రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చకు బదులిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలు గమనార్హమైనవి. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు 356 అధికరణాన్ని దుర్వినియోగం చేసి 90 రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోశాయని ఆయన విమర్శించారు. ప్రధాని ఇందిరాగాంధీ ఈ అధికరణం ద్వారా 50 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసినట్టు ఆయన లెక్కగట్టి చెప్పారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు అభ్యంతరకరమే. కానీ ఇప్పుడు ఘనత వహించిన మోదీ ప్రభుత్వం చేస్తున్నదేమిటనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందన్నట్టు – తాము స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఏదో ఒక రీతిలో కూల్చివేస్తూ, పార్లమెంటులో నీతి సూత్రాలు వల్లించడం, పాత కాలపు కాంగ్రెస్ ప్రభుత్వాల చిట్టా విప్పడం ఆశ్చర్యంగా ఉన్నది.
ఇదే మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర పెత్తనానికి వ్యతిరేకంగా, రాష్ర్టాల హక్కుల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. 2011లో లక్నోలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ‘యూపీఏ ప్రభుత్వం మూలంగా సమాఖ్యకు ఏర్పడిన ప్రమాదం’పై తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ తీర్మానంలో దుయ్యబట్టారు. రాష్ర్టాలు చట్టాలు చేసుకునే అధికారాలను కేంద్రం హరిస్తున్నదన్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని కూడా తప్పు పట్టారు. రాష్ర్టాలను తొక్కివేయడానికి రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకుంటున్నదని కూడా ఆనాడు విమర్శించారు. గవర్నర్లను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటున్నదని కూడా ఆయన నాటి తీర్మానంలో పేర్కొన్నారు. ఇందులో ప్రస్తుతం మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వర్తించని ఆరోపణ ఏదైనా ఉన్నదా! ఏ అధికరణం వాడుతున్నారని కాదు, మోదీ ప్రభుత్వ విధానాలు సమాఖ్య స్ఫూర్తికి భంగకరంగా ఉన్నాయా లేదా అనేది ప్రధానం.
కాంగ్రెస్ పార్టీ పెత్తనం సాగినన్నాళ్ళూ రాష్ర్టాల హక్కులను హరించిన మాట వాస్తవమే. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమూ అవే ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలు అమలు చేస్తున్నదీ నిజమే. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలను కూడా వదలకుండా చట్టాలు చేస్తూ పెత్తనం చలాయిస్తున్నది. ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసినా ప్రాంతీయ పక్షాల ప్రాభవాన్ని కాంగ్రెస్ అడ్డుకోలేక పోయింది. అనేక అణచివేతల మధ్య ప్రాంతీయ శక్తులు మరింత బలపడ్డాయి. చివరకు కాంగ్రెస్కు ఏ గతి పట్టిందో కనిపిస్తూనే ఉన్నది. ఈ అనుభవం నుంచి బీజేపీ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక స్వభావం ప్రజలకు పూర్తిగా అర్థమైంది. పరస్పర విమర్శల ద్వారా ఈ రెండు పార్టీలు ఇంకెంతో కాలం ప్రజలను తప్పుదారి పట్టించలేవు. ప్రజలు ఈ రెండింటికీ ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారు.