భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. వాతావరణ పరిస్థితులు, నదీ ప్రవాహాలు, నీటి వసతి లేని ప్రాంతాలు… ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతీ అంశంలోనూ వైవిధ్యం కనిపిస్తుంది. జమ్మూకశ్మీర్లో ఆకాశాన్ని తాకే కొండలు, వాటిని కప్పేసిన మంచు, కేరళలో నదీ ప్రవాహాలు, పచ్చని ప్రకృతి… ఇలా ప్రతీ ప్రాంతం అక్కడి పరిస్థితుల వల్ల ప్రత్యేకతను సంతరించుకుంటుంది. కాబట్టి కేంద్రం కూడా ఏదైనా పనిచేసినా, పథకం ప్రవేశపెట్టినా ప్రతీ రాష్ర్టానికి, అక్కడి పరిస్థితులకు తగినట్టుగా ఉండాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో అమలు చేస్తున్న పథకాలు చెప్పుకోవడానికే తప్ప, అంతగా ఫలితాలనివ్వడం లేదు.
భిన్న పరిస్థితులున్న మన దేశంలో ‘వన్ నేషన్.. వన్ స్కీమ్’ అంటే కుదరని పని. అయినా కేంద్రం తన పట్టు వీడటం లేదు. అందరికీ పనికొచ్చేలా పథకాలను తయారు చేయలేనప్పుడు మరో విధానాన్నైనా అనుసరించాలి. తమ ప్రజలకు పనికొచ్చేలా పథకాలను రూపకల్పన చేయమని రాష్ర్టాలకు సూచించవచ్చు. రాష్ర్టాలకు నిధులిచ్చి కేంద్రం అమలుచేయవచ్చు. రాష్ర్టాలకు నిధులిచ్చే ఉద్దేశం కేంద్రానికి లేకపోతే, రాష్ర్టాలు పథకాలు రూపొందించాక వాటి అమలు బాధ్యతను కేంద్రమే తీసుకోవచ్చు. కానీ దేశంలో ఇప్పటివరకు అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు. కొన్ని రాష్ర్టాలకు అవసరం లేని పథకాలను బలవంతంగా రుద్ది, వాటిని అమలుచేయడం లేదంటూ బీజేపీ నాయకులు కుటిల రాజకీయం చేస్తున్నారు.
తెలంగాణకు పీఎం కుసుమ్ భారం ఎందుకు?: వ్యవసాయరంగంలో సౌర విద్యుత్ వాడకాన్ని పెంచేందుకు తీసుకొచ్చిన పథకమే పీఎం కుసుమ్. వ్యవసాయ బావుల దగ్గర సౌర ఫలకాలు ఏర్పాటు చేసి, విద్యుత్ ఉత్పత్తి జరిపి దానిని మోటారు నడిపేందుకు వాడుకోవాలి. పూర్తిగా కరెంటు సదుపాయం లేని ప్రాంతాల్లో ఇది మంచి పథకమే. కానీ తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నది. కేంద్రం చెప్పినట్టు పీఎం కుసుమ్ పథకంలో చేరి సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుంటే రైతులకు మోయలేని భారమవుతుంది. రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా అందుతున్నప్పుడు ‘పీఎం కుసుమ్ పథకం’లో చేరాల్సిన అవసరం ఇక్కడి రైతులకు ఏమున్నది?
ఆయుష్మాన్ భారత్: రాష్ర్టాలపై కక్ష సాధించేందుకు కేంద్రం వినియోగిస్తున్న మరో పథకం ‘ఆయుష్మాన్ భారత్’. వాస్తవానికి ‘ఆరోగ్య శ్రీ’ పథకం అమలులో ఉన్న తెలంగాణ, ఏపీ వంటి రాష్ర్టాలకు ‘ఆయుష్మాన్ భారత్’ అవసరం లేదు. దీన్ని అమలుచేస్తే పేదలకు నష్టమే తప్ప, లాభం లేదు. తెలంగాణలో ఆరోగ్య శ్రీ కింద దాదాపు 70 లక్షలకు పైగా కుటుంబాలు ఉచిత వైద్యం అందుకుంటున్నాయి. కరోనా చికిత్సను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీలో చేర్చింది. తెల్ల రేషన్ కార్డున్న ప్రతీ ఒక్కరూ ఆరోగ్య శ్రీకి అర్హులవుతారు. అలాగే ఉద్యోగులు, పింఛనర్లు, జర్నలిస్టులకు హెల్త్కార్డుల ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నది. కానీ ‘ఆయుష్మాన్ భారత్’కు మాత్రం కేంద్రం అడ్డగోలు కండీషన్లు పెట్టింది. ఉదాహరణకు.. కుటుంబంలో ఏ ఒక్కరైనా నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ సంపాదిస్తే ఆ కుటుంబానికి ‘ఆయుష్మాన్ భారత్’ స్కీమ్ వర్తించదు. 70 లక్షల కుటుంబాలకు అందుతున్న స్కీంను పక్కనపెట్టి, లక్ష మందికి మాత్రమే అందే పథకాన్ని అమలు చేయాలని బీజేపీ నేతలు గోల గోల చేస్తున్నారు. అయినా, టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఆయుష్మాన్ భారత్’ను ‘ఆరోగ్య శ్రీ’తో కలిపి అమలు చేస్తున్నది.
కార్పొరేట్ల జేబులు నింపుతున్న ‘పీఎం ఫసల్ బీమా యోజన’: పంటల బీమా పథకం ఉద్దేశమే పంట నష్టపోయిన రైతులకు ఆర్థికంగా బాసటగా నిలవడం. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టి కార్పొరేట్ల జేబులు నింపే పనిచేస్తున్నది. ఈ పథకం తీసుకొచ్చాక గత ఐదేండ్లలో దాదాపు రూ.40 వేల కోట్లు బీమా సంస్థలకు వెళ్లాయి. రైతులకు ఒరిగిన మేలు మాత్రం పిసరంతే. రైతులకు ఉపయోగం లేని స్కీమ్ తమకు ఎందుకని ఇప్పటికే మన రాష్ట్రంతో పాటు బీహార్, జార్ఖండ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చేశాయి. బీజేపీ అధికారంలో ఉన్న, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కూడా ఈ పథకాన్ని పక్కన పెట్టింది. పశ్చిమబెంగాల్ సొంతంగా బీమా పథకాన్ని తయారు చేసుకున్నది.
అక్కరకొచ్చే పథకాలకు మంగళం: మోదీ సర్కారు తీసుకొచ్చే పథకాలు ప్రచార ఆర్భాటాలకే తప్ప, వాస్తవంగా పనికొచ్చేవి తక్కువ. తెలంగాణ రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి పీఎం కిసాన్ సమ్మాన్ యోజన తీసుకొచ్చారు. ఏటా రూ.6 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. అయితే.. ఏ పథకం అయినా ప్రారంభించిన నాటి నుంచి రోజులు గడిచిన కొద్దీ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది. కానీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో మాత్రం ఇది తిరోగమనంలో ఉంది. ఈ స్కీమ్ ప్రారంభించిన సమయంలో 11.84 కోట్ల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. ఇప్పుడు 3.87 కోట్ల మంది ఉన్నారు. 2024 కల్లా దేశంలోని ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు ఇస్తామని ‘జల్ జీవన్ మిషన్’ పథకాన్ని మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. కానీ ఇప్పటికే తెలంగాణలో వంద శాతం ఇండ్లకు ‘మిషన్ భగీరథ’ ద్వారా మంచి నీరందుతున్నది. అలాంటప్పుడు ఈ పథకంతో తెలంగాణకు ఉపయోగం ఏమిటి?
మరోవైపు ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పేరుతో కేంద్రం ఓ పథకాన్ని అమలు చేస్తున్నది. ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది దీని లక్ష్యం. అయితే ఇప్పటికే చాలా రాష్ర్టాలు పేదలకు ఇండ్లు నిర్మించే పథకాలను ప్రారంభించాయి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో బంగ్లా ఆవాస్ యోజన పథకం ఉంది. ‘అవసరం ఉన్నా లేకున్నా.. మేం చెప్పిందే రాష్ర్టాలు వినాలి. మేం చెప్పిందే చేయాలి. లేకపోతే పైసా ఇవ్వబోమ’ంటూ ప్రధాని లాంటివారే బహిరంగంగా అల్టిమేటం జారీ చేస్తున్నారు. మనకు అవసరం లేని పథకాలు అమలు చేయాలంటూ బలవంతంగా రాష్ర్టాలపై రుద్దుతున్నారు. ఇకనైనా కేంద్రం తన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(వ్యాసకర్త: చైర్మన్, టీఎస్ రెడ్కో)
వై.సతీష్ రెడ్డి
96414 66666