మన సరుకుకు మార్కెట్లో డిమాండ్ లేదా? లేక ఎవరైనా అడ్డుపడుతున్నరా? జనం ఆసక్తి కనబరచకపోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నలు ఏదైనా ప్రొడక్టుకు సంబంధించినవి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. తెలంగాణ బీజేపీలో కొత్తగా చేరికలు లేకపోవడానికి గల కారణాలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ పదాధికారులను ఉద్దేశించి వేసిన ప్రశ్నలివీ. దుబ్బాక, హుజూరాబాద్లో గెలిచాం. జీహెచ్ఎంసీలో ఊహించని ఫలితాలను సాధించాం. వీటి తర్వాత వేరే పార్టీల నుంచి పోలోమంటూ వచ్చి పార్టీలో చేరాలి కదా? మరి అలా ఎందుకు జరగడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి మన పార్టీలోకి రాకుండా మనవాళ్లే ఎవరైనా అడ్డుకుంటున్నారా? లేక అడ్డుపడుతున్నారా? అంటూ నడ్డా కురిపించిన ప్రశ్నల వర్షానికి పదాధికారులకు ఊపిరి సలపలేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందినవారు కమలం గూటిలో చేరడానికి క్యూ కడుతారని ఇచ్చిన బిల్డప్ ఏమైందని ప్రశ్నించినట్టు సమాచారం. ‘పార్టీలో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడానికి కారణం మేం కాదు, అధినాయకత్వమే కారణం. మోదీ, షా మొదలుకొని చోటా, మోటా నాయకుల దాకా తెలంగాణపై విషం కక్కుతూ ఉంటే, రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి భవిష్యత్ ఉంటుందో ఎవరైనా అంచనా వేయగలరు. అందుకే పార్టీలో చేరికలు లేవు’ అని పార్టీ సీనియర్ నాయకుడొకరు వివరించడంతో ‘ఓ.. ఐ సీ’ అంటూ నడ్డా నుదురు చిట్లించినట్లు ఆ పార్టీ వర్గాల కథనం.