రాష్ట్రంలో ఎక్కడచూసినా ఇప్పుడు ‘మునుగోడు’ఉప ఎన్నికనే హాట్ టాపిక్. సంబంధం ఉన్నా, లేకపోయినా ప్రజలు ఉత్సుకతగా ఈ ఉప ఎన్నికనే గమనిస్తున్నారు. అక్కడేం జరుగబోతున్నదో ఆసక్తిగా చూస్తున్నారు. ప్రజాస్వామ్య భారతంలో ఎన్నికలు అత్యంత శక్తిమంతమైన ఆయుధం. అయితే, ప్రతీ ఎన్నికకు ఒక అర్థం, పరమార్థం ఉండాలి. విస్తృత జనాభిప్రాయానికి అనుగుణంగా ఎన్నికలు రావాలి.
ఉమ్మడి రాష్ట్రంలో ‘ఉప ఎన్నికలు’ అనేకసార్లు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షలను చాటేందుకు.. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వ్యక్తం చేయడానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు ఓటును వజ్రాయుధంగా వాడుకున్నారు. 2006లో జరిగిన కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికైనా, ఆ తర్వాతి ఉప ఎన్నికలైనా ప్రజాభిప్రాయా న్ని ప్రతిఫలించడానికి, విస్తృత జన బాహుళ్యం తమ ప్రజాస్వామ్యబద్ధ హక్కును వినియోగించుకోవడం ద్వారా నిరసన తెలుపడం కోసం వచ్చినవే. ప్రజలు తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను, తమ గొంతుకను ఓటు ద్వారా వినిపించారు.
తెలంగాణ ఉద్యమం శాంతియుత మార్గంలో సాగడానికి, తెలంగాణ రాష్ర్టాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సాధించడానికి ఎన్నికల పాత్ర కీలకమైం ది. మరిప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా ‘మునుగోడు’ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎందుకు వచ్చినట్లు? ఎవరి స్వార్థం కోసం వచ్చినట్లో ఒకసారి పరికించి చూద్దాం. ఈ ఎన్నిక ఎవరి ఆకాంక్షలను ప్రతిఫలించేందుకు ఉపయోగపడుతుందన్న ప్రశ్న ప్రజల్లో మొదలైంది. అసలు ఈ ఉప ఎన్నికతో మునుగోడు ప్రజలకు ఏం సంబం ధం ఉందన్న చర్చ మొదలైంది. ఈ ఎన్నిక కేవలం ఒక్కరి రాజకీయ మనుగడ కోసమే వచ్చిందన్నది ప్రజల నుంచి వస్తున్న సమాధానం. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ తరహా ఉప ఎన్నిక రావడం బహు శా ఇదే తొలిసారి. ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఎన్నిక ఇది.
టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడం కాంగ్రెస్ సీనియర్లలో నిప్పు రగిలించిన మాట వాస్తవం. నల్లగొండ జిల్లాలో కీలకంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని వందల సందర్భాల్లో వాపోయిన మాట కూడా అంతే వాస్తవం. రేవంత్రెడ్డితో తనకున్న వైరంతోపాటు, బీజేపీలో కి వెళ్తే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కాంట్రాక్టు పనులు దక్కుతాయన్న వ్యూహంతోనే రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశారని నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేకపోలేదు. ఇక ‘సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం’ అన్నట్టు బీజేపీ కూడా రాజగోపాల్రెడ్డిని చేర్చుకున్నది. ఏదో ఒకవిధంగా రాష్ట్రంలో చొరబడాలని చూస్తున్న బీజేపీకి రాజగోపాల్రెడ్డి ఒక పావు మాత్రమే.
ఆ పార్టీకి మునుగోడు ఎన్నికల ఫలితాలన్నవి వస్తే కొండ.. పోతే వెంట్రుక అన్నట్టే. ఎందుకంటే ఆ పార్టీకి అది సిట్టింగ్ స్థానం కాదు. రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరడం కేవలం ఆయన సొంత ప్రయోజనాలకేనని మునుగోడు ప్రజలకు తెలుసు. ఆయనకు ఓటేస్తే అక్కడి ప్రజలకు ఒనగూడేది శూన్యమే. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమకు ఏదో ప్రయోజనం చేకూరుస్తాడని ఆశించిన మునుగోడు ప్రజలు.. ఎమ్మెల్యేగా ఆయన తమకు చేసిందేమీ లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. రాజగోపాల్రెడ్డిది ముమ్మాటికీ ప్రజల భావోద్వేగాలతో సంబంధం లేని రాజీనామా. దాంట్లో ప్రజా ప్రయోజనం అనేది వీసమెత్తు కూడా లేదు. ఇది ఆయన వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం చేసిన రాజీనామానే. అంటే ఇది కేవలం రాజగోపాల్రెడ్డి గోడు మాత్రమే, మునుగోడు ప్రజలది ఎంతమాత్రమూ కాదు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, ఉమ్మడి రాష్ట్రంలో ఫ్లోరోసిస్ రక్కసికి మునుగోడు ప్రాంత ప్రజలు జీవచ్ఛవాలుగా మారిపోయిన కాలం. ఆ ప్రజలను జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఏ మాత్రం పట్టించుకున్న దాఖాలాల్లేవు.
ఈ సందర్భంగా నాకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావిస్తాను. అది 2009, సాధారణ ఎన్నికల సమ యం. చండూరు ప్రాంతంలో ఎన్నికల ప్రచారసరళిని గమనించేందుకు నేను వెళ్లాను. మధ్యాహ్నం ఎర్రటి ఎండలో కాస్త విరామం తీసుకునేందుకని ఒక మిత్రుడి ఇంటికి వెళ్లాను. తాగడానికి ఒక చిన్న గ్లాసులో మంచినీళ్లు ఇచ్చారు. ఎండాకాలం కావడంతో వాళ్లు ఇచ్చిన నీళ్లు నాకు సరిపోలేదు. ఇంకా.. ఇంకా తాగాను. నా పక్కనే ఉన్న మా నల్లగొండ ప్రతినిధి.. సార్.. ఇక్కడివాళ్లు నీళ్లు కొనుక్కొని, వాటిని ఏమాత్రం వృథా చేయకుండా, కొద్దికొద్దిగా తాగుతారని చెప్పాడు. ఆ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ నీళ్ల డబ్బా వైపు చూశాను. దాంట్లో ఇంకా కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నా యి. కరీంనగర్ జిల్లాలో పుట్టి పెరిగిన నాకు అది కొంత కొత్తగా, వింతగా అనిపించింది. అప్పుడర్థమైంది చండూరు ప్రాంతం దారుణమైన ఫ్లోరోసిస్కు కేంద్రం అని. అక్కడి వందలాది కుటుంబాలు ఫ్లోరోసిస్ బారిన పడ్డవే. అలాంటి ప్రాంతానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది.
75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో మునుగోడు ప్రాంత నీటి గోసను జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎందుకు పట్టించుకోలేదు? తమ స్వార్థం కోసం రాజీనామా చేసిన రాజగోపాల్రెడ్డి మళ్లీ ఏ మొహం పెట్టుకొని మునుగోడు ప్రజల ముందుకు వస్తాడు? ‘మిషన్ భగీరథ’ నీళ్లు తాగుతున్న అక్కడి ప్రజలు కేసీఆర్,
టీఆర్ఎస్ సర్కారు చేసిన మేలును ఎలా మరిచిపోతారు?
పాత మిత్రుడే.. అదే ఇంట్లో కార్యక్రమం. అయితే, ఈసారి ఆ ఇంట్లోనే కాదు, ఆ ఊరిలోని ప్రతి ఇంట్లో ఓ నల్లా కనిపించింది. ‘మిత్రమా.. ఇంటికో నల్లా కనిపిస్తున్నది, నీళ్ల బాధ తీరినట్టుందన్నా’ను. అంతే.. ఆయన సంబురంగా చెప్పాడు. రెండు, మూడేండ్లుగా ఊళ్లో అసలు నీళ్ల బాధే లేదని. చండూరుకు ఇప్పుడు తాగినన్ని నీళ్లు వస్తున్నాయి. ‘మిషన్ భగీరథ’తో తమ ప్రాంత కష్టాలు తీరాయని మిత్రుడు సంతో షంగా చెప్పాడు. ఆయన గతంలో వాళ్లు పడ్డ వెతల గురించి, ఇప్పుడు తీరిన బాధల గురించి చెప్తూ ఉంటే ఏదో సాధించిన తృప్తి కనిపించింది తనలో. ఫ్లోరోసిస్ రక్కసి తమ జీవితాలతో శాశ్వత సహజీవనం చేస్తుందేమోనని చస్తూ బతుకుతున్న మునుగోడు ప్రజల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా దేవుడని సాక్షాత్తూ ఆ మిత్రుడి కుటుంబీకులే చెప్పడం గమనా ర్హం. ఇంతకన్నా ఉదాహరణ ఇం కేం కావాలి?