ఈ ఏప్రిల్ నెల మహత్తరమైనది. బాబూ జగ్జీవన్రామ్, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావ్ ఫూలే లాంటి సామాజిక తత్వవేత్తలు, జ్ఞాన సంపన్నులు, రాజనీతిజ్ఞులు, సంస్కర్తలు, వైతాళికులు ఇదే నెలలో జన్మించారు (వరుసగా 5, 11, 14 తేదీల్లో). మర్యాదాపురుషోత్తముడైన శ్రీరాముని జననం, కల్యాణం, పట్టాభిషేకమూ; యేసుక్రీస్తు మహాభినిష్క్రమణం, పునరుత్థానం జరిగిన కాలం ఇదే. తెలుగు ప్రజల జీవితాలకు కొత్త కాంతి ఇచ్చే ఉగాదిశోభకు ఆలవాలమీ సమయం. ఇస్లాం మతస్థుల పవిత్ర రంజాన్ మాసంమొదలైంది కూడా ఇప్పుడే.
దేశ కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా మనుషులంతా ఒక్కటే అనే సమతా సందేశం ఇచ్చిన మహనీయులు సర్వమానవాళి సుఖశాంతులతో మనుగడ సాగించాలని అభిలషించడంతో మాత్రమే ఆగక, కార్యాచరణకూ దిగిన్రు. ‘నీవు కర్మఫలమునకు కారణం కారాదు, అట్లని సత్కర్మలు చేయుట మానరాదు’ అని గీతాచార్యుడు కూడా చెప్పిండు. తప్పులు సరిదిద్దడానికి స్వయంగా రంగంలోకి దిగిండు. ఆయుధమైతే పట్టలేదు గానీ, తక్కిన మొత్తం కథ నడిపించిండు.
‘వారేమి చేయుచున్నారో వారికి తెలియదు. వారిని క్షమింపుము’ అన్న దయామయుడు యేసుక్రీస్తు. త్యాగం మనిషికి ఆభరణం అంటూ అభాగ్యుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని, వారి బాగోగులు చూడాలన్నది మహమ్మద్ ప్రవక్త సందేశం.
మత విశ్వాసాలు రాజకీయాల్లోకి రానంతవరకు ఏ దేశ ప్ర జల జీవితాలైనా చల్లగా ఉంటాయి. నేడు ప్రపంచంలోనే ఆనందదాయకమైన స్కాండినేవియన్ దేశాలను మినహాయిస్తే మత దౌష్ట్యానికి అల్లకల్లోలమవుతున్న దేశాలు లెక్కకు మిక్కిలి.
విచిత్రమేమంటే, తమ మతాల, తమ దైవాల, తమ ప్రవక్తల బోధనలకు పూర్తి అపసవ్య దిశలో జీవిక సాగిస్తూ, వారినే తమ కుతంత్రాలకు వాడుకోవడం. మన దేశానికి సంబంధించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కలలు గన్న సమతా సమాజం (equitable society) సాధనకు అడ్డంకి మతం పేరుతో
జరుగుతున్న తుచ్ఛ రాజకీయమే.
ఎక్కడ ఎన్నికలు రాబోతూంటే అక్కడ మత కల్లోలాలు రాజేసి, ప్రజలను భయోద్వేగాలకు గురిచేసి, వారు తమ సహజీవన సంస్కృతిని మరచి ‘ఏకరూప’ మాయలో పడేలా పథక రచన చేయడం, దాన్ని అమలుచేయడం ఎంత దుర్మార్గానికైనా తెగబడటం బీజేపీ చేస్తున్న నీచ కృత్యం, నిత్య కృత్యం.
మనం, మామూలు ప్రజలం శ్రీరామనవమి ఎట్లా జరుపుకొంటాం? పూజలు చేస్తాం, గుడులకు పోతాం, శ్రీరాముని చరితను వింటాం, ఆయన మనకు ఇచ్చిన విలువలు, సందేశాలను మననం చేసుకుంటాం, వీలైనంతవరకు ఆచరిస్తాం. మరి… బీజేపీ ఎట్లా జరుపుకోమంటున్నది మనను? విద్వేషపూరిత ప్రసంగాలు చేయమంటున్నది, మసీదులపైన కాషాయ జెండాలు ఎగరవేయమంటున్నది, ముస్లింలపై దాడి చేయమంటున్నది, వారి ఆస్తులను విధ్వంసం చేయమంటున్నది. ఇది శ్రీరాముని పేరుతో జరగడం విషాదాల్లోకెల్లా విషాదం, ఆ సత్పురుషునికి అవమానాల్లోకెల్లా అవమానం!
రామాయణ, భారత, భాగవతాలు సహా రాజ్యాంగం పట్ల అవగాహన, స్పష్టమైన కార్యాచరణ కలిగిన ఈ వ్యాస రచయిత విసిరే ఛాలెంజ్ ఏమంటే పైన చెప్పినవిధంగా పండుగ జరుపుకోమని ఏ మహనీయుడు చెప్పిండు, ఎక్కడ చెప్పిండు చూపించమని! కొద్దిమంది గుజరాత్ వ్యాపారుల, సాంస్కృతిక మాదకద్రవ్య బేహారుల మతోపాయాలకు, మాయోపాయాలకు స్వీయజీవనం సహా దేశ భవిష్యత్నే ప్రమాదంలోకి పడవేయవద్దని ఆలోచనాపరులైన బీజేపీ మామూలు స్థాయి కార్యకర్తలను, హిందూ ప్రజలను కోరుతున్నా.
‘సత్సంగత్వే నిస్సంగత్వం / నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల తత్త్వం / నిశ్చలతత్వే జీవన్ముక్తి’ అని ఆదిశంకరుడి బోధ.
సత్ప్రవర్తన, ఋజువర్తన కలిగిన గుంపుతో తిరగండి. ఆ బరాదరీని విస్తృత పరచుకోండి. అప్పుడు రాముడు, కృష్ణుడు హర్షిస్తరు. ఫూలే, అంబేద్కర్ గర్వపడుతరు.
‘కంచి మఠానికి ఎదురుగా గోడపై పెరియార్ నాస్తిక ప్రబోధాలు కనిపిస్తాయి. మఠానికి దగ్గరలోనే ఒక మసీదు కూడా ఉంది. శతాబ్ద కాలానికి పైనుంచీ ఈ మూడింటి సహజీవనం అక్కడ కొనసాగుతూ వచ్చింది. మఠం పక్కనే మసీదు ఉండటం కంచి పరమాచార్యకు అభ్యంతరం కాకపోగా, తెల్లవారుజామున అక్కడ జరిగే నమాజుతోనే తాను మేలుకునేవాడినని ఆయన చెప్పుకొన్నారు. భిన్న విశ్వాసాల శాంతియుత సహజీవనానికి అతిగొప్ప ప్రతీకలలో ఇదొకటి. ఈ వైవిధ్యాన్ని, ఈ సహజీవనాన్ని చెరిపేసి ఒకే మూస భావజాలాన్ని, మూర్తులను, చరిత్రలను ఉత్తర, దక్షిణ తేడాల్లేకుండా యావద్భారత వ్యాప్తం చేసే ఎత్తుగడలు సాగవంటారు సీనియర్ జర్నలిస్టు, భారతదేశ సంస్కృతిపై, పురాణేతిహాసాలపై లోతైన అధ్యయనం చేసిన కల్లూరి భాస్కరం. అసలైన హిందువుగా ఉండటం అంటే ఇదీ!
తమ అనుంగు కార్పొరేట్ మిత్రులకు లక్షల కోట్లలో దోచిపెడుతూ, దివాళా తీసిన బొక్కసాన్ని నింపుకోవడానికి ఎడాపెడా ధరలు పెంచేసి, బతుకులు బుగ్గిచేసి, తాము చెప్పే 80 శాతం హిందువుల జీవితాలను ఆర్థిక అక్రమశిక్షణతో అల్లకల్లోలం చేసిన బీజేపీ.. కట్టే బట్ట, తినే తిండి విషయాల్లో దౌర్జన్యంగా దూరుతూ సమాజాన్ని పాతాళానికి తీసుకుపోతున్నది. కర్ణాటకలో ఎన్నో దారుణాలు చూస్తున్నం. ‘హలాల్ మాంసం ఆర్థిక జీహాద్’ అంటూ మరో విషప్రచారం అందుకున్నది బీజేపీ. మొన్నటిదాకా హిజాబ్ అంటూ, ఇప్పుడు హలాల్ అంటూ ప్రజలను తమ దైనందిన జీవిత సమస్యల కారకుల నుంచి భావోద్వేగాల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నది. ఈ గుజరాత్ మోడల్ను, ఈ యూపీ మోడల్ను మనం సాగనివ్వరాదు.
యోగా నేర్పే రాందేవ్ బాబా గతంలో ‘పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రభుత్వాన్ని ఎన్నుకోండని చెప్పి నేడు ప్రతిరోజూ రూపాయి చొప్పున పెంచుతూపోతున్న బీజేపీ ప్రభుత్వానికి మరేం చెప్తారు’ అని విలేకరి అడిగితే కయ్యిమని లేచిండు. ఋషులు, యోగులు అని చెప్పుకొనేవారు రాజకీయ నాయకులను మించి వికృతరూపం దాలుస్తున్నరు. ప్రతి అడ్డమైన దరిద్రాన్నీ దేశం కోసం, ధర్మం కోసం అంటూ వెనకేసుకొస్తున్నరు. సమతామూర్తుల సాక్షిగా సాంస్కృతికాధిపత్యాన్ని పొగుడుతున్నరు. కుహనా హిందుత్వవాదుల స్వార్థపూరిత ఎజెండాలో పావులు అయితున్నరు. ఇది సమాజానికి ఏ మాత్రమూ క్షేమకరం కాదు.
అయినా చింతలేదు. భవిష్యత్ భవ్యంగా ఉంటది. సర్వసమత, సమగ్ర అభివృద్ధి, economy, fairer soceityని ఆకాంక్షించే, అందుకు పనిచేసే నాయకత్వం, వారికి దన్నుగా నిలిచే ప్రజలకు కొదవలేదు. ఉన్నత విలువలు ఇచ్చిన మహనీయుల స్ఫూర్తి ఉండనే ఉన్నది. ఎన్ని అవలక్షణాలున్నా భారతదేశం పటిష్ఠంగా, పరిపుష్ఠంగా ఉన్నది అంటే ఇక్కడి ప్రజల సామరస్య, సహనశీల జీవన విధానమే.
నిర్మాణంలోని విధ్వంసాన్ని ధ్వంసం చేయడమే అసలైన నిర్మాణం. బీజేపీ నిర్మిస్తున్న విధ్వంసాన్ని కూకటివేళ్లతో పెకిలిద్దాం. ఎల్లలెరుగని ప్రజకు కల్లలెరుగని దేశ నిర్మాణం సుసాధ్యం!
జై తెలంగాణ! జై హింద్!
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలైన తమిళిసై తానొక రాజ్యాంగబద్ధ ప్రథమ పౌరురాలన్న విషయం మరిచి ఫక్తు రాజకీయాలు మాట్లాడుతూ చులకన అవుతుండగా, తమిళనాడు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు మా మీద హిందీ రుద్దితే సహించం అని అమిత్షానే ఎదిరిస్తున్నడు. ఈ నేల గొప్పదనం అదే. Sence prevails. ఎందులోనూ అతి పనికిరాదనే విషయం తెలుసుకోవాలి. మన వేదాలు, మన ఉపనిషత్తులు, మన పురాణేతిహాసాలు, లెక్కకు మిక్కిలిగా ఈ విషయాన్ని ఘోషించాయి. కుహనా హిందువులైన బీజేపీవారికి వాటి సారం తెలిసి ఏడిస్తే కదా!
తాము చెప్పే 80 శాతం హిందువుల జీవితాలను ఆర్థిక అక్రమశిక్షణతో అల్లకల్లోలం చేసిన బీజేపీ.. కట్టే బట్ట, తినే తిండి విషయాల్లో దౌర్జన్యంగా దూరుతూ సమాజాన్ని పాతాళానికి తీసుకుపోతున్నది.
మొన్న అలహాబాద్ హైకోర్టు అన్నది: ‘గాలికి కొట్టుకుపోయే ఉత్తుత్తి హుంకారాలు భారతదేశ ఔన్నత్యాన్ని చెరపలేవు. ఈ దేశ పునాదులు అత్యంత పటిష్ఠమైనవి’ అని! కాబట్టే, ఇది కంటగింపు అయిన బీజేపీ తమ
పప్పులను ఉడికించుకోవడానికి దేవుళ్లను పావుల్లా వాడుకుంటున్నది. వివేచనతో వీరిని అడ్డుకోవాలి. ఈ జాతి బహుళత, సాంస్కృతిక వైవిధ్యం పునర్వికసించాలి. తెలంగాణ ఆ దిశలో పయనిస్తున్నది-గంగా జమునా తెహజీబ్ సహా శివ కేశవ అభేదపు వెలుగు చూపుతున్న కేసీఆర్ దార్శనికతలో! దీన్ని దేశవ్యాప్తం చేయాల్సిన బాధ్యత దేశ ప్రేమికులదే!
మతం సర్వవ్యాపితం. మతం ఖండాంతరం. అన్ని మతాల ప్రజలు అన్నిచోట్లా ఉంటారు. అలాంటి మతాన్ని దేశ సరిహద్దుల అంశంగా, దేశభక్తి టూల్గా మార్చడాన్ని నిలదీద్దాం. తెలంగాణ మోడల్ వెలుగులో పయనిద్దాం. దక్షిణ భారతాన్ని రక్షించుకుందాం. ఆ పైన అందరం కలిసి ఉత్తర భారత దాష్టీకాన్ని ఎదుర్కొందాం.
శ్రీశైల్రెడ్డి పంజుగుల
90309 97371