దేశంలో అన్ని రంగాలు పతనం కావడానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీనే ప్రత్యక్ష కారణమని నొక్కి చెప్పనవసరం లేదు. ఈ విషయాన్ని పక్కనపెట్టి ఇటీవల మునుగోడు సభకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు గుప్పించడం విడ్డూరం. గడిచిన ఎనిమిదేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని అమిత్ షా వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. రాష్ట్రంపై అమిత్ షాకు సరైన అవగాహన లేదని, అందుకే ఈ నిందారోపణలు చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.
కృష్ణా నదికి ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలుంటాయి. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ మధ్య నీటి పంపకాల వివాదాలుండేవి. ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య కూడా కృష్ణా నీటి విషయంలో వివాదాలుండేవి. రాష్ర్టాల మధ్య నీటి పంపకాల కోసం భారత ప్రభుత్వం 1969, ఏప్రిల్లో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. నదుల నీళ్లు రాష్ర్టాల మధ్య పంచడం ఈ ట్రిబ్యునల్ పని. కానీ విభజన జరిగి ఎనిమిదేండ్లు గడుస్తున్నా కేంద్రం జోక్యం చేసుకోవడం లేదు. ఈ మిగులు జలాల పంపిణీ విషయంలో రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం లేకపోతే అప్పుడు పార్లమెంటు జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని రాశారు. కానీ కేంద్రం మాత్రం రెండు రాష్ర్టాల మధ్య గొడవలు సృష్టిస్తూ చోద్యం చూస్తున్నది.
నల్లగొండ జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తామని చెప్పి ఎందుకు నిర్మించలేదని అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఒక్క ఎయిమ్స్ మాత్రమే. దాన్నీ గాలికి వదిలేసింది. 70 ఏండ్లలో మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగితే, ఎనిమిదేండ్లలో 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా ‘ప్రజల వద్దకే పాలన’ అనే విధానంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.
‘దళితబంధు’ పథకం ప్రవేశపెట్టి రూ.10 లక్షల చొప్పున పంచారని గుర్తు చేస్తూ.. మునుగోడులో ఎంతమందికి ‘దళితబంధు’ ఇచ్చారని షా ప్రశ్నించారు? దళితుల జీవితాల్లో వెలుగులు నిండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం. ఈ పథకం ఎంత ప్రాచుర్యం పొందిందనేది ప్రత్యేకంగా షాకు చెప్పనవసరం లేదు. దళితులపైన వివక్ష తప్ప, వారి అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో దేశ ప్రజలకు తెలుసు.
కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఫసల్ బీమా యోజన’ను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని అమిత్ షా అన్నారు. అసలు ఈ పథకం అమలే శాస్త్రీయంగా లేదనేది వాస్తవం. అందుకే ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా ఈ పథకం అమలుకావడం లేదు. అమిత్ షా రాష్ట్ర పర్యటన వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కేంద్రంలో ప్రధాని మోదీ అసమర్థ పాలన వల్లే దేశం ఆర్థికంగా, అభివృద్ధిలోనూ చితికిపోయింది.
దేశ రాజధానిలో నీళ్లు, కరెంట్ ఇవ్వలేని బీజేపీ పాలకులు తెలంగాణకు వచ్చి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ కావాలని అడుక్కోవటం సిగ్గుచేటు. జీడీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ కేంద్రం కంటే డబుల్ స్పీడులో ఉన్నదనే విషయం అమిత్ షా తెలుసుకుంటే మంచిది.
మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికలో ప్రయోజనం పొందడానికే అమిత్ షా రాష్ర్టానికి వచ్చారే తప్ప, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చడం కోసం కాదనేది వాస్తవం. ఉత్త చేతులతో వచ్చి, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిపోయే వారిని పట్టించుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదు. బీజేపీ నేతలు విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే వంద శాతం పని చేస్తున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు.
దేశాన్ని పాలించిన ప్రధానులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా మోదీ అంతటి దౌర్భాగ్య పాలనను అందించలేదు. మోదీ పవర్ పాలసీల వల్లే రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి తలెత్తుతున్నది. ఇదంతా కేంద్రం చేతకాని విధానాల వల్లే. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంటు వంటి సౌకర్యాలు కల్పిస్తుంటే వాటిని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలుచేయడం లేదో అమిత్ షా దేశ ప్రజలకు చెప్పాలి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు అహంకారంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ నేతల చేష్టలను గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి బీజేపీని ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ‘నరేంద్ర మోదీ సర్కారు పోవాలి, బీజేపీ రహిత ప్రభుత్వం రావాలని’ యావత్ దేశం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తున్నది. దేశవ్యాప్తంగా అనేక విద్యాలయాలు ఏర్పాటుచేసిన కేంద్రం తెలంగాణకు మాత్రం అన్యాయం చేసింది. కేంద్రం తెలంగాణకు ఇచ్చింది శూన్యం. గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్… ఏదీ ఇవ్వలేదు. తెలంగాణలో బీజేపీ నాయకత్వం బలంగా లేక ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేసి, ఉప ఎన్నికలను తీసుకువస్తూ తెలంగాణ ప్రజల మీద అస్ర్తాలు ప్రయోగిస్తున్నది.
మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికలో ప్రయోజనం పొందడానికే అమిత్ షా రాష్ర్టానికి వచ్చారే తప్ప, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చడం కోసం కాదనేది వాస్తవం. ఉత్త చేతులతో వచ్చి, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిపోయే వారిని పట్టించుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదు. బీజేపీ నేతలు విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే వంద శాతం పని చేస్తున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లవుతున్నది. ఇన్నేండ్ల కాలంలో తెలంగాణకు ఏం చేశారో, ఎన్ని నిధులు కేటాయించారో బీజేపీ నాయకులు చెప్తే బాగుంటుంది. అంతే కానీ, కేవలం కేసీఆర్ మీద విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏం ఉండదనే విషయం ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.
తీగల అశోక్ కుమార్
79891 14086