2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రెట్టింపు మాటేమో కానీ పెట్టుబడి వ్యయాన్ని మాత్రం రెట్టింపు చేసింది! వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి రైతులను తమ పొలాల్లోనే కూలీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. సబ్సిడీ, రుణమాఫీలతో కార్పొరేట్ వ్యవస్థకు వంతపాడుతూ దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతన్నకు వెన్నుపోటు పొడుస్తున్నది. మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ వారిని సంక్షోభంలోకి నెట్టేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ రైతాంగం ఆందోళన చెందుతున్నది. వ్యవసాయరంగంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్రం మూడు సాగు చట్టాలు తీసుకువచ్చి విఫలమైంది. ఇప్పుడు కేంద్రం వ్యవసాయ కరెంట్ మోటర్లకు మీటర్లు బిగించే చట్టాన్ని తెచ్చి రైతులకు భారాన్ని మోపేందుకు ప్రయత్నించటం గర్హనీయం. ఇప్పటికే రైతులు అనేకవిధాలుగా వ్యయభారాలతో కుంగిపోతున్నారు. దీనికి తోడు ఇప్పుడు కరెంటు బిల్లులు వసూలు చేయాలనటం విడ్డూరం. ఈ పరిస్థితుల్లోనే రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నది. అయినా కేంద్రం తెచ్చే రైతు వ్యతిరేక చట్టాల వల్ల మీటర్లను బిగించే పరిస్థితి ఏర్పడుతున్నది.
ఇది చాలదన్నట్లు.. 2022 జనవరి 12న ఎరువుల ధరలు కేంద్రం 50 శాతం పెంచింది. దీనికి అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ముడిసరుకు ధరలు పెరగటమే కారణమంటూ సాకులు చెప్తున్నది. ఆరేండ్లుగా కేంద్రం ఎరువుల ధరలను పెంచుతూ పోతున్నది. దానికి యూరియా, డీఏపీ వినియోగాన్ని తగ్గించేలా చూడాలని రాష్ర్టాలకు చెప్తున్నది. రైతులు ఎక్కువగా వాడే 28.28.0 ఎరువు ధరను 50 శాతం, పొటాష్ ధరను 100 శాతానికి పైగా పెంచింది.
చాలా రాష్ర్టాల్లో ఆధునిక, యాంత్రీకరణలో భాగంగా వ్యవసాయ యంత్రాల వాడకం పెరిగింది. అందుకు తగ్గట్టుగా ఇంధన వినియోగం కూడా బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఇంధన ధరలను పెంచుతూ పోతున్నది. ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల విషయంలో కేంద్రం అనుసరి స్తున్న విధానాలతో రైతులపై పెనుభారం మోపుతున్నది.
వ్యవసాయ పంటలకు మద్దతు ధరల కోసం వేసిన స్వామినాథన్ కమిటీ సాగు వ్యయం కన్నా 50 శాతం అదనంగా ఇవ్వాలని సూచించింది. దానికి అనుగుణంగా మద్దతు ధరలు కల్పిస్తామన్న కేంద్రం మూలధన వ్యయాన్ని, భూమి కౌలు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అంతేకాకుండా మద్దతు ధరలతో పంటల కొనుగోలుకు కేంద్రం విశ్వసనీయ వ్యవస్థను ఏర్పాటుచేయకపోవడంతో గిట్టుబాటు ధర రైతులకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
గత ఐదేండ్లుగా కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరలను పరిశీలిస్తే… ఏటా కొద్దిపాటి పెరుగుదల కనిపించినప్పటికీ వాస్తవంగా పెట్టుబడి వ్యయం పెరుగుదల కన్నా చాలా తక్కువ. దీంతో అన్నిరకాల పంటలు వేసిన రైతులు కూడా తీవ్ర నష్టాల పాలవుతున్నారు. చాలా రాష్ర్టాలతో పాటు తెలంగాణ కూడా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని కోరుతున్నది. ఈ పథకాన్ని వ్యవసాయరంగంతో కలిపితే రైతులకు చాలావరకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించవచ్చు. ఇలాంటి రైతు ఉపయోగకరపనులపై కేంద్రం స్పందించక పోవడం గర్హనీయం.
రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎరువుల సబ్సిడీ విధానాన్ని కొనసాగించాలి. పెరుగుతున్న ఇంధన ధరలను నియంత్రించాలి. లోపభూయిష్టంగా ఉన్న మద్దతుధర విధానాన్ని హేతుబద్ధీకరించాలి. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి. రైతు బతుకే దేశానికి అన్నం మెతుకు. రాజు ను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే కేంద్రం మాత్రం రైతును బికారిని చేసే విధానాలు అవలంబించటం శోచనీయం. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు వీడనాడాలి. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే యత్నాలు మానుకోవాలి.
కేంద్రంలో గత ప్రభుత్వాలు కొనసాగించిన రాయితీ విధానాన్ని తుంగలో తొక్కి బీజేపీ ఎరువుల ధరలను పెంచుతున్నది. దీనివల్ల గ్రామీణ వ్యవసాయరంగం, అనుబంధ వృత్తులు కుదేలై రైతులు తీవ్ర పెట్టుబడిభారాన్ని ఎదుర్కోనున్నారు. వ్యవసాయరంగం ఎరువుల మీదనే ఎక్కువగాఆధారపడి ఉంటుంది. రైతుల ఆదాయం రెట్టింపు చేయకున్నా పర్లేదు కానీ ఇలాంటి రైతు వ్యతిరేక నిర్ణయాలతో అన్నదాతను అప్పుల పాలు చేయొద్దు.
-పిన్నింటి విజయ్కుమార్
90520 39109