నేను పుట్టిన ఊరు, నన్ను పెంచి పెద్దచేసిన మానవీయ సమాజం, నా భాష, నా సంస్కృతి విస్తరించిన నా రాష్ట్రం, నా దేశం గొప్పవి. సకల సంపదలున్న మన దేశం సమస్యల సుడిగుండంలో ఎందుకున్నది? ఊరు బాగుండాలే, రాష్ట్రం బాగుండాలే, దేశం బ్రహ్మాండంగా ఉండాలే. మన దేశాన్ని మనం తీర్చుదిద్దుకోవటం కంటే ముఖ్యమైనది మరేం ఉంటుంది?
మొదట మనమున్న మన ఊరు కోసం కొట్లాడినం. కుల, మత ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలిచి పోరాడి గెలిచింది తెలంగాణ గడ్డ. మనిషి ప్రేమించే మహోన్నత తత్వాన్ని ఒంట పట్టించుకున్న ఈ మట్టి నుంచే ఆత్మగౌరవ పోరాటాలు వచ్చినయి. ఏ కాలంలోనైనా ఆధిపత్య గోడలను కూల్చటంలో వెనకడుగు వేయనిది తెలంగాణ. స్వరాష్ట్రం కోసం పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటం జరిగింది. మనమంతా రాష్ట్రం సాధించేదాకా మడమ తిప్పకుండా పోరాడాం. స్వరాష్ర్టాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం తెచ్చుకున్నాక దాన్ని తీర్చి దిద్దుకోవటంలో కూడా ఎంతో శ్రమిస్తున్నాం. 70 ఏండ్లలో దేశంలో ఎక్కడా జరగని విధంగా అభివృద్ధితో తెలంగాణను తీర్చిదిద్దుకుంటున్నాం. తెలంగాణ ఇపుడు దేశానికి అభివృద్ధి నమూనాగా మారింది. దేశమే తెలంగాణ వైపు చూస్తున్నది.
భావి భారత పౌరులుగా ప్రపంచంలో శిరస్సెత్తుకుని నిలిచి మార్గదర్శకులుగా నిలబడే సర్వ స్వ తంత్ర, లౌకికతత్వ భారతాన్ని నూతనంగా నిర్మించుకోవాలి. ఈ నేపథ్యంలోనే జాతీయంగా ప్రగతిశీల శక్తుల్ని కూడగట్టి భవిష్యత్ భారతాన్ని ప్రజల ఆకాంక్షల మేరకు నిర్మించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలంచారు. ప్రజల ఎజెండాతో దేశ పునర్నిర్మాణం చేయాలన్న తలంపుతో అడుగులు వేస్తున్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశాన్ని తీర్చిదిద్దుకునేందుకు సుదీర్ఘయాత్ర మొదలుకాబోతున్నది. ఆ ఎజెండాతో జాతీయ భావనలతో జాతీయపార్టీని రూపొందించుకునే బృహత్తర కార్యక్రమాన్ని కేసీఆర్ భుజస్కంధాలపై వేసుకున్నారు. పట్టువదలని మనిషి జాతీయపార్టీ జెండా ఎత్తుకుంటున్నారు. తెలంగాణ నుంచి మొదలయ్యే జైత్రయాత్ర నవ భారత అవతరణకు దోహదం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అది ఆచరణలో రూపుదాల్చి నవ భారతం అవతరించాలి. దేశ స్వాతంత్య్రం కోసం ధారపోసిన రక్తం, వారి త్యాగాలను అధికారపీఠాల కింద పీఠముడి వేసుకుని చేస్తున్న రాజకీయాలకు చరమగీతం పాడాలి. ఈ దుస్థితి నుంచి బయటపడే మార్గం వేయాలి. ఒక జాతీయపార్టీకి మారుగా మరొక విఫల పార్టీని అధికారంలోకి తేవటమా? చేయాల్సింది అది కాదు, సకల సమస్యలకు పరిష్కారం ఉండాలి.
ఒక అధికార పార్టీని కూల్చటం కోసం ప్రతిపక్షం పనిచేయటం, మళ్లీ ప్రతిపక్షం అధికార పార్టీ అయినాక పాత ఆటే, మళ్లీ ఆ పాత కథే. ఈ దుర్గతి నుంచి దేశం బయటపడాలంటే ఏం చేయాలి? ఎవరికెన్ని ఎంపీల సంఖ్య? ఎవరెంత మంది ఎంపీలను తమవైపు తిప్పుకొంటారు? ఇదా మనదేశ ప్రణాళిక, ఇదా మన ప్రజాస్వామ్యం! ఇదా మన లౌకికతత్వం? ఈ దారిలో తిరోగమనమే కానీ పురోగమనం ఉండదు.
ఇప్పటిదాకా కేంద్రంలోని అధికార జాతీయ పార్టీల పద్ధతులు, విధానాలు చూసి దేశ ప్రజలకు నిరాశ పెరిగిపోయింది. కావలసినన్ని మానవ వనరులు ఉండి కూడా వాటిని ఉపయోగించుకోలేకపోవటం వైఫల్యం. గద్దెనెక్కటానికి దేశాన్ని కులం, మతం పేరున విడదీసి అధికారాన్ని పొందటమే లక్ష్యంగా ముందుకు సాగితే, దేశం ఎటుపోతున్నట్లు? మహా జనావళి ఆకాంక్షల రూపకల్పనగా పీపుల్స్ ఎజెండాకు రూపకల్పన జరగాలి. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జనహితం కోసం.. జనం కోసం, జనమే ప్రాణంగా దేశహితం కోసం నూతన భారత రచన జరగాలి. అదే కొత్త ఎజెండాగా రూపుదాల్చాలి.
ఇప్పుడు దేశానికి ఏం కావాలన్న దానికి సవాలక్ష ప్రశ్నలు మన ముందున్నాయి. అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన రాష్ర్టాల మధ్య కేంద్రమే అగ్గి రాజేస్తే ఇక దేశం ఎటుపోతుంది? భిన్నత్వంలో ఏకత్వం గల దేశంలో హిందీ భాషను అందరిపై రుద్దుతామంటే ఎట్లా? విభిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో కశ్శీర్ నుంచి కన్యాకుమారి దాకా కలిసి ఉన్న ప్రజల మధ్య భాషాభేదాల చిచ్చుపెడితే… అంతర్గత సంక్షోభాలు విచ్ఛిన్నకర పరిస్థితులకు దారితీస్తాయి.
ఇప్పటిదాకా దేశాన్నేలుతూ వచ్చిన కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టాలను ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు దేశంలో మతాన్ని, కులాన్ని ముందుకుతెస్తున్నారు. మత పిచ్చి మాటలు ప్రమాదాలు తెస్తున్నాయి. మత దురహంకార మాటలతో దేశానికి గల్ఫ్ దేశాలతో ఉన్న కోట్లాది రూపాయల వాణిజ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. దేశాభివృద్ధి విధానాలపై చర్చ జరగాలని, దేశ పురోగతి కోసం మేధావులు, విజ్ఞులు, ఆలోచనాపరులు, సృజనశీలురు కదలాలని కేసీఆర్ కోరుతున్నారు. కాంగ్రెస్కు బీజేపీకి ఆర్థిక విధానాల్లో తేడా లేదు కాబట్టి, ప్రజల ఆకాంక్షలతో నూతనంగా కొత్త ఎజెండా వేదిక మీదకు రావాలి.
దేశంలో దేశభక్తికి మారుగా ద్వేషం చెలరేగుతున్నప్పుడు.. విద్వేష, విభజన రాజకీయాలను వ్యతిరేకిస్తూ ధైర్యంగా నిలబడి సవాల్ చేస్తున్న ధైర్యశాలి కేసీఆర్. ఆయనలాంటి విజన్ ఉన్న నాయకుడు జాతీయపార్టీ పెడితే ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యమై ఒకతాటిపైకి వచ్చే అవకాశం ఉన్నది. బీజేపీని ఎదిరించే వ్యక్తి కోసం దేశంలో అన్ని పార్టీల వాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రగతిశీల కవులు, రచయితలు, కళాకారులు, ఉత్తర, దక్షిణ భారతాల్లోని టాలీవుడ్, బాలీవుడ్ ప్రఖ్యాత నటులు దేశంలో పేట్రేగుతున్న మత రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారు. వాళ్లంతా కేసీఆర్కు అండగా నిలుస్తారనడంలో ఎలాం టి సందేహం లేదు.
మన దేశాన్ని మత, కుల ఆధిపత్యాల నుంచి కాపాడుకుందాం. మనిషిని మనిషి ప్రేమించే మహోన్నత సమాజాన్ని నిర్మించుకుందాం. ఈ దేశానికి లక్ష్యం ఏది? అన్న ప్రశ్నకు స్పందనగా కేసీఆర్కు అండగా నిలుద్దాం పదండి ముందుకు.
(వ్యాసకర్త: చైర్మన్ తెలంగాణ సాహిత్య అకాడమి)