‘రాజుగారి గుర్రం రానురాను గాడిదగా మారింద’ని ఓ సామెత. అట్లాగే ప్రధాని మోదీ గారి పాలనలో ప్రజాస్వామ్యానికి ఇదే గతి పడుతున్నది. విశాలమైన దేశం గనుక, దేశవ్యాప్తంగా అనేక భాషలు, సంస్కృతులు ఉన్నందున ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకునేవిధంగా రాజ్యాంగంలో కేంద్రం, రాష్ర్టాలు అంటూ ఏర్పాటు చేశారు. బ్రిటిష్ కాలంలోనే కేంద్ర, రాష్ట్ర అధికార విభజన జరిపి దేశ స్వభావానికి అనుగుణమైన పరిపాలక వ్యవస్థ ఉండాలని భావించారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న తరుణం నాటికి కేంద్రంలో, రాష్ర్టాల్లో వేర్వేరు పార్టీలు కూడా పరిపాలిస్తూ సమాఖ్య స్వభావానికి అనుగుణంగా మన రాజకీయ పాలనా వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నది. కేంద్రంలో ఎవరు పరిపాలించాలనేది, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. రాజకీయ పక్షాలు, అధికారంలో ఉన్నవారు ప్రజల తీర్పును శిరోధార్యంగా భావించాలి. కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ అది ప్రజల తీర్పు గనుక గౌరవించవలసిందే. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో మనం, అలవర్చుకున్న సంస్కారం ఇది. కానీ, మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రజాస్వామ్యం అనే మాటకు అర్థం లేకుండా పోతున్నది. రాజుల కాలంలో ఢిల్లీ పాలకులు అధికార మదంతో ఇతర రాజ్యాలపై దాడి చేసి కూల్చివేసినట్లుగా బీజేపీ పాలకులు రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసి ఆక్రమించుకుంటున్నారు. ప్రజల ఆకాంక్షలను కాలరాస్తున్నారు.
తమతో 38 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కూలదోస్తామని బీజేపీ నాయకుడొకరు బహిరంగంగా, నిస్సిగ్గుగా వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్ వంటి పెద్ద రాష్ట్రంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది. అయినా, బీజేపీ కూలదోయాలనే భావిస్తున్నది. అందులో భాగమే ఈ బహిరంగ ప్రకటనలు. నిన్నగాక మొన్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసింది. అనేక మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, దేశంలోని మరో మూలకు తరలించి శిబిరాల్లో దాచిపెట్టి కుట్రలు జరపడం అధికారంలో ఉన్న ఒక జాతీయ పార్టీకి తగని పని. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి మెజారిటీ ఉన్నప్పటికీ గవర్నర్, బీజేపీని అధికారం చేపట్టవలసిందిగా ఆహ్వానించారు. మెజారిటీ సమకూర్చుకోలేక బీజేపీ అభాసుపాలైంది.
అయినా, మళ్లీ కుట్రలు జరిపి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకున్నది. ఇదంతా ఢిల్లీ పాలకుల కనుసన్నల్లోనే జరిగింది. మధ్యప్రదేశ్లో ప్రజలు అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో 2018లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. కానీ, ఆ పార్టీలోని ఒక వర్గాన్ని ప్రలోభపెట్టి రాజీనామాలు చేయించి కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్నది. ప్రజలు ఓడించిన తర్వాత కూడా ధన బలంతో అధికారం చేపట్టడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?
ఒక ప్రాంతీయ పార్టీ అంటే అక్కడి ప్రజల, ఆకాంక్షల ప్రతిరూపం. ఒక పార్టీని నలిపేయడమంటే అక్కడి ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీయడం. మన దేశ ప్రజాస్వామిక వ్యవస్థను, ఫెడరల్ స్వరూపాన్ని అభాసుపాలు చేయడం. ప్రజలు తమ ఆకాంక్షలను రాజకీయ పార్టీల ద్వారా వ్యక్తీకరించుకుంటారు. ప్రాంతీయ పక్షాల ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకుంటారు. ఇదంతా రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. ఈ రాజ్యాంగ ప్రక్రియను కాలరాస్తే ప్రజాస్వామ్యబద్ధ వ్యక్తీకరణ లేకుండా పోతుంది.
బీజేపీ ఎనిమిదేండ్ల కిందట కేంద్రంలో అధికారం చేపట్టిన నాటినుంచి రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడమే పనిగా పెట్టుకున్నది. పెద్ద రాష్ర్టాల్లోనే ప్రజాతీర్పుకు విరుద్ధంగా ఆక్రమణలు జరుగుతున్నాయంటే చిన్నరాష్ర్టాల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. సిక్కింలో బీజేపీకి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు సరికదా డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇప్పుడు సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పవాన్ చామ్లింగ్ తప్ప, ఆయన పార్టీలోని పది మంది ఎమ్మెల్యేలను గుంజుకొని ప్రతిపక్షమైపోయింది బీజేపీ.
మరో ఇద్దరు ఎమ్మెల్యేలను ధనబలంతో గెలిపించుకున్నది. ఎన్నికలకు ముందే చామ్లింగ్ పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు జరిపి మరో పార్టీని అధికారానికి తీసుకువచ్చింది. సరిహద్దులో ఉన్న కీలకమైన రాష్ట్రంలో ఇటువంటి కుతంత్రాలు జరిపి ప్రజల మనోభావాలను, ప్రాంతీయ ఆకాంక్షలను దెబ్బతీయడం ప్రమాదకరం కాదా? అరుణాచల్ ప్రదేశ్లోనూ కాంగ్రెస్ నాయకులు ఖండూతో పాటు 40 మంది ఎమ్మెల్యేల చేత ఫిరాయింపులు జరిపించి రాష్ర్టాన్ని కైవసం చేసుకున్నది. ఈ చీలిక వర్గం మొదట ‘పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ప్రదేశ్’లో చేరి, ఆ తర్వాత బీజేపీలో విలీనమైంది. పలు ఈశాన్య రాష్ర్టాలలో భారీగా ధనాన్ని కుమ్మరించి, అబద్ధపు ప్రచారాలు జరిపి, పార్టీ ప్రముఖులను కొనుగోలు చేస్తూ అయితే ఎన్నికల ద్వారా లేకుంటే ఫిరాయింపుల ద్వారా అధికారం చేపడుతూ ప్రాంతీయ పార్టీలను అణగదొక్కుతున్నది.
ఒక ప్రాంతీయ పార్టీ అంటే… అక్కడి ప్రజల, ఆకాంక్షల ప్రతిరూపం. ఒక పార్టీని నలిపేయడమంటే అక్కడి ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీయడం. మన దేశ ప్రజాస్వామిక వ్యవస్థను, ఫెడరల్ స్వరూపాన్ని అభాసుపాలు చేయడం. ప్రజలు తమ ఆకాంక్షలను రాజకీయ పార్టీల ద్వారా వ్యక్తీకరించుకుంటారు. ప్రాంతీయ పక్షాల ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకుంటారు. ఇదంతా రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. ఈ రాజ్యాంగ ప్రక్రియను కాలరాస్తే ప్రజాస్వామ్యబద్ధ వ్యక్తీకరణ లేకుండా పోతుంది. దీనివల్ల దేశంలో ప్రమాదకర పరిణామాలు చోటుచేసుకోవచ్చు. బీజేపీ విధానాలు మన ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరంగా మారాయి.
– ఎడిటోరియల్ డెస్క్