ఒక రాజ్య పతనంపై ఇంకో రాజ్యం పురుడు పోసుకుంటుంది. కళ్యాణి చాళుక్యుల పతనం తర్వాతే వారి సామంతులైన కాకతీయులు స్వతంత్రులై ఒక పెద్ద సామ్రాజ్యం నిర్మించారు. కళ్యాణి చాళుక్య రాజు రెండవ తైలప మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ అనిశ్చితి నుంచి లాభపడ్డవాళ్లు కందూరు చోడులు, కాకతీయులు. మధ్యయుగ తెలంగాణ చరిత్రలో కొన్ని విషయాల్లో కాకతీయులు ఎంత ముఖ్యమో, కందూరు చోడులూ అంతే ముఖ్యం. రెండూ బలమైన సామంత రాజ్యాలే.
కాకతీయ ప్రోలరాజు, ఆ తర్వాత వచ్చిన రుద్రదేవుడు (మొదటి ప్రతాప రుద్రుడు) కాకతీయ సామ్రాజ్య భవిష్యత్తునే కాదు, కందూరి చోడుల చరిత్రను కూడా మలచినవా రు. కందూరి చోడరాజు ఉదయన చోడుడు కొన్ని భూ భాగాలను గెలుచుకోవడానికి ప్రోలరాజు సహాయం చేశాడు. కళ్యాణి చాళుక్య మూడో తైలపను క్రీస్తుశకం 1157 ప్రాంతంలో కా లాచూరులు ఓడించడంలో కాకతీయ ప్రోలరాజు, కందూరు ఉదయన చోడుడి పాత్ర ఉన్నది. కళ్యాణి చాళుక్య రాజ్యం అంతరించిన తర్వాత ఒకవైపు ఉదయనచోడుడి కొడుకు భీమ చోడు డి రాజ్య విస్తరణ, మరోవైపు ఉత్తర తెలంగాణలోని ప్రాంతాలను గెలుచుకొని దక్షిణ దిశకు పయనమయ్యాడు కాకతీయ రుద్రదేవుడు. ఇదీ నాటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రం.
పానుగల్లును రాజధానిగా చేసుకొని కందూరి చోడుల మొదటిరాజు మొదటి ఏరువ భీమదేవ చోడుడు (క్రీస్తుశకం 1040-1050) పాలన మొదలుపెడితే గోకర్ణదేవ చోడ మహారా జు (క్రీస్తుశకం 1109-1136) రాజధానిని పానగల్లు నుంచి వర్ధమాన పురానికి మార్చిన ట్టు బి.ఎన్.శాస్త్రి భావిస్తున్నారు. నేటి నాగర్కర్నూల్ జిల్లాలోని వడ్డెమాను కందూరుచోడుల వర్ధమానపురం. కందూరి చోడులను కాకతీయ సామంతులుగా చేసిన విధాన్ని రుద్రదేవుడి హనుమకొండ శాసనం చెప్తుంది. ‘తనపై రుద్రదేవుడు యుద్ధానికి వస్తున్నాడని తెలిసి భీమదేవచోడుడు వర్ధమాన పురాన్ని విహ్వలాంగుడై తల్లియు, అన్నదమ్ములు, భార్యలు వెంటరాగా.. సిగ్గులేనివాడై అడవులకు పారిపోయెను అనీ, అతన్ని వెంటతరిమి హనుమంతుడు లంకను కాల్చినట్టు రుద్రుడు చోడోదయుని నగరాన్ని (వర్ధమానపురాన్ని) కాల్చి, అడవిలాగ చేశాడని, అక్కడే ఒక పెద్ద చెరువును తవ్వించాడని’ శాసనంలో వర్ణించారు. ఆ తర్వాత రుద్రదేవుడు, భీమచోడుడిని బంధించి, అతడి సోదరి పద్మావతిని పెళ్లిచేసుకొని సామంతుడిగా చేసుకున్నాడు. దీనితర్వాత కందూరు చోడులు పానుగల్లు ప్రాంతానికి అంటే నల్గొండ ప్రాంతానికి పరిమితమయ్యారు. మన్ననూర్ ప్రాంతంలో ఉన్న శిథిలమైన కోటచోడులు కట్టించిందేననీ, దానినే రుద్రదేవుడు బాగు చేయించాడనీ కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు.
కాకతీయరాజ్యం విస్తరించి సామ్రాజ్యంగా మారే క్రమంలో కందూరు చోడులను రుద్రదేవుడు ఓడించి సామంతులుగా చేసుకోవడం ఒక ముఖ్య ఘట్టం. ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యం దక్షిణ దిశగా విస్తరించి నేటి ఆంధ్ర ప్రాంతాలను, తూర్పు తీరాన్ని చేరుకోవాలనుకుంటే కృష్ణానది పరీవాహక ప్రాంతంపై అధిపతులైన కందూరు చోడులను ఓడించి సామంతులుగా చేసుకోవడం తప్పనిసరి. రుద్రదేవుడు కాకతీయ సామ్రాజ్య విస్తరణకు ఆ షరతును పూర్తిచేశాడు.
నాటి మెగా ప్రాజెక్టు ఉదయసముద్రం: ఒక మధ్య యుగంనాటి నీటి పారుదల ప్రాజెక్టు నేటికీ మోడల్గా నిలిచిన చెరువు ఉదయ సముద్రం. నల్గొండ పట్టణం దగ్గరి పానుగల్లు పక్కనే ఉదయనచోడుడు (క్రీ.శ.1109-1136) కట్టించిన ఈ తటాకాన్ని ఉదయాదిత్య సముద్రం అని కూడా పిలిచారు. ఇది ఈ ప్రాంతం అంతటికీ ఒక పెద్ద నీటి వనరుగా నిలిచింది. అప్పటినుంచి కుతుబ్షాహీల వరకు శాసనాల్లో ఈ ప్రాముఖ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇబ్రహీం కుతుబ్షాహీ నాటి శాసనంలో.. ‘పానుగంటి ఉదయ సముద్రం కాలువ ఇందుపురేల (ఇంద్రపాలనగరం) సీమలో.. నమిలె (గ్రామం పేరు) మొదలుకొని కృష్ణా (నది) ఈ మధ్య చెరువులు కుంటలు నిండి..’ అని ఉన్నది. దీంతో నల్గొండలోని ఈ ప్రాంతాన్నంతా ఉదయసముద్రం ఎట్లా సస్యశ్యామలం చేసిందో తెలుస్తుంది. అందుకే ఇక్కడ విస్తరించిన వ్యవసాయం, వర్తకానికి మూసీ, కృష్ణా సంగమంలో రెండవ చోడరాజు ఏరువ తొండయ పటిష్టం చేసిన ఓడపల్లి (నేటి వాడపల్లి) దుర్గం ప్రముఖ కేంద్రమైంది.
నీడతో మాయ చేసిన అద్భుత నిర్మాణం: ఛాయా సోమేశ్వరాలయం ఒక త్రికూటాలయం. అంటే మూడు గర్భగృహాలతో, ఒకే ముఖ మండపంతో ముగ్గురు దేవుళ్లున్న ఆలయం అన్న మాట. పశ్చిమవైపున ఉన్న శివాలయంలో శివలింగంపై సూర్యోదయం నుంచి సూర్యాస్తమ యం వరకు నీడ ఉంటుంది. అందుకే దీన్ని ఛాయా సోమేశ్వరాలయం అన్నారు. ఈ విచిత్రాన్ని శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే.. ‘ఆప్టికల్ ఇల్యూషన్’ అని ఈ గుడి మీద, శివలింగంపై పడే నీడ మీద పరిశోధించినవాళ్లు చెప్తున్నారు. గుడిలో వెలుతురు పడేలా రెండువైపుల నుంచి ఒక గోడ, స్తంభం ఉంది. అక్కడినుంచి శివలింగానికి రెండువైపులా వెలుతురు పడి, వెలుతురు పడనీ చోట చీకటి.. మనకు నీడ లాంటి భ్రమ ను కల్పిస్తుందని తేల్చారు. ఏదేమైనా ఎనిమిది దశాబ్దాల కిందట భౌతికశాస్త్ర సూత్రాలతో చేసిన ఈ నిర్మాణం ఆల య వాస్తు కళలో చిరకాలంగా నిలిచేది. మొదట దీన్ని అభినవ సోమేశ్వరాలయం అనేవారని రుద్రమదేవి శాసనం ద్వారా తెలుస్తున్నది. క్రీ.శ.12వ శతా బ్దం నాటి ఈ కట్టడం ఎవరు కట్టారనే దానికి ఆధారం లేకపోయినా, ఇది కందూరు చోడుల నిర్మాణంగానే భావించాలి. నక్షత్ర ఆకారంలో ఉండే ఆలయాల నిర్మా ణం కళ్యా ణి చాళుక్య కాలంలో ఉంది. అందుకే దాన్నే అనుకరించి పానుగల్లు ఆలయాలను నిర్మించారు.
డా. ఎం.ఎ. శ్రీనివాసన్
81069 35000