గతంలో ఒక నిరుపేద గ్రామీణ మహిళ వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు చికిత్స కోసం వచ్చింది. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇన్-పేషంట్గా షరీఖ్ కావాలని వైద్యులు సూచించారు. దీనికోసం అప్పట్లో యూజర్ ఛార్జీల కింద రూ.5 చెల్లించాల్సి ఉండేది. అవి కూడా ఆమె దగ్గర లేకపోవడంతో అదే దవాఖానలోని ఒక మూలన పడుకున్నది. సకాలంలో చికిత్స అందకపోవడంతో ఆ నిరుపేద మహిళ మరణించింది. రెండు దశాబ్దాల కిందట జరిగిన వాస్తవ సంఘటన ఇది. అన్ని పత్రికలూ ఈ సంఘటనను హైలైట్ చేశాయి. ఈ పరిస్థితులకు ప్రధాన కారణం, ఉమ్మడి ఏపీ రాష్ట్రం ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న భారీ రుణాలు, ఆ రుణాలు పొందడానికి అప్పటి పాలకులు ఒప్పుకొన్న కఠిన షరతులు అని చెప్పవచ్చు.
అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచబ్యాంకు నుంచి కానీ ఐఎంఎఫ్ నుంచి కానీ రుణాలు తీసుకునే ప్రక్రియ అప్పటి సీఎం చంద్రబాబు హయాం నుంచి ఎక్కువగా ప్రారంభమైంది. ఈ రుణాలు ఇచ్చేముందు ప్రపంచబ్యాంకు లేదా ఐఎంఎఫ్, పౌర సదుపాయాలకు యూజ ర్ చార్జీలు ప్రవేశ పెట్టడం, ప్రణాళికేతర వ్యయం తగ్గించడం, ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా కుదించడం, కొత్తగా ఉద్యోగాల నియామకాలపై పూర్తిస్థాయి నిషేధం విధించడం, రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రవేశపెట్టడం లాంటి అమానవీయ షరతులను విధించేవారు. దీని ఫలితమే, ప్రస్తుతం కొనసాగుతున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ. గత 20 ఏండ్లుగా ఉద్యోగ నియామకాలు అంతంత మాత్రమే.
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ప్రధానాంశాలుగా కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సాకారమై 2014లో రాష్ట్రం ఆవిర్భావించింది. ఈ క్రమంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, అదనపు రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు, పరిపాలనా సంస్కరణలు, బలమైన పాలనావ్యవస్థ ఇలా.. ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతున్న పాలన వల్లే నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ర్టాల జాబితాలో ఒకటిగా నిలిచింది. జోన్లపై ఇటీవలే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేయడంతో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దేశ చరిత్రలో గతంలో లేనివిధంగా 90 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి చరిత్ర సృష్టించారు. దీనితో నిరుద్యోగ యువతలో ఉత్సాహం ఉరకలేస్తున్నది. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు.
దేశ ఆర్థిక స్థూల ఉత్పత్తిలో కేంద్రం కన్నా ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా 90 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో దేశంలోని మిగతా రాష్ర్టాల ప్రభుత్వాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నాయి. పైగా, ప్రతీ జిల్లాలో అవసరమైతే డివిజన్ కేంద్రాల్లో నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇలా… ఒకప్పుడు యూజర్ చార్జీల పేరిట నిరుపేదల నుంచి సైతం ఐదు రూపాయలు వసూలు చేసే దౌర్భాగ్యపు స్థితి నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు పేరుతో ఒక్కొక్క దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేసే ఉన్నతస్థాయికి వచ్చాం. ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం రికార్డు సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే రాష్ట్రంగా దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా మన తెలంగాణ తలెత్తుకొని నిలవడం గర్వకారణం.
-కన్నెకంటి వెంకటరమణ