కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడి పని చెప్తాం. రెడ్ డైరీ రాస్తున్నాం, అందులో అందరి జాతకాలుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడి పని చెప్తాం. రెడ్ డైరీ రాస్తున్నాం, అందులో అందరి జాతకాలుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చేదాకా మేము ఆగలేం, ఇప్పటికే మీ మీద ఎల్లో డైరీ (టీడీపీ రంగు) రాయడం మొదలు పెట్టామంటున్నారు ఆ పార్టీ సీనియర్లు. కాంగ్రెస్ వారిని పక్కనబెట్టి టీడీపీ వారికి ఎక్కడెక్కడ టికెట్లు ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు, మండల, జిల్లా కమిటీల్లో టీడీపీ వారిని జొప్పించేది, సీనియర్లకు ఏ విధంగా పొగబెట్టేది ఈ డైరీలో ఉంటుందని అంటున్నారు. వరంగల్లో పొన్నాల, నల్లగొండలో ఉత్తమ్, కోమటిరెడ్డి, ఖమ్మంలో భట్టి, సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఎల్లో డైరీ రాసే పనిలో ఉన్నారని గాంధీభవన్లో వినికిడి.
జ్యోతిష్యమే బెటర్!
జర్నలిజం కంటే జ్యోతిష్యమే బెటర్ అంటున్నాయి తెలుగు న్యూస్ చానల్స్. రాజకీయపార్టీలు మంచి ముహూర్తం కోసం అధిక శ్రావణం మంచిది కాదని, మొన్నటిదాకా అభ్యర్థుల కసరత్తు పక్కనపెడితే, తమకు అలాంటి పట్టింపులు ఏమీ లేవని చానల్స్ ఆషాడంలోనే అభ్యర్థుల జాబితాలు ప్రకటించేశాయి. పార్టీలు చేయాల్సిన పనంతా చానల్స్ చేసి పెట్టడంతో ఇక నామినేషన్లు వేయడం ఒక్కటే మిగిలింది. దానికి ఇంకా టైమ్ ఉండటంతో ప్రకటిత అభ్యర్థులు ఎన్నికల రథాలకు ఆర్డర్ ఇచ్చినట్టు సమాచారం. నామినేషన్ వేసే పని అయినా పార్టీలకు అవకాశం ఇస్తాయా? లేక ప్రకటిత అభ్యర్థులతో వేయిస్తాయా? చూడాలి. రాజకీయపార్టీల సభలు, సమావేశాలు లైవ్లో ప్రసారమవుతుంటే, ఆ పక్కన ‘జ్యోతిష్యం చెప్పబడును’ అని స్క్రోలింగ్లు వస్తున్నాయి. బహుశా అభ్యర్థులకు అవీ ప్యాకేజీలో భాగమేమో!
కాంగ్రెస్ బొనాంజా
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికకు మంచి ముహూర్తం చూసి దరఖాస్తులకు శ్రీకారం చుట్టింది. దరఖాస్తుతో పాటు అభ్యర్థులకు ప్రవర్తనా నియామాళి ప్రకటించింది. టికెట్ వచ్చినా, రాకపోయినా రెబల్గా నామినేషన్ వేయననీ హామీపత్రం రాసివ్వాలి. ఇలాంటి 12 కండిషన్స్ పెట్టింది కానీ, గెలిస్తే పార్టీ మారననే కండిషన్ పెట్టకుండా వెసులుబాటు కల్పించింది. ఒకవేళ పరిస్థితి అటూ ఇటు అయితే పార్టీ మారేందుకు అభ్యర్థులకు బొనాంజా ఇచ్చిందేమో?
ఇదేం ఊతపదం తల్లీ?
రాజకీయ నాయకులకు తమ ప్రసంగాల్లో ఊతపదాలు దొర్లుతుంటాయి. ఏ నాయకుడు ఏ ఊతపదాన్ని పలుకుతాడో జనం ఇట్టే చెప్తారు. వైఎస్ షర్మిల ఊతపదం ఏమిటన్నది తాజాగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది. ప్రెస్మీట్లు, సభల్లో ఎక్కువ సార్లు ఆమె ఉపయోగించిన ఊతపదం ‘మగతనం’గా తేలింది.