నిండుకుండలా మారిన తెలంగాణ నిశ్శబ్దంగా నిత్య నూతనత్వాన్ని ఆస్వాదిస్తున్నది. ఎన్నటికైనా అరిచినోడే ఆగమైతడనే విశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రగతిపథాన్ని మనసారా బలపరుస్తున్నది. అబద్ధాలకు ఆయుష్షు ఉండదనే నమ్మిక కలిగిన తెలంగాణ సమాజం, ఎనిమిదేండ్ల స్వయం పాలనలో అనుభవంలోకి వచ్చిన పురోగతిని పూర్తిగా అవగతం చేసుకునే అడుగులు వేస్తున్నది. భిన్నత్వంలో ఏకత్వం భావన లోపించిన మత తత్వవాదులు, సంకుచితతత్వాన్ని శ్వాసించే కులపిచ్చి మనుషులు కొందరు అధికారమే పరమావధిగా, ఆధిపత్యమే లక్ష్యంగా పావులు కదుపుతుండటాన్ని అనుభవశీలి తెలంగాణ జాగ్రత్తగానే గమనిస్తున్నది. జిత్తులకు, ఎత్తులకు ఆటస్థలంగా తెలంగాణ మారకుండా ఉండటానికి, స్థిరమైన రాజకీయాభిప్రాయాన్ని గుండెల్లో ప్రజారాశులు పదిలపరుచుకున్నాయనడంలో సందేహమే లేదు.
ఉబలాటం తప్ప ఉపాయం లేని విపక్షాలు రాష్ట్రంలో గందరగోళం నెలకొల్పగలమనే అతివిశ్వాసంతో పడరాని పాట్లు పడుతున్నాయి. పనిచేసే ప్రభుత్వం పట్ల పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ప్రజలను, పశుపతులుగా మారిన ప్రతిపక్షాలు వెంటపడి విసిగిస్తున్నాయి. గమ్మత్తుగా, మూడోసారి ఒకే రాజకీయ పార్టీ ప్రభుత్వాలన్ని ఏర్పాటుచేయజాలదనే విచిత్ర వాదనను వినిపిస్తూ, కలల బేహారుల్లా మారిపోయి ప్రవర్తిస్తున్నారు. ప్రజా ప్రభుత్వాల చరిత్రను అధ్యయనం చేసే అలవాటు లేకున్నా, కనీసం ఒడిశా, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ర్టాల ఎన్నికల్లో ఇటీవలి కాలంలోనే అక్కడి ప్రజలిచ్చిన తీర్పునైనా ప్రతిపక్ష పార్టీలు అర్థం చేసుకొని ఉండాలి. ఉద్ధరించకపోయినా పర్వాలేదు కానీ ఆగంజేసేటోళ్లకు ప్రభుత్వాలను అప్పగించలేమని అక్కడి ఓటర్లు అన్నిరకాల కుట్రలను తిప్పికొట్టారు. మరి రాష్ట్రంలో ప్రజల అవసరాలతో పాటు తర్వాతి తరాలను కూడా ఆదుకునే అభివృద్ధి ఉద్యమాన్ని ఆచరణలో పెడుతున్న కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జనాలు వద్దనుకుంటారా?
ఎవరో వచ్చి అరిచి చెబితే అభిప్రాయం ఏర్పరుచుకునే స్వభావం తెలంగాణది కాదు. అనుభవాలు మాత్రమే ఇక్కడి సమాజాన్ని కదిలించగలవు. నిత్యం నడినెత్తి మీదికి సూర్యుడు రాగానే, పనికి తెరిపిచ్చి పొలాల గట్ల మీద శ్రమజీవులు విప్పేది సద్దిమూటలు మాత్రమే కాదు, సుద్దుల గంపలు కూడా. కండ్లముందట స్వయంపాలనలో నేలతల్లి ఎత్తిపట్టిన సత్యాలే సామాన్యులను ఆకట్టుకుంటాయి. అంతేగాని గాయిగత్తర శబ్దాలతో వారిని లొంగదీసుకోవడం సాధ్యపడదు. నిన్నటి దినాన తడి ఎండి తంగేడుపూల చెట్లు కూడా మొలవని ఎడారుల్లా మారిన పొలాలను చూసి దుఃఖపడ్డ కష్టజీవులు, నేడు స్వయం పాలనలో విత్తనం పంటను వాగ్దానం చేస్తుంటే కాదనుకుంటారా..? సాగును సంపదగా మార్చడం కోసం రైతుబంధు ద్వారా దాదాపుగా రూ.58 వేల కోట్లను రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతన్నల చేతికి నేరుగా అందించారు కేసీఆర్. గతంలో కరెంటు రాక కోసం కొవ్వొత్తుల్లా కరిగిన అన్నదాతలు, స్వయం పాలనలో 24 గం టల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.36, 179 కోట్ల పెట్టబడితో కరెంటు సరఫరా వ్యవస్థను బలోపేతం చేసిన నగ్న సత్యాన్ని నమ్మకుండా ఉండలేరు కదా! దానికితోడు ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఏటా 10 వేల కోట్లు ఖర్చు చేస్త్తుండటంతో పాటు రైతు బీమా పథకం ద్వారా దాదాపు 85 వేల రైతు కుటుంబాలకు 5 వేల కోట్లు ఆర్థిక సహాయంగా అందించిన సర్కార్ను వద్దని వదిలేసుకుంటారా?
గ్రామాలను గెలిపించడం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ఒక యజ్ఞం వలె చేపట్టిన అనేక చర్యల ఫలితంగానే పల్లెల్లో పండుగ వాతావరణం తిరిగొచ్చింది. పంటల ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల కంటే అగ్రభాగంలో తెలంగాణ నిలిచింది. కేంద్ర ప్రభుత్వం రెండు పర్యాయాలు ప్రకటించిన ఉత్తమ గ్రామ పురస్కారాలు దాదాపుగా అన్ని తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకున్నది.
రాజధానిలో ఆత్మగౌరవ పాటు, అనేక దళిత, గిరిజన, మైనారిటీల అభివృద్ధి పథకాలను నిండు మనస్సుతో ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఎనిమిదేండ్ల కిందటి వివక్షాపూరిత పాలనలో తమ నుం చి అంతా కోల్పోయిన అణగారిన జాతులకు అందమైన బతుకును వాగ్దానం చేసిం ది కేసీఆర్ ప్రభుత్వం. అందులో భాగంగా నే దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో దాదాపు వెయ్యికి పైగా గురుకుల విద్యాలయాలను నిర్వహిస్తున్నది. ఒక్కో విద్యార్థి మీద ఏడాదికి 1 లక్షా 25 వేలు ఖర్చుపెడుతూ 5 లక్షల మంది పేద కుటుంబాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తున్నది. ఇలా ఎన్నోవిధాలా, పేద వర్గాలకు ప్రయోజనం కలిగించే అభివృద్ధి పథకాలను నిరాటంకంగా అమలుపరుస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాదా? గ్రామాల పొలిమేరల అవతలికి దుఃఖాన్ని తరిమేసిన గులాబీ పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజారాశులెందుకు దూరం పెడతరు? గ్రామాలను గుండెల మీద మోస్తున్న ముఖ్యమంత్రి చేతిని వదలిపెట్టేంత అమాయకులు తెలంగాణ నేల మీద ఉండనే ఉండరు. తన కాళ్ల మీద తానే సగర్వంగా నిలబడేలా పల్లెల్ని తీర్చిదిద్దడంతో పాటు, పదిమందికీ పని కల్పించే కేంద్రాలుగా పట్టణాలను ఎత్తిపట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం.
ఎనిమిదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాల వల్ల నేడు తెలంగాణ సమూహం ఆకలిని జయించి కొనుగోలు శక్తిని సంపాదించుకోగలిగింది. రాజధానిలో తిష్ఠ వేసి, రాజకీయాల కోసం అమాస, పున్నానికి మెరుపుతీగల్లా వెళ్లొచ్చే విపక్ష నాయకులు, పల్లెలు సంతరించుకున్న నూతన శోభను చూడటం సాధ్యపడదు కదా? అందుకే ప్రతిపక్షాలు పగటికలలను పట్టుకొని పాకులాడుతున్నాయి. కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా వెనక్కి నడవడానికి సముఖంగా ఉండరనే సత్యాన్ని, రానున్న రోజుల్లో కాలమే అందరికీ అర్థం చేయిస్తుంది. కత్తుల వంతెన మీద నడుచుకుంటూ వచ్చిన తెలంగాణ ఆకుపచ్చని జీవితాన్ని అందుకున్నది. ఇప్పుడు ఏ కుట్రలకూ తెలంగాణ బలికానే కాదు. సత్యమేవ జయతే నినాదమే వాస్తవ చరిత్ర.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు)
డాక్టర్ ఆంజనేయగౌడ్
98853 52242