అనేక ఉద్యమ పునాదులపై ఏర్పడిన వరంగల్ నగరానికి ముప్పై ఏండ్ల కిందట ప్రధాని హోదాలో పీవీ నరసింహారావు వచ్చారు, వెళ్లారు. ఆ తర్వాత నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని తెలువగానే వరంగల్ ప్రజలతో సహా తెలంగాణ ప్రజలందరూ ఉదయం 10 గంటల నుంచి టీవీలకు అతుక్కుపోయారు.
నిన్న మోదీ సార్ వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారని టీవీలో చెప్పగానే అమ్మవారికి ఇక మంచిరోజులు వచ్చాయని చాలా సంబురపడిపోయాం. మోదీ ఏదైనా కొత్త విషయం చెప్తారని ఆసక్తిగా టీవీ చానల్ను మార్చిమార్చి చూశాం. కానీ, ఏ చానల్ పెట్టినా దర్శించుకున్నారు, వెళ్లిపోయారన్న సంగతి తప్ప వేరే ఏ కొత్త విషయమూ ఆయన చెప్పలేదు. మోదీ సార్ మీడియాకు తెలువకుండా భద్రకాళి అమ్మవారికి నిధులు ఇచ్చిండేమో అనుకున్నాం. కానీ, మా ఆశ నిరాశే అయింది. గల్ల పెట్టెల డబ్బులు వేయకపోగా, అమ్మవారి ఆలయాభివృద్ధికి నిధులు కూడా ఇవ్వలేదు.
భారీ ఎత్తున సభ సాక్షిగా, ప్రజల చప్పట్ల మధ్య వరంగల్కు పెద్ద ఎత్తున నిధులు ప్రకటిస్తాడులే అని ఆశగా ప్రధాని ప్రసంగం కోసం ఎదురుచూశాం. తాను ప్రసంగం తెలుగులో మొదలుపెట్టే సరికి మా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. సమ్మక్క-సారక్క పేరు ఎత్తగానే ఆ అడవి తల్లులకు, ములుగు జిల్లాకు మంచిరోజులు వచ్చాయనుకున్నాం. ఆదివాసి బిడ్డల కోసం ప్రత్యేక ప్యాకేజీ కింద ఓ వెయ్యి కోట్లు ఇస్తాడనుకున్నాం. ట్రైబల్ యూనివర్సిటీకి ఓ వంద కోట్ల నిధులిచ్చి దాన్ని ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్తాడనుకున్నాం. కానీ, సారు నిధుల గురించి చెప్పలేదు, ఆదివాసుల అభివృద్ధి గురించీ మాట్లాడలేదు.
తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఏమైనా ప్రకటిస్తాడేమోనని ఎదురుచూశాం. ఈ లోపల తెలంగాణ విశ్వవిద్యాలయాల గురించి ప్రస్తావించారు. మాలో ఏదో తెలియని సంతోషం. తెలంగాణ విశ్వవిద్యాలయాలకు యూజీసీ నిధులు ఇస్తాడు కావచ్చని పొల్లు పోకుండా వింటున్నాం. కొత్త రాష్ట్రమైన తెలంగాణలోని వరంగల్లో ఐఐఎం ఏర్పాటు ప్రకటిస్తుండనుకున్నాం. కానీ, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును అబాసుపాలయ్యే రీతిలో అప్పజెప్పారు. యూనివర్సిటీ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఫైల్ను గవర్నర్ రాష్ట్రపతికి పంపిన విషయం కూడా మోదీకి తెలువదని విని విస్తుపోయాం.
కేవలం విమర్శ కోసం. తెలంగాణలో 3 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని సభలో మోదీ ప్రకటించడం విన్నవాళ్లు ఆశ్చర్యపోయారు. తెలంగాణ నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నప్పుడు దేశవ్యాప్తంగా 12 లక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నింపడానికి రేపటి నుంచే అన్ని శాఖల్లోని అధికారులు ఆదేశించి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాడనుకున్నాం. కానీ, మోదీజీ అదేం చేయలేదు. దేశవ్యాప్త నిరుద్యోగిత రేటు 2023లో 7.8 ఉంటే, తెలంగాణలో నిరుద్యోగిత రేటు 5.8 శాతం మాత్రమే. దేశ సగటు కంటే మెరుగైన ఉద్యోగిత తెలంగాణలో లభిస్తున్న క్రమంలో విమర్శ కోసమే మోదీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని తెలంగాణ ప్రజలు టీవీలు బంద్చేసి నిరుత్సాహంతో, బాధతో ఆవేదన చెందారు.
బైరి నిరంజన్
93901 15644