అమిత్ షా అరుపులు, మోదీ విన్యాసాలతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. మొత్తానికి పరేడ్గ్రౌండ్లో పాత రామాయణమే పఠించి ప్రజలకు ‘చెవిలో పువ్వులు’ సినిమా చూపించారు. సమాధానాలు ఆశించిన రాష్ట్ర పౌర సమూహానికి దబాయింపులు వొడ్డించారు. మేమెన్నటికీ మారని మొరటు మనుషులమేనని బీజేపీ నాయకులు మరోసారి నిరూపించుకున్నారు. దేశ ప్రజలు విశ్వాసంతో భుజాల మీద మోపిన బాధ్యతలను విస్మరించి, మరుగుజ్జులుగా కమలం పార్టీ నాయకగణం ప్రవర్తించిందని సమావేశాల తీరును చూసిన తర్వాత అర్థమౌతున్న వాస్తవం.
దేశ పాలనాపగ్గాలు చేపట్టిన రాజకీయ పార్టీ నిర్వహించే కీలకమైన జాతీయ కార్యవర్గ సమావేశాల నుంచి జాతి మొత్తం ఉదాత్తమైన సందేశాన్ని ఆశిస్తుంది. అందునా ‘దేశభక్తుల లేబుల్ ధరించిన రాజకీయవ్యవస్థ నుంచి దేశం పట్ల చిత్తశుద్ధితో కూడిన అజెండాను ప్రజలు ఆశించడం సహజం. సమస్తరంగాలు, సకలజనుల సౌభాగ్యం కోసం లోతైన మేధోమథనం జరిపి దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను రూపొందిస్తారని ఆలోచనపరులందరూ విశ్వసిస్తారు. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలైన జాతి సమైక్యత, సమగ్రత, ప్రజాస్వామిక సమసమాజం స్ఫూర్తితో ప్రపంచంలోనే భారతదేశాన్ని ఆదర్శ రాజ్యంగా నిలిపే దిశగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో లోతైన చర్చలు జరుగుతాయని బుద్ధిజీవులు భావిస్తారు. కానీ మొన్నటి సమావేశాలు ప్రగతిశీల దిశగా కాకుండా పొగడ్తలు, పరనిందలు, పరిమిత లక్ష్యాలను దాటలేకపోయామన్నది స్పష్టమవుతున్నది. తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలన్న విస్తరణవాద, ఆకాంక్షకు మాత్రమే సుదీర్ఘకాలంగా దేశాన్ని పాలిస్తున్న జాతీయపార్టీ కార్యవర్గ సమావేశాల లక్ష్యం పరిమితం కావడం నిజంగా విషాదం.
75 ఏండ్ల స్వాతంత్య్ర భారతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అత్యల్ప వృద్ధిరేటు, ఆర్థిక అసమానతలు, సామాజిక ఘర్షణలు ఇలా ఎన్నో రుగ్మతలు దేశాన్ని వెంటాడుతున్నాయి. వాటిపై దృష్టిసారించి, దేశాన్ని బాధల నుంచి బయటపడేసే మార్గాలు అన్వేషించే దృష్టితో నిర్వహించాల్సిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను బండి సంజయ్ లాంటి మతిలేని నేతల ఎండమావుల కల కేంద్రంగా జరపడం దేశ రాజకీయవ్యవస్థలో హాస్యాస్పద చర్యగా మిగిలిపోతుంది. ఈ సమావేశాల్లో బీజేపీ అనుసరించిన తీరు, తెలంగాణ రాష్ట్రం పట్ల వారి భావదారిద్య్రానికి అద్దం పట్టేలా ఉన్నది. ఎడారిలో ఇసుక వ్యాపారానికి బయల్దేరిన వ్యాపారుల్లా, ఆ పార్టీ జాతీయ నాయకులు, సీఎంలు, కేంద్రమంత్రులు, రాష్ర్టాల మంత్రులు అంతా తోడేళ్లమందలా రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలను చూస్తే ‘నవ్విపోదురుగాని నాకేంటి సిగ్గు’ సామెత గుర్తుకువచ్చింది.
దశాబ్దాల పాటు అనేక భావజాలాలకు, రాజకీయ ప్రయోగాలకు కార్యక్షేత్రంగా మారిన తెలంగాణ, ఆ అనుభవాల దన్నుతో విభిన్నమైన సామాజిక చరిత్రను నిర్మించుకున్నది.దాన్ని అర్థం చేసుకోకుండా, ఆర్భాటపు ప్రచారంతో, ప్రసంగాల హడావుడితో తెలంగాణలో అధికారంలోకి రాగలమని బీజేపీ కలగనడం నిజంగా విచిత్రం. ఇక్కడి ప్రజా రాశుల సామాజిక విశ్వాసాలకు, బీజేపీ సిద్ధాంతానికి ఎన్నటికీ పొత్తు కలవదు. అది మరిచి తెలంగాణలో నేల విడిచి సాము చేస్తున్నారు.
తరతరాలుగా తెలంగాణ సమాజానికి తనదైన సొంత స్వభావికత ఉన్నది. సామాజిక ఐక్యత, సహజీవనం, లోతైన విశ్లేషణ సామర్థ్యం, ప్రగతిశీల దృక్పథం ఈ నేలకున్న సహజ స్వభావం. దశాబ్దాల పాటు అనేక భావజాలాలకు, రాజకీయ ప్రయోగాలకు కార్యక్షేత్రంగా మారిన తెలంగాణ, ఆ అనుభవాల దన్నుతో విభిన్నమైన సామాజిక చరిత్రను నిర్మించుకున్నది. దాన్ని అర్థం చేసుకోకుండా, ఆర్భాటపు ప్రచారంతో, ప్రసంగాల హడావుడితో తెలంగాణలో అధికారంలోకి రాగలమని బీజేపీ కలగనడం నిజంగా విచిత్రం. ఇక్కడి ప్రజా రాశుల సామాజిక విశ్వాసాలకు, బీజేపీ సిద్ధాంతానికి ఎన్నటికీ పొత్తు కలవదు. అది మరిచి తెలంగాణలో నేల విడిచి సాము చేస్తున్నారు. దానికి తోడు ప్రధాని మోదీ పర్యటనకు ముందే, తెలంగాణ సమాజం తరఫున సీఎం కేసీఆర్ దేశాన్ని దారి తప్పిస్తున్న అన్యాయమైన కేంద్ర సర్కార్ అభివృద్ధి నమూనాను చర్చకు పెట్టారు.
దేశ ప్రగతిని, పరపతిని విశ్వ విపణిలో వేలం వేస్తున్న మోదీ విధానాల మీద ఆధారపూరిత ప్రశ్నలను సంధించారు. పొరుగు దేశం చైనా పరుగులు దీస్తూ, 16 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధిని నమోదు చేస్తుంటే, మన దేశం ఎందుకు 3 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని అందుకోలేకపోతున్నదని అడిగారు. బొగ్గు కొనుగోళ్ల దగ్గరి నుంచి, కేంద్ర సంస్థల అమ్మకం దాకా అనేక అంశాలపై మౌలిక ప్రశ్నలు సమాజం ముందు చర్చకుపెట్టారు. దేశ సంరక్షకుడే సేల్స్మేన్గా మారిపోయి షావుకారు దోస్తుల కోసం జాతి ప్రగతిని, పరువును పణంగా పెడుతున్న వైనాన్ని నిలదీశారు. వీటికి సమాధానాలు ఇవ్వలేని మోసాల మోదీ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ పద్యాన్ని అనుసరిస్తున్నాడు.
అబద్ధాలు, బెదిరింపుల నైజాన్ని ఒంటబట్టించుకున్న ప్రధాని నోటినుంచి తెలంగాణ సమాజానికి మేలు చేసే సందేశం రానే రాదు కదా..! ప్రసంగంలో రింగ్రోడ్లు, ఫ్లై ఓవర్లు అంటూ ప్రధాని స్థాయిని గుజరాత్ రాష్ట్రస్థాయి నాయకుడి స్థితికి దిగజార్చారు. భారత మాతను గుప్పెడు మంది పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్న నరేంద్ర మోదీ దుర్నీతిని దేశమే అసహ్యించుకునే రోజులు దగ్గర్లో ఉన్నాయి. పరేడ్గ్రౌండ్ సభను చూసి ప్రధాని పులకించడం నవ్వు తెప్పించే రాజకీయాంశం. టీఆర్ఎస్ తన ప్రస్థానంలో వందల ఎకరాల శివారులన్నిటినీ జన జాతరలుగా మార్చిచూపింది. ఇప్పటికిప్పుడు ప్రజా నాయకుడు కేసీఆర్ పాదం బయటపెడితే, ప్రజా ప్రభంజనం పోటెత్తుతుంది. రాజకీయ బహిరంగసభలకు బ్రాండ్ అంబాసిడర్ టీఆర్ఎస్.
దేశంలోని బీజేపీ నాయకులందరూ తరలివచ్చి, వారి ప్రవర్తన, ప్రసంగాలతో భావదారిద్య్రాన్ని బయటపెట్టుకున్నారు. తెలంగాణను ఆకట్టుకోవాలంటే ముందు మనసుపరిచి అర్థం చేసుకోవాలి. భిన్న సామాజికవర్గాల అందమైన పొందికను ఆమోదించగలగాలి. స్వయం పాలనలో సాధించుకున్న అభివృద్ధిని కళ్లారా చూడగలగాలి. దానికిమించిన అభివృద్ధి నమూనాను ప్రజలముందు చర్చకుపెట్టి ఆమోదింపచేసుకోగలగాలి. అంతేగాని కేవలం ‘నమో’ నట విన్యాసాలతో ఓట్లు పొందలేరు.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు)
డాక్టర్ ఆంజనేయ గౌడ్
9885352242