మీకు మీరుగా వేసుకోవలసిన ప్రశ్నలు- ‘మీ బుర్రకు పనిచెప్పడం ఎప్పుడు మొదలుపెడతారు? మిమ్మల్ని పదేపదే మూర్ఖుడిని చేస్తున్నారనేది ఎప్పుడు తెలుసుకుంటారు? ఊచకోతల ఉన్మాదికి ప్రత్యామ్నాయం లేదా?’
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఎదుర్కొన్న పరిస్థితినే గుర్తుచేసుకుందాం. 1949లో మిత్ర రాజ్యాలు జర్మనీని స్వాధీనం చేసుకున్న తర్వాత- ‘హిట్లర్ స్థానాన్ని భర్తీ చేయడం ఎలా?’ అనే ప్రశ్న తలెత్తింది. హిట్లర్- జనాకర్షణ గల వక్త. ప్రభావవంతమైన వ్యక్తిత్వం. జర్మనీని గొప్పదేశం చేయాలనుకున్నాడు. ‘అటువంటి వ్యక్తికి ప్రత్యామ్నాయం ఎవరు? మనకు మరొక హిట్లర్ కావాలి’ అనేది నాటి జర్మన్ల ఆలోచనాధోరణి. ఊచకోతలు కోసే రక్తపిపాసులే తప్ప ఇక మనకు వేరే గతి లేదనే భావన ఈ విధంగా ప్రజల్లో కలిగిస్తారు. ఈ వాదనతో ఏకీభవిస్తామా? ఒప్పుకొంటామా? ఆ నరహంతకుడినే ఆమోదిస్తామా! అలాంటివారి కన్నా ఉత్తములు ఎవరూ లేరా?
రెండవ ప్రపంచయుద్ధంలో హిట్లర్ను మట్టికరిపించిన నేతగా బ్రిటన్ ప్రధాని చర్చిల్ ప్రతిష్ఠ ఆకాశాన్నంటింది. యుద్ధకాలంలో అఖిలపక్ష ప్రభుత్వంలో లేబర్ పార్టీ నేత అట్లీ ఉప ప్రధానిగా ఉన్నారు. ఎటువంటి డాంబీకం లేని నాయకుడతడు. యుద్ధం ముగిసిన తర్వాత ఒకవైపు కన్జర్వేటివ్ పార్టీ నేతగా చర్చిల్ రంగంలోకి దిగితే ఆయనకు పోటీగా లేబర్ పార్టీని అట్లీ నడిపించాడు. అట్లీ ఏమాత్రం తనకు సరితూగడని చర్చిల్ భావించాడు. అట్లీ ‘గొర్రె తోలు కప్పుకున్న గొర్రె’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. కానీ బ్రిటిష్ ప్రజలు వార్ హీరో అయిన చర్చిల్ను తిరస్కరించి అట్లీకి ఘన విజయం చేకూర్చారు. ప్రత్యామ్నాయం ఎల్లప్పుడూ ఉంటుందని నిరూపించారు. మన బుర్రకు పనిచెప్తే ప్రత్యామ్నాయం ఎప్పుడూ ఉంటుంది.
ఎప్పుడైతే.. తప్పుడు సమాచారంతో, విషపూరిత భావజాలంతో నీ మేధస్సు నిండిపోతుందో అప్పుడు నిన్ను నీవు తెలుసుకోలేవు. నీవు భావపరంగా వశీకరణానికి గురవుతావు. అప్పుడు మోసపు మాటల ఊబిలో చిక్కి నిజాన్ని గ్రహించలేవు. ప్రత్యామ్నాయం లేదని చెప్పే సిద్ధాంతవేత్తల మాటలను సూక్ష్మంగా గ్రహించాలి. మూకుమ్మడి నరమేధాన్ని, హింసను, తేనెపూసిన విషపు గుళికలను జనం చేత గ్రహింపజేస్తున్న తీరును అర్థం చేసుకున్నప్పుడు వారేమిటో నీకు తెలిసివస్తుంది. ప్రజల అవసరాలు, సమస్యలు తీర్చకుండా తమ పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి వారు తప్పుడు సమాచారాన్ని ఆసరాగా చేసుకుంటారు. ఆ మోసపు మాటలతోనే నీ సమ్మతిని పొందుతారు. ఆ క్రమంలోనే.. ప్రతి ఒక్కరి ఉనికినీ ప్రశ్నార్థకం చేస్తారు.
తప్పుడు సమాచారంతో ఒక భ్రమాజనిత నిస్సహాయ స్థితిని సృష్టించి, తమ అసహ్యకర సిద్ధాంతంతో ప్రత్యామ్నాయమే లేదని చెప్పుకొస్తారు. గత్యంతరం లేని స్థితిని సృష్టిస్తారు. నిరంకుశుడినే మహానాయకుడిగా నెత్తికెత్తుకొని ప్రచారం చేస్తారు. కానీ, ఈ నిరంకుశులలో లోపాలేమీ ఉండవా? మనం ఈ భావజాల మూర్ఖపు వలలో చిక్కుకుందామా? లేదు. మనం ఎప్పటినుంచో సహోదరులుగా ఇక్కడ మసలుకుంటున్నాం. మన ఇద్దరి మధ్య ఎటువంటి విరుద్ధ విషయాలు కూడా మన స్నేహానికి అడ్డుగోడలు కట్టలేదు. కానీ వారిప్పుడు చిన్న చిన్న అంశాలను చూపెట్టి మన మధ్య సరిహద్దు గీతలు గీస్తున్నారు. రకరకాల పేర్లు పెట్టి, విభజన రేఖలు గీసి, మన ఆత్మవిశ్వాసాన్నే దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఒబామా వంటి విశేష ఆదరణ గల దేశాధ్యక్షుడితో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జో బైడెన్ సాదాసీదా నాయకుడు. ఆయనకంటూ జనాకర్షణ ఏమీ లేదు. అటువంటి సాధారణ నాయకుడు అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన, ప్రజాస్వామ్యాన్నే నాశనం చేయతలపెట్టిన దేశాధ్యక్షుడు ట్రంప్ను ఓడిస్తాడని ఎవరైనా అనుకున్నారా? అందుకే ఎప్పుడూ ప్రత్యామ్నాయం అనేది ఉంటుందని గుర్తించాలి. మనల్ని హిప్నాటైజ్ చేయనివ్వకుండా, మన బుర్రను మాయ చేయనివ్వకుండాబయటపడి ఆలోచిస్తే తప్పకుండా ప్రత్యామ్నాయం కనిపిస్తుంది.
నీకు తెలుసు, వారు అమ్ముడుపోయా రు. ఎప్పుడైతే నువ్వు ప్రత్యామ్నాయం గురించి వారిని అడుగుతావో.. వారినుంచి నిశ్శబ్దమే సమాధానంగా వస్తుంది. ఆ తర్వాత ‘నీ వంటి చెడ్డవాడిని’ కట్టడి చేసేందుకు, ఆ రోజు ఉదయమే.. వారి కపటపూరిత వాట్సాప్ గుంపు.. ఒక మూకను నీ పైకి ఎగదోస్తుంది. నీపై దాడికి వస్తున్న మూకలో ఉన్న వాళ్లు నీకు తెలియని వారు కాదు. వారంతా నీకు తెలుసు. వారంతా నీతోపాటే ఒకే పాఠశాలలో చదివారు. నీవు చదివిన చరిత్రనే చదివారు. కానీ హంపీ గురించీ, మీనాక్షీ దేవాలయం గురించీ, బద్రీనాథ్ గురించీ, కోణార్క్ గురించీ కొత్తగా ఇప్పుడే తెలుసుకున్నట్లు మాట్లాడుతారు! సంక్లిష్ట సమస్యలను తమ ఆదర్శనీయ నిరంకుశుడే పరిష్కరించాడని వాదిస్తారు. మైనారిటీల మీద దాడులు తప్పు అంటూనే, ఫలనా సెక్షన్, దాని ఉప సెక్షన్ సంగతేంటని, అది చట్టాల ఉల్లంఘన కాదా అంటూ వాదనకు దిగుతారు. రోడ్ల మీద గుంతలు పూడ్చటం వంటి పనులు కూడా తమ నిరంకుశ నాయకుడు వచ్చిన తర్వాత జరిగిన పనులుగా ప్రగల్భాలకు దిగుతారు. దానిని ప్రశ్నిస్తే అమాయకుడని, ఉన్మాది అని, సౌత్ఇండియన్ అని ముద్రలు వేస్తారు.
అసలు విషయమేమంటే.. నీ మేధోశక్తిని వెలికితీసి నిన్ను నీవు ప్రశ్నించుకోవటమే. అప్పడు నీవు, పదే పదే తప్పుడు సమాచారంతో నిన్ను వక్రంగా మలిచారని తెలుసుకోగలుగుతావు. చరిత్ర నీకు చెప్తుంది.. ఎల్లప్పుడూ ఒక ప్రత్యామ్నాయం ఉంటుందని, మానవ స్వభావం పునరావృతమవుతుందనీ. భిన్నత్వం, విద్వేషం లాంటి వాటిలో దేన్ని నీవు అంగీకరించాలో, దేనిమీద ఆధారపడాలో కూడా నీకు చెప్తుంది. ఈ విధంగా తెలుసుకునే క్రమంలో మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు సమాధానం లభిస్తుంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
రంజోనా బెనర్జీ