అట్టడుగు వర్గాలకు ఏ రూపంలోనూ రిజర్వేషన్లు ఉండకూడదు.. అనాదిగా కొనసాగుతున్న ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఇలాగే కొనసాగాలి.. బడుగు, బలహీన వర్గాలు బానిసలుగా మసలుకోవాలి.. ఇదీ క్లుప్తంగా బీజేపీ సిద్ధాంతం. అగ్ర వర్ణులు కాని వారెవరికీ అది ప్రయోజనాలను చేకూర్చదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పన ఇందుకు సజీవ సాక్ష్యం. బీసీ నేతనని చెప్పుకొనే ప్రధానిగా ఉన్న సమయంలోనే వెనకబడిన వర్గాలు గతంలో కంటే అత్యంత ఘోరమైన వంచనకు గురవడం శోచనీయం. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయడం నేడు అత్యవసరం.
దేశానికి మొట్ట మొదటి బీసీ ప్రధాని..అంటూ 2014లో మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఓబీసీ వర్గమంతా ఉప్పొంగిపోయింది. దశాబ్దాలుగా కలలుగా మిగిలిన కొన్ని హక్కులైనా సాకారమవుతాయని ఆశించింది. కానీ ఈ 8 ఏండ్లలో బీసీలకు లేశమాత్రమైనా ప్రయోజనం ఒనగూరలేదన్నది అక్షర సత్యం. ఓబీసీ కులగణన, రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు… ఇలా చెప్పుకుంటే అన్ని రంగాల్లోనూ ఓబీసీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవడం సిగ్గుచేటు. బీసీలకు వ్యతిరేకంగా మోదీ నిర్ణయాలకు కారణాలు ఏమిటి? తద్వారా వారు ఆశిస్తున్న ప్రయోజనాలు ఏమిటి? ఇత్యాది అంశాలపై లోతుగా చర్చించుకోవాల్సిన అవసరముంది. అంతేకాదు హక్కుల సాధనకు బీసీలు తీసుకోవాల్సిన, ఎంచుకోవాల్సిన పోరాట మార్గాలపైనా స్పష్టత తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
యూపీఏ ప్రభుత్వం 2011లో సామాజిక, ఆర్థిక కుల గణన చేయించింది. కానీ సాంకేతిక కారణాలను చూపుతూ ఆ నివేదికను బయట పెట్టలేదు. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా లెక్కలు తీయిస్తామని ప్రకటించిన బీజేపీ, పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ఆ అంశాన్ని అటకెక్కించింది. ఆ నివేదికలో తప్పులు దొర్లాయని, బహిర్గతం చేయడం సాధ్యం కాదని నిర్లజ్జగా ప్రకటించడం బీజేపీ నయ వంచనకు నిదర్శనం. అక్కడితో ఆగకుండా నివేదికను బహిర్గతం చేస్తే సామాజిక అసమానతలకు దారి తీస్తుందని కొత్త భాష్యాన్ని వినిపించింది. ఇదిలా ఉంటే 2021లో నిర్వహించబోయే జనాభా గణనలోనే కుల గణనను అధికారికంగా చేపడతామని ఆగష్టు 31, 2018లో నాటి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బాహాటంగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం బీజేపీ మాట మార్చింది. ‘కులగణన’ ను చేపట్టే యోచన కేంద్రానికి లేదని లోక్ సభకు లిఖిత పూర్వకంగా తెలిపింది. కుల గణన చేపట్టాలని ఓబీసీ పార్లమెంటరీ స్థాయి సంఘం చేసిన సిఫారసును బుట్ట దాఖలు చేసింది. తెలంగాణతో సహా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కుల గణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదంటే వెనకబడిన వర్గాల ప్రయోజనాలకు బీజేపీ ఇచ్చే ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు.
కేంద్రం ఒకవైపు ప్రైవేటీకరణ పేరిట ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతూ పరోక్షంగా ఓబీసీల ఉద్యోగావకాశాలను దెబ్బ తీస్తుండడమేగాక రిజర్వేషన్లను నిర్వీర్యం చేస్తున్నది. మోదీ పాలనలో ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లు గల్లంతయ్యే దుస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో మొదటిది స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనానికి పూర్తిస్థాయి కమిషన్ను నెలకొల్పడం. రెండవది, అత్యంత ప్రధానమైనది… బీసీ కులాల సమాచారం సేకరించి వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించడం. మూడవది… ఆ రిజర్వేషన్లు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి మొత్తంగా 50 శాతం మేరకు మించకుండా చూసుకోవడం. ఈ మార్గదర్శకాలు పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
నిధుల కేటాయింపు, సంక్షేమ కార్యక్రమాల అమలు, ఓబీసీ కులాల జాబితా ఉప వర్గీకరణ, బీసీల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు హామీ .. ఇవన్నీ ఇప్పటికీ ఓబీసీలకు అందని ద్రాక్షగానే మిగిలాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో బీసీ వ్యతిరేక నిర్ణయాలు… అడుగడుగునా బడుగుల ఆశలకు గండికొట్టే కుట్రలు. అదీ బీసీ ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలోనే కావడం అన్నింటికీ మించిన విషాదం.
ఇక్కడే ఉంది అసలు చిక్కుముడి. కుల గణన అంశం కేంద్రం పరిధిలోనిది. ఆ పని చేయనని కేంద్రం తెగేసి చెబుతున్నది. మరోవైపు కనీసం ఉమ్మడి జాబితాలోనైనా ‘గణన’ అంశాన్ని చేర్చాలని, తద్వారా తామే కుల గణనను అధికారికంగా చేపట్టే వీలుంటుందని రాష్ర్టాలు ప్రాధేయపడుతున్నా ఆ బదలాయింపునకు ససేమిరా అంటున్నది. దీంతో స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఇదే కాదు నిధుల కేటాయింపు, సంక్షేమ కార్యక్రమాల అమలు, ఓబీసీ కులాల జాబితా ఉప వర్గీకరణ, బీసీల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు హామీ .. ఇవన్నీ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో బీసీ వ్యతిరేక నిర్ణయాలు… అడుగడుగునా బడుగుల ఆశలకు గండికొట్టే కుట్రలు. అదీ బీసీ ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలోనే కావడం అన్నింటికీ మించిన విషాదం.
ఇప్పుడైనా బీసీ ప్రధాని మోదీ అంటూ బీసీ సంఘాలు జబ్బలు చరచుకోవడం మాని వాస్తవ దృష్టితో ముందుకు సాగాలి. అంతఃకలహాలతో చీలి పోకుండా ఏకతాటిపై నిలబడాలి. భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలి. వర్గ స్వభావ రీత్యా, పాలనా విధానాల పరంగా, వెనకబడిన వర్గాల ప్రయోజనాలను వ్యతిరేకించడంలో ఒకే రీతిన వ్యవహరించే బీజేపీ, కాంగ్రెస్లను తక్షణం విడనాడాలి. దేశానికి నూతన అభివృద్ధి నమూనాను చూపి, కొత్త ఎజెండాతో ముందుకు వస్తున్న, బీసీలకు బాసటగా నిలుస్తున్న నూతన శక్తులతో ఏకం కావాలె. బీసీ హక్కులకు స్పష్టమైన హామీనిచ్చే ప్రజాస్వామిక, ప్రగతి శీలక పార్టీల వెంట నడవాలి. ఇది బీసీలకు అత్యవసరం.
మ్యాకం రవికుమార్
94929 10065