భగవంతుడు ఎప్పుడూ దయార్ద్ర హృదయుడే! భక్తులపై ఆయన అవ్యాజమైన ప్రేమను కలిగి ఉంటాడు. కానీ, భక్తులే తమ కోరికలు నెరవేరలేదని అప్పుడప్పుడు భగవంతుడిని నిందిస్తూ ఉంటారు. అయితే, అడిగిందే తడవుగా దేవుడు ఆపన్నహస్తం అందివ్వడు. భక్తుడి కర్మ ఫలాన్ని అనుసరించి కరుణిస్తుంటాడు. ఈ క్రమంలో కఠిన పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో తన భక్తుడు విజయం సాధించే దిశగా భగవంతుడే స్వయంగా ప్రోత్సహిస్తాడు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. భద్రాద్రి రాముడికి భవ్య మందిరం నిర్మించిన రామదాసు చెరశాల పాలయ్యాడు. కఠిన శిక్షలను అనుభవించాడు. చివరికి స్వయంగా శ్రీరాముడే లక్ష్మణ సమేతుడై వచ్చి రామదాసును బందిఖానా నుంచి విడిపించాడు.
శ్రీమద్భాగవతంలోని గజేంద్ర మోక్షం కూడా భగవంతుడి లీలా విలాసాన్ని తెలియజేస్తుంది. మకరి నోట చిక్కిన కరి శక్తి మేరకు పోరాడుతుంది. ఏనుగు తన శక్తిని నమ్ముకున్నంత వరకు శ్రీహరి ప్రేక్షక పాత్ర పోషించాడు. ‘అసలు నువ్వు ఉన్నావా?’ అని సంశయాత్మకంగా ప్రార్థించినా వేచి చూశాడు. చివరికి ‘నీవు తప్ప నన్ను కాపాడేవారు లేరు’ అని అన్న వెంటనే పరుగున వచ్చి మకరిని సంహరించి గజేంద్రుడిని కాపాడాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి ముప్పు తలపెట్టినప్పుడల్లా శ్రీహరి ఆదుకున్న కథ అందరికీ తెలిసిందే!
శరణు వేడిన వారిని భగవంతుడు తప్పక కటాక్షిస్తాడు. అలా రక్షణ పొందినవాళ్లే సుగ్రీవుడు, విభీషణుడు. తోడబుట్టిన సోదరుడు వాలి నుంచి ప్రాణాపాయం పొంచి ఉండటంతో సుగ్రీవుడు భార్యను సైతం విడిచి రుష్యమూక పర్వతంపై తలదాచుకున్నాడు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న సుగ్రీవుడికి దశరథనందనుడితో మైత్రి శ్రీరామరక్ష అయింది. ధర్మం కోసం రావణుడితో విభేదించిన విభీషణుడు రాముడిని శరణు వేడాడు. రాముడి అభయం.. విభీషణుడ్ని రావణుడు ఉండగానే లంకాధిపతిగా చేసింది. తనను నమ్మి కొలిచిన వారిని దేవుడు సదా అనుగ్రహిస్తాడు. మనం చేసుకున్న పాప, పుణ్య కర్మల ఆధారంగా ఫలితం కాస్త అటూఇటూగా వస్తుంది. నిండు మనసుతో శరణు కోరడమే మనం చేయాల్సింది. అలాగని గాలిలో దీపం పెట్టి ‘భగవంతుడా నీవే దిక్కు!’ అని కూర్చుంటే సరికాదు. మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ, దానికి దైవబలం తోడవ్వాలని కోరుకోవాలి.
– కనుమ ఎల్లారెడ్డి, 93915 23027