం ఇంకా అనేక పథకాలున్నాయి.
షాదీముబారక్ పథకం కింద వివాహ సమయంలో రూ. 1,00,116 లను ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తుం ది. గడిచిన పదేండ్లలో 2,68,230 మంది పెళ్లిండ్లకు రూ. 2,258.17 కోట్ల ను ప్రభుత్వం ఖర్చు చేసింది. విదేశీ విద్య కోసం మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 2751 మంది పిల్లలకు ఒకొక్కరికీ రూ.20 లక్షల చొప్పున రూ.438.66 కోట్లు అందజేసింది. ఇమాం మౌజంలకు గౌరవ వేతనం అందించింది. బీసీల మాదిరిగానే వీరికి లక్ష రూపాయల సాయం అందిస్తున్నది. ఇక రైతాంగం విషయానికి వస్తే రైతులకు మద్ధతు ధర చెల్లించి పండిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. గతంలో దళారులు చొరబడి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నష్టపరిచేవారు. అదేవిధంగా రైతుబంధు పథకం విప్లవాత్మకమైనది. దీనికి ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందా యి. ఆగస్టు 2023నాటికి 10 విడతల్లో 68,99,076 మంది రైతులకు రైతుబంధు కింద రూ.74,815 .09 కోట్లను పంట పెట్టుబడి సాయంగా అందజేసింది. రూ.37 వేల కోట్లు రుణమాఫీ చేసింది ప్రభుత్వం.
కేసీఆర్ కిట్, గర్భిణులకు కేసీఆర్ పోషకాహార కిట్ వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టి కేసీఆర్ ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటున్నది.వైద్యరంగంలో అనేక సంస్కరణలు చేపట్టింది. జిల్లాకో మెడికల్ కళాశాల, బస్తీ దవాఖానాలు, డయాలిసిస్ సెంటర్లు, డయోగ్నస్టిక్ సెంటర్లతో వైద్య రంగాన్ని ప్రజల చెంతకు తెచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.
అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ద్వారా త్రాగునీరు అందించడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల నిర్మాణం, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రపంచస్థాయి సాగునీటి ప్రాజెక్టుల వంటి అభివృద్ధి తెలంగాణకు సొంతం. ఇలా అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు రూపకల్పన చేయబడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే ‘హనుమంతుడి గుడిలేని ఊరు లేదు. కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదు.’ లబ్ధిపొందిన ప్రతి వ్యక్తి తన ఓటును కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్కు వేస్తారు. కారు గెలుపు సారు గెలుపు ఖాయమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
(వ్యాసకర్త : బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
– పీ.ఎల్.శ్రీనివాస్ 73374 01177