పారిశ్రామిక, ఐటీరంగాల అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రపథాన పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పారదర్శక, సులభతర విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహం ఫలితంగానే ఈ వృద్ధి సాధ్యమవుతున్నది. గత ఎనిమిదేండ్లలో అనేక అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. ఇంకా అనేక సంస్థలు రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకు వస్తున్నాయి. ప్రత్యేకించి ఐటీ రంగంలో రాష్ట్రం వేగంగా ఎదుగుతున్న తీరు దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నది.
తెలంగాణలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ఏర్పాటైతే రెట్టింపు వేగంతో ఐటీ రంగం రాష్ట్రంలో అభివృద్ధి చెందేది. ఐటీరంగం అభివృద్ధికి అన్ని అంశాల్లోనూ సానుకూల వాతావరణం ఉన్నందున హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో సుమారు ఐటీఐఆర్ ద్వారా ప్రత్యక్షంగా సుమారు 15 లక్షల మందికి, పరోక్షంగా 53 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. అందుకే ఐటీఐఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. కానీ, ఐటీఐఆర్ ప్రాజెక్టును ఇవ్వకుండా కేంద్రం మన ఆశలపై నీళ్లు చల్లింది.
కేంద్రం సహకరించకపోయినా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమవుతున్నది. ఏటా పెరుగుతున్న ఐటీ ఎగుమతులు, కొత్తగా వస్తున్న ప్రపంచస్థాయి సంస్థలే నిదర్శనం. రాష్ర్టానికి వచ్చే పెట్టుబడులు, స్థాపిస్తున్న కొత్త పరిశ్రమలు హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రం నలుదిశలా విస్తరించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సంస్థలను తీసుకువెళ్లడం, జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేయించడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. పెద్ద ఎత్తున సంస్థలు జిల్లాల్లో ఏర్పాటయ్యాయి. ఐటీ సంస్థలు కొలువుదీరుతున్నాయి. ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీ సంస్థల ఏర్పాటువల్ల యువత హైదరాబాద్కు వచ్చే పరిస్థితి తప్పుతుంది. యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభిస్తాయి.
హైదరాబాద్ తర్వాత ఐటీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్. నగర శివారులోని మడికొండ ఐటీ పార్క్లో అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటవుతున్నాయి. సైయోంట్, టెక్ మహీంద్రా ఇప్పటికే ఇక్కడ వాటి క్యాంపస్లను ఏర్పాటుచేసి దాదాపు వెయ్యి మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి. క్వాడ్రంట్ రిసోర్సెస్, ఎల్ఆండ్టీ అనుబంధ మైండ్ట్రీ, జెన్పాక్ట్ సంస్థలు వరంగల్లో ఏర్పాటవుతున్నాయి. ఇంకా అనేక సంస్థలను వరంగల్కు తీసుకువచ్చేందుకు మంత్రి కేటీఆర్ ఆయా సంస్థల ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక్కడే ప్రభుత్వం ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుచేసింది. కరీంనగర్లోనూ ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. రూ.34 కోట్ల వ్యయంతో ఐటీ హబ్ను నిర్మించింది. ఇక్కడా ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుచేసింది. ఖమ్మం నగరంలోనూ 2 వేల మంది యువతకు ఐటీ రంగంలో ఉపాధి కల్పించే లక్ష్యంతో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటుచేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలైన నిజామాబాద్, మహబూబ్నగర్లలోనూ ఐటీ హబ్లను నిర్మిస్తున్నది. సిద్దిపేట, నల్గొండ, రామగుండంలోనూ ఐటీ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ సంస్థలు అంటే.. బీపీవో, కేపీవో తరహా సేవలు అందించే సంస్థలే ఉంటాయనే ఒక అభిప్రాయం గతంలో స్థిరపడింది. ఈ అభిప్రాయాన్ని మారుస్తున్నది మన ప్రభుత్వం. ఐటీ సేవలందించే సంస్థలను ఇక్కడకు తీసుకువస్తున్నది. వరంగల్ కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికత మీద కూడా యువత పనిచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లో 1300 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుచేసింది. దీనిద్వారా ప్రత్యక్షంగా 30 వేల మందికి ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో పత్తి పండించే రైతులు లక్షల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్లో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు మంచి అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం వెంటనే ప్రారంభించింది. ప్రపంచంలో పిల్లల దుస్తుల తయారీలో రెండో అతిపెద్ద సంస్థ అయిన కిటెక్స్ కంపెనీ రూ.1600 కోట్ల పెట్టుబడితో ఇక్కడ ఏర్పాటవుతున్నది. కొరియాకు చెందిన యంగ్వన్ అనే ప్రఖ్యాత సంస్థ రూ.1100 కోట్లతో ఏర్పాటవుతున్నది. ఇలాంటి 20 కంపెనీలు టెక్స్టైల్ పార్కులో ఏర్పాటుకానున్నాయి. ఒకవైపు పరిశ్రమలను, మరోవైపు ఐటీ సంస్థలను ద్వితీయశ్రేణి నగరాల్లో ఏర్పాటు చేయడం యువతకు సొంత ప్రాంతంలోనే ఉద్యోగావకాశాలు కల్పించాలనే ప్రభుత్వ ప్రయత్నం ఫలిస్తున్నది. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడట మే కాదు జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకం.
(వ్యాసకర్త: అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ)
డాక్టర్ ఎన్.యాదగిరిరావు
97044 05335