ఇటీవల తెలంగాణకు వచ్చిన అమిత్ షా, రాహుల్గాంధీ ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలో ఒక్క మంచి పని జరగలేదన్నారు. ముఖ్యంగా అమిత్ షా కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతున్నదని, కేంద్ర పథకాలకు పేర్లు మార్చి రాష్ట్ర పథకాలుగా చూపిస్తున్నరని, రాష్ర్టాన్ని అప్పుల పాలు చేస్తున్నారన్నారు.
టీఆర్ఎస్ మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద అపనమ్మకం పెరిగేలా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ‘రేపే’ ఎన్నికలు పెడితే తమ పార్టీ మెజారిటీ సీట్లను గెల్చుకొని ప్రభుత్వాన్ని స్థాపిస్తుందన్నారు అమిత్ షా. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ‘రేపంటే రేపే’ ఎన్నికలు జరపడం అసాధ్యమనే విషయం బహుశా అమిత్ షాకు తట్టి ఉండకపోవచ్చు. ఒక రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగాలంటే దానికి పెద్ద ప్రహసనం ఉంటుంది. ప్రజలకు ఇవన్నీ తెలియదనుకోవడం పొరపాటు.
ఇటీవలి కాలంలో ‘అపనమ్మకం’ అనే ఆయుధం అలవోకగా వాడుకలోకి వచ్చింది. శత్రువును దెబ్బ తీయడానికి అంతకంటే సులువైన ఆయుధం మరొకటి లేదనే భావన అందరిలో, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు రాజకీయ పార్టీలతో పాటు అనేకమంది, ఎదుటివారిని దెబ్బతీయడానికి వాడుకుంటున్న అతి పదునైన ఆయుధం ‘అపనమ్మకం’. తన ప్రత్యర్థి విషయంలో ఎంత ఎక్కువ అపనమ్మకం ప్రజల్లో కలిగించగలిగితే అంత భారీగా విజయం తమ సొంతం చేసుకోవచ్చనే భావన మొదలైంది. ఈ అంటువ్యాధి అన్ని రంగాల్లోకి పాకింది. దానికి ప్రత్యక్షసాక్ష్యం ఉభయ తెలుగు రాష్ర్టాల్లో గత కొంతకాలం నుంచి సాగుతున్న మాటల యుద్ధమే.
40 ఏండ్ల కిందట యన్.టి.రామారావు టీడీపీని స్థాపించి ‘తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అవమానం పాలైందని, ఆ అవమానానికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో, దేశంలోనూ ఓడించాల’ని పిలుపునిచ్చారు. స్పందించిన ఓటర్లు, మొదట రాష్ట్రంలో, తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీని గద్దె దింపారు. అప్రతిహతంగా, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అటు కేంద్రంలోను, ఇటు పలు రాష్ర్టాల్లోనూ అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్కు ఎదురుదెబ్బలు తగలడం గత శతాబ్ది 70వ దశకంలో మొదలైంది. రాష్ర్టాల్లో ఆ ప్రక్రియ కొంత ముందుగా మొదలైనప్పటికీ, కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారం చేపట్టడానికి 1977 వరకు ఆగవలసి వచ్చింది. 1971లో కాంగ్రెస్ను విజయపథంలో నడిపించిన ఇందిరా గాంధీని ఓడించడానికి, అప్పటి రాజకీయపార్టీలు, ఎదురుదెబ్బ తీశారే తప్ప, వెన్నుపోటు రాజకీయాలను కానీ, అవాస్తవాలు ప్రచారం చేయడం కానీ చేయలేదు. ఆమె చేసిన తప్పులనే తమ ఎన్నికల ప్రచారాస్త్రంగా, ఆయుధంగా వాడుకున్నారు. ఉవ్వెత్తున పెల్లుబుకిన అవినీతి వ్యతిరేక ఉద్యమం లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో ఇంతై.. ఇంతింతై.. వటుడింతై అన్న చందాన, ఆబాలగోపాలాన్ని అందులో పాల్గొనేలా చేసింది. వారూ-వీరూ అనే తేడా లేకుండా ఇందిరాగాంధీ పార్టీకి చెందిన కొందరు నాయకులతో సహా ఎందరో ఆ ఉద్యమానికి మద్దతిచ్చి ఆమెను ఓడించారు. ఇందిర చేసిన తప్పులనే ఎత్తిచూపారు కానీ, ఆమె చేయని, ఆమెకు సంబంధం లేని విషయాలపై, ప్రజల్లో ఆమెపై అపనమ్మకం కలిగే ప్రయత్నం ఎవరూ చేయలేదు.
మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఇందిరాగాంధీ వ్యూహాత్మకంగా ‘సుస్థిరతా? అస్థిరతా’ అన్న నినాదం లేవనెత్తారే కానీ, ‘అపనమ్మకం’ అనే ఆయుధాన్ని వాడలేదు. శత్రువును తన బలంతోని, వారి బలహీనతలతోని గెలిచారే తప్ప వాళ్లకు అపవాదులు అంటగట్టే విధంగా ప్రచారం చేయలేదు. అలాగే ఐదేండ్ల తర్వాత ఆమె పార్టీని ఓడించిన ఎన్టీఆర్, ఇందిరా కాంగ్రెస్ను రాజకీయంగా దెబ్బతీశారే కానీ ఆమెపై ప్రజల్లో ‘అపనమ్మకం’ పెరిగేలా ప్రచారం చేయలేదు.
ఇందిరాగాంధీనైతే ఓడించగలిగారు కానీ, నిలదొక్కుకోలేకపోయారు అలనాటి కాంగ్రేసేతర రాజకీయ నాయకులు. మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఇందిరాగాంధీ వ్యూహాత్మకంగా ‘సుస్థిరతా? అస్థిరతా’ అన్న నినాదం లేవనెత్తారే కానీ, ‘అపనమ్మకం’ అనే ఆయుధాన్ని వాడలేదు. శత్రువును తన బలంతోని, వారి బలహీనతలతోని గెలిచారే తప్ప వాళ్లకు అపవాదులు అంటగట్టే విధంగా ప్రచారం చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇందిరా కాంగ్రెస్ తాను చేయబోయే పనుల ప్రాతిపదికగానే గెలిచింది. అలాగే ఐదేండ్ల తర్వాత అదే మోతాదు ప్రభంజనంలో ఆమె పార్టీని ఓడించిన ఎన్టీఆర్, ఇందిరా కాంగ్రెస్ను రాజకీయంగా దెబ్బతీశారే కానీ ఆమెపై ప్రజల్లో ‘అప నమ్మకం’ పెరిగేలా ప్రచారం చేయలేదు. బహుశా ఇదే పద్ధతి దేశంలోని అన్ని రాజకీయపార్టీలు ఇటీవలి వరకు అవలంబిస్తూనే ఉన్నాయి. కానీ కాలం మారింది. ఎన్నికల ప్రణాళికలో, బహిరంగసభల్లో వాగ్దానాల కన్నా, తప్పుడు వాగ్దానాల కన్నా పదునైనది ప్రత్యర్థిని కించపరచడం. అసత్యాన్ని ప్రచారం చేయడం. అన్నివిధాలుగా ప్రత్యర్థులపై ప్రజల్లో ‘అప నమ్మకం’ కలగజేయడమే కీలకమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దానికి మీడియా కూడా తన వంతు సహకారాన్ని అందిస్తున్నది.
ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మచ్చుకు ఒక్కటి.. బీజేపీకి, టీఆర్ఎస్కు మధ్య అవగాహన ఉన్నదని టీకాంగ్రెస్ ఒక అపనమ్మకాన్ని ప్రచారం చేస్తుంటే, కాదు.. కానే కాదు కాంగ్రెస్కు, టీఆర్ఎస్కు మధ్య చీకటి ఒప్పందం ఉన్నదని బీజేపీ ఎలుగెత్తి చాటుతున్నది. బీజేపీ ఒక అడుగు ముందుకుపోయి టీఆర్ఎస్ కారు స్టీరింగ్ అసదుద్దీన్ చేతుల్లో ఉన్నదని మరో అపనమ్మకాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. తామేంటో, తమ వ్యూహమేంటో, గెలిస్తే తమ పంథా ఎలా ఉండబోతుందో తెలియజేయాల్సిన రాజకీయపార్టీలు దాన్ని గాలికి వదిలి ప్రత్యర్థులపై ప్రజల్లో అపనమ్మకం కలిగేలా వ్యవహరించడం విడ్డూరం.
ఈ జాడ్యం రాజకీయాలకే పరిమితమైపోలేదు. అంటువ్యాధిలా అన్ని రంగాలకూ వ్యాపించింది. దీన్ని అరికట్టకపోతే, ఇది అవినీతి కంటే వేయి రెట్ల ప్రమాదం కలిగించేస్థాయికి పోతుంది. మరో అన్నా హజారే లాంటివారు ఉద్యమించాల్సిన అవసరం కలిగినా ఆశ్చర్యపోనక్కరలేదు. తస్మాత్ జాగ్రత్త!
వనం జ్వాలా
నరసింహారావు