బద్నాంల బండి బోర్లవడ్డది. ప్రభుత్వంపై, పాలనాధీశుడి కుటుంబంపై ఎత్తిన బద్నాంల బండలు తిరిగొచ్చి తన మాడుపైనే పడ్డాయి. అధికార కిరీటం అటుంచితే.. 420, ఏ-1 కిరీటాలు దక్కాయి. పార్టీ అధ్యక్షపీఠం స్థాయి రాజకీయాలకు బదులు అత్యంత చౌకబుద్ధి బహిర్గతమైంది. సెల్ఫోన్తోనే అలజడి కథ నడిపించి సెల్ఫోన్ చూపలేని ఉద్దెర జవాబు తెలంగాణ సమాజం వింటున్నది, కంటున్నది. హిందీపై ప్రేమ ఒలకబోసే పార్టీ స్టేట్ పెద్దమనిషి అదే హిందీ పరీక్షను డిస్టర్బ్ చేసే చిన్నబుద్ధితో దొరికిపోయారు.
పరీక్షలు రాసే విద్యార్థుల్లో తమ పార్టీ వ్యక్తులు, నాయకులు, కుటుంబాల పిల్లలూ ఉంటారనే కనీస స్పృహ లేకపోవడం, పొలిటికల్ మైలేజ్ యావలో పడిపోవడం ఎంత దారుణం. ఇప్పుడు తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లు అయ్యింది. రెండు టర్ముల్లో గడిచిన తొమ్మిదేండ్లుగా అనేక పోటీ, విద్య పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన, నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని 10వ తరగతి పరీక్షల సమయంలో బ్లేమ్ చేయబోయి ఒక ప్రధాన నిందితుడిగా చట్టం ఎదుట నిలబడటం తప్పుడు కార్యకలాపాలకు మూల్యం!
సిద్ధాంతాలు, విధానాల ప్రాతిపదికన హుందా రాజకీయాలకు బదులు, షార్ట్కట్ పోకడలు పెచ్చరిల్లిపోతున్నాయి. తుదకు బడిపిల్లల పరీక్షలకూ తమ రాజకీయ మనోవికారాల పరీక్ష పెడుతున్నారు. సమాచార అగాథం, కృత్రిమ లోపాలను స్థాపించే ఎత్తుగడల బరువు పెడుతున్నారు. ఉన్నంతలో సిద్ధాంత పద్ధతులను అనుసరించే పార్టీగా బీజేపీకి ఉన్న పేరూ, ప్రతిష్ఠ గతమైంది. సందు దొరకడం కాదు, సందు చేసుకొని మరీ బద్నాం దందాలు చేసుకుపోతున్నారు. కాళేశ్వరంలో బద్నాం చేద్దామని చూసి ఏమీ చేయలేక చివరికి అదే కాళేశ్వరం నీటిలో తమ విశ్వసనీయతను, ఇమేజ్ను ముంచేసుకున్నారు. మొన్న, నిన్న, ఇయ్యాళ లిక్కర్, టీఎస్పీఎస్సీ, టెన్త్ అంశాల్లో బద్నాంలతో అంచెలంచెలుగా దిగజారుతున్నారు. లీకేజీకి-ఔటేజీకి వ్యత్యాసంపై కనీస సోయీ లేనంత బద్నాంల మైకంలో మునిగిపోయారు. జనం మధ్య ఉండి, జనం కోసం పాటుపడి జనం మెప్పు, గౌరవ మర్యాదలు పొందడంపై ఆసక్తి పోగొట్టుకున్న ఆ రెండు (అ) ప్రధాన ప్రతిపక్ష పార్టీల సారథులు బద్నాంల జపంతో ఆఖరికి తమకు తామే అప్రతిష్ఠ పాలవుతున్నారు. బద్నాం తాడును గుంజీ, గుంజీ తెగ్గొట్టుకొని అంతిమంగా తామే చట్టం ముందు గుంజీలు తీయాల్సిన అగత్యం తెచ్చుకున్నారు. సరాసరి ప్రజల్లో అభద్రత, అపనమ్మకం, కల్లోలం రాజేసే కల్మషపూరిత దుష్ట రాజకీయాలకు ఒడిగట్టారు. తెలంగాణ సర్కార్ను బద్నాం చేసే బ్యాచులుగా పోటీ పడుతున్నారు.
సమీప కాలంలో జరిగే ఎలక్షన్లలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో పోటీ పడలేని నైరాశ్యం వారిని ఆవహించింది. అందుకే జాతీయపార్టీలుగా రాష్ట్ర శాఖలకు చీఫ్ల పొజిషన్లో ఉండి కూడా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అవి కాస్తా వికటించిన మీదటే అధికార కిరీటం అటుంచి, 420, ఏ-1 వంటి అపప్రథ కిరీటాలు కొని తెచ్చుకుంటుండటం రాష్ట్రం, విజ్ఞత గల సమాజం చూస్తున్నది.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్భానుసారంగా ఎప్పటికప్పుడు ముందుగానే ప్రజలను, సమాజాన్ని అప్రమత్తం చేస్తుంటారు. ‘గోల్మాల్ గాళ్లు చెలరేగిపోతుంటారు. అపోహలు, అలజడులు సృష్టించి రాజకీయ లాభానికి ఎంతటి నీచానికైనా పోతారు’ అని సమాయత్తం చేస్తుండటం మనందరి ఎరుకలో ఉండనే ఉన్నది.
కేసీఆర్ మౌఖికంగా చెప్పినవే సత్యమైన సన్నివేశాలుగా ఇపుడు మనమంతా కండ్లారా చూస్తున్నాం. ఇంకా మున్ముందు, ఎన్నికల నాటికి ఫాల్త్ రాజకీయ క్రీడ మరెంతలా జడలు విప్పినా చైతన్యమంతమైన, జాగరూకులైన తెలంగాణ సమాజంగా నిజానిజాలను తెలుసుకొని మసలుకోవాలి. ప్రజలను కేసీఆర్ సర్కారుతో పాపేందుకు పాపపు చేష్టలపై ఆధారపడి ఊగిపోతున్నారు. ఈసారి కూడా మూడో పర్యాయం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తమ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే అయోమయంలో జీవితకాల తప్పిదాలకు గడికీ పూనుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత దాడి చేస్తూనే బీఆర్ఎస్ సర్కారును అస్థిరపరిచే పన్నాగాలకు పరాకాష్ఠగా అన్నెం పున్నెం ఎరుగని అమాయక టెన్త్ పరీక్షల విద్యార్థుల ఏకాగ్రతను, వారి కుటుంబాల మనశ్శాంతిని బలి పెడుతున్నారు. మొత్తానికి పరీక్షల వ్యవస్థే నిర్వీర్యమైందనే భ్రమలు రాజేసేందుకు రకరకాల మతిలేని ప్రయోగాలకు తెరలేపారు. కుట్రల కట్టలు తెంచుకొని ప్రశాంత తెలంగాణలో అశాంతికి నేరమయ మనస్తత్వపు ఆకలి మీద ఉన్నారు. లీకేజీలంటూ బద్నాం చేస్తూనే లీకేజీలతో ప్రభుత్వం కూలిపోతుందని అదే నోట తన కడుపులోని కుట్రమయ కాంక్షను ప్రకటించుకోవడం వారి నిజ స్వరూపానికి సాక్ష్యం.
పార్టీ రాష్ట్ర స్థాయి అధ్యక్ష పీఠం మీద కూసొని అత్యంత నాసిరకపు అవాంఛనీయ రాజకీయాలకు తెగబడటం దిగ్భ్రాంతికరం. ఎవరు చెప్పేది నిజమో, ఎవరు తెలిపేది అబద్ధమో అనే బేసిక్ పాయింట్ గజిబిజిల నడుమ స్వచ్ఛమైన రాజకీయాలకు తావులేని అనారోగ్యకరమైన కార్యకలాపాలకు కేంద్రంగా తెలంగాణ కాకూడదు. మన మట్టి చైతన్య గాఢత, పోరాట సద్దిమూట నాణ్యతలు ఇరుసులుగా రాష్ట్ర ప్రగతి చక్రాలు హస్తిన దాకా పరుగులు తీయాలి. చట్టం, ధర్మం పరిఢవిల్లాలి.
(వ్యాసకర్త: ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
ఇల్లెందుల ,దుర్గాప్రసాద్
94408 50384