అయ్యా.. మోదీ సాబ్ దండాలు. నేను తెలంగాణ రైతును మాట్లాడుతున్న. ఒకప్పుడు మా దగ్గర ఆయిటి మూనిం దంటే సాలు, వాన చుక్క ఎప్పుడు రాలు తదా అని దిగులుగా మొగులు దిక్కు, అప్పు ఎక్కడ పుడుతదా అని బుగులుగా షావుకార్ల ఇండ్ల దిక్కు చూసేటోల్లం. కిస్మత్ తక్కువై ఏ రైతో కాలంజేస్తే ఆ కుటుంబం మొత్తం వీధిన పడేది. ఉన్న ఎకరమో, అరెకరమో అమ్మి అప్పులు గట్టి ఆ కుటుంబం వలసబాట పట్టేది. ఇక కరెంటు విషయంలోనైతే నరకమే. పండుగ లేదు, పబ్బం లేదు. ఊరికి లేదు పల్లెకు లేదు.
రాత్రనకా పగలనకా వచ్చిపోయే కరెంటుతో ఇంటికి, పొలానికి తిరుగుడుకే సరిపోయేది. నిద్రచాలక బాయిలో జారిపడ్డ వాళ్లున్నరు. రాత్రిపూట పాములు కాటేసి చచ్చినవాళ్లన్నరు. ఇంతజేసినా పారేది ఓ ఎకరమో, రెండెకరాలో. కోతనాటికి ఆ కొద్దిపొలంల గూడా కొన దొయ్యలు నీళ్లందక ఎండిపోయేవి. ఇక బ్యాంకులల్ల అప్పు దెస్తే సచ్చిన సావే. పిడుగు మీద పడ్డట్టు బ్యాంకు వాళ్లు చెప్పక, చెయ్యక ఇంటిమీద పడి తలుపు చెక్కల్ని ఊడదీసుకపోయేటోళ్లు. ఇన్ని కష్టాల మధ్య వ్యవసాయం చేసినా చివరికి చేతికచ్చిన పంట దళారీల పాలేనాయె. వాళ్లు అడిగినంతకే అమ్మాలె. ఇచ్చినప్పుడే తీసుకోవాలె. పురుగుమందే మాకు పెరుగు బువ్వ. వరి దొయ్యలే ఉరికొయ్యలు. వడ్ల కల్లాలె దింపుడు కల్లాలు. ఎవుసం జేత్తే ముల్లుగట్టె మిగిలేది కాదు. ఇదయ్యా నాటి మా గోస. రాజులు మారిండ్రు రాజ్యాలు మారినయి కానీ మా బతుకులు మాత్రం మారలేదు.
కాలమెప్పుడు ఒక్కతీరుండది గదా. చీకటి కొన్నొద్దులు వెన్నెల కొన్నొద్దులు. ఇప్పుడు మా గోస తప్పింది. రాకరాక మాకొక రాజచ్చిండు. ఆయిన రైతు రాజ్యమే తెచ్చిండు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన పథకాల వల్ల మా రైతుల బతుకులో వెలుగునిండింది. ఇప్పుడు మాకు ఎవుసమంటే దండుగు గాదు, పండుగు. నష్టం గాదు లాభం. ఎవుసం జేసుకుని ఉన్నంతల అప్పుల బాధ లేకుంట రైతులం కొద్దిగంత తెల్లగ బతుకుతున్నం. అదెట్లంటరా అయితే మీకు మొదట మా ‘రైతుబంధు’ పథకం గురించి జెప్పాలె.
2018ల మా ప్రభుత్వం గొప్పగా ప్రారంభించిన పథకం రైతుబంధు’. ఏడాదికి రెండుసార్లు ఎకురానికి ఐదు వెయిల చొప్పున మొత్తం పది వెయిలు. ఇది రైతుకు పెట్టుబడి పైసలిచ్చే పథకం. ఇప్పుడు విజయవంతంగా తొమ్మిదోసారి అమలవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 68 లక్షల 10 వేల మంది రైతులు అర్హులు కాగా కోటి 50 లక్షల 44 వేల ఎకరాలకు పసలుకు రూ.7,520 కోట్లు దశలవారీగా మా ఖాతాలల్ల జమయితున్నయి. నిన్ననే నా ఖాతాల రూ. 20 వేలు జమైనయి. ఇగ పెట్టుబడి కోసం అప్పు గావాలని తిరిగే బాధే లేదు మాకు.
ఇంకో ముఖ్య విషయం కరెంటు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన్నుంచే రైతులకు రోజుకు 9 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నా 1 జనవరి 2018 నుంచి 24 గంటల పాటు నాణ్యమైన, ఉచిత కరెంటు ఇస్తున్నరు. ఎలాంటి షరతుల్లేకుండా దేశంలోనే ఉచితంగా 24 గంటల వ్యవసాయ కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం మా తెలంగాణనే. వ్యవసాయ విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా రూ.5 వేల కోట్లు రాయితీగా ఇస్తున్నది. అగో అందుకే వరిసాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న పంజాబ్కు సమానంగా మేము ఇప్పుడు పంటను తీస్తున్నం.
అయ్యా.. మీకు ఇంకో పథకం గురించి చెప్పాలె. అది మామూలు పథకం గాదు. మా రైతులకు వరం అనుకోండి. 2018 ఆగస్టు 14న మా ప్రభుత్వం రైతుల కోసం తెచ్చిన కతర్నాక్ పథకం ‘రైతు బీమా’. ఈ పథకం కింద 18 ఏండ్లు నిండి 59 ఏండ్లు దాటని రైతులందరినీ రాష్ట్ర ప్రభుత్వం బీమాలో చేర్చింది. 2018-19లో 32 లక్షల మంది రైతుల కోసం 10 కోట్ల 30 లక్షలు బీమా చేయగా 2020-21లో 1173 కోట్లు, ఈ ఏడాదిలో 1200 కోట్లు కట్టి బీమా చేసి మాకు ధీమా ఇచ్చింది. కిస్మత్ తక్కువై రైతు కాలంజేస్తే వారం రోజుల్లనే భార్యా పిల్లలకు ఐదు లక్షల రూపాలత్తయి. ఏకంగా ఐక్యరాజ్యసమితి గుర్తింపునే పొందిన పథకమట ఇది. 2018లో ఎఫ్ఎన్ఓ సంస్థ రోమ్లో నిర్వహించిన సదస్సులో ప్రపంచవ్యాప్తంగా రైతులకు అమలుచేస్తున్న 20 గొప్ప పథకాలను గుర్తిస్తే అందులో ఈ ‘రైతు బీమా’ ఉన్నదంటే దానిగురించి ఇంకేం జెప్పాలె.
ఇంకో ముచ్చట రుణమాఫీ. అప్పుదేరి అంగట్లుండాలంటరు గదా. అప్పుల కోసమే మా బతుకు అంగడైంది. ఎప్పుడు దెచ్చుకున్నమో బ్యాంకుల గనీ ఎల్లక, యాళ్లకు మిత్తి గట్టక అది మిత్తికి మిత్తయి అసలుతో కలిసి కుప్పయి కూసుంది. 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 నాటికి రాష్ట్రంలో బ్యాంకుల ద్వారా రూ.లక్ష లోపు తీసుకున్న మొత్తం అప్పు రూ.25,9 36 కోట్లున్నయి. వాటిని విడుతలవారీగా మాఫీ చేస్తుండు మా కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా 40.66 లక్షల మంది రైతులకు ఈ రుణమాఫీతో లాభం చేకూరుతుంది. రుణమాఫీకి ప్రభు త్వం 2019-20 బడ్జెట్లో రూ.6 వేల కోట్లు, 2020-21 బడ్జెట్లో రూ.6,225 కోట్లు ఇచ్చింది. ఇగ మాకిప్పుడు అప్పు రంది లేదు. బ్యాంకోళ్లత్తరన్న భయమే లేదు.
ఇగ వడ్లు కొనే సంగతి. ఎవలు కొనుడేంది చివరి గింజ గూడ నేనే కొంటనని మా కల్లాల దగ్గరనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టిండు మా కేసీఆర్ సార్. పండిన పంటకు మంచి మద్దతు ధర ఇచ్చి కొన్నడు. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓపీఎమ్మెస్)ను పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారాన్ని రైతులకు సెల్ఫోన్ ద్వారా అందిస్తుండు. దీనిద్వారా రైతులు ఎక్కడినుంచైనా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జియో ట్యాగింగ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు, మిల్లులపై నిఘా కూడా పెట్టిండు. వడ్లు గొన్న వారం పది రోజులల్ల బ్యాంకుల పైసలు జమయితున్నయి. దేశంలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం మా తెలంగాణనే.
ఇప్పుడు.. లాగోడికి చేతుల పైసలున్నయి. బాయిల నిండా నీళ్ళున్నయి. 24 గంటల కరెంటున్నది. పండిన పంటకు ధరుంది. ఇప్పడు మాకు రందే లెదు. ఇదయ్యా మా కథ. ఇంక చెప్పేటియి మస్తున్నయి. మరోసారి అవన్ని చెప్పుత గని ఒక్కటి మాత్రం నిజం. పెట్టి పొయ్యనోడు పెయ్యంత పుణికిచూసినట్టు, పొల్లు మాటలు కాకుండా రైతుకు రొక్కమిచ్చిన రాజ్యమే సొక్కం. వచ్చిపోయేటోళ్లు కాదు రైతుకు, ఏదన్నా ఇచ్చిపోయేటోళ్లే నిజమైన నాయకులు. అగో అసొంటి నాయకుడు మా కేసీఅర్. దండాలయ్యా.. పోవాలె. బ్యాంకుల పైసలు తెచ్చుకొని తుకం పోసుకోవాలె, ఉంటానయ్యా..
పెద్దింటి అశోక్ కుమార్
94416 72428