‘ఊరుతో సంబంధం లేనివాడు వచ్చి తోరణం కడితే’ అనే అర్థంలో తెలంగాణలో చెప్పుకొనే సామెత ఇది. రాష్ట్రంలో ప్రస్తుతం అచ్చం అలాంటి పరిస్థితే నెలకొంది. సంక్రాంతి పండుగప్పుడు కనిపించే గంగిరెద్దుల్లా కొందరు నేతలు పాదయాత్రల పేరిట ప్రస్థానం చేస్తున్నారు. బీజేపీ సంగ్రామ యాత్ర, కాంగ్రెస్ దండోరా, షర్మిల ప్రజా ప్రస్థానం, ప్రవీణ్ కుమార్ రాజ్యాధికార యాత్ర, టీపీసీసీ అధినేత రేవంత్కు పోటీగా భట్టి పీపుల్స్ మార్చ్, తాజాగా షబ్బీర్ అలీ పాదయాత్ర, యూపీ, రాయలసీమ పార్టీల యాత్రలు సరిపోవన్నట్టు తాజాగా ఢిల్లీ బేస్డ్ ఆప్ కూడా అంబేద్కర్ జయంతి రోజున పాదయాత్ర ప్రారంభించింది. ఊరూరా తిరుగుతున్న వారిని చూసి, ఎవరు.. మీరంతా? అని ప్రశ్నిస్తే, నెల్లూరు సుబ్బారెడ్డి ఎవరో తెలియదా అంటూ బ్రహ్మానందం మాదిరిగా ఎదురు ప్రశ్నిస్తున్నారట. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతా అంటూ షర్మిల నిజాయితీగా తనది ఈ ప్రాంతం కాదన్న వాస్తవాన్ని పరోక్షంగా ఒప్పుకోవడం కొసమెరుపు.
– వెల్జాల