కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్లు, ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల్లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా ప్రభుత్వాలకు అడుగడుగునా మోకాలడ్డుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులను గవర్నర్లు పరిశీలించి ఆమోదించాలి. కానీ కేంద్రం సూచనల మేరకు కొందరు గవర్నర్లు ప్రజాస్వామ్యవిరుద్ధంగా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి గవర్నర్లపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి.
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న గవర్నర్లను తొలగించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలని ఇటీవల సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమవుతున్నాయి.
దేశంలోని ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల గవర్నర్లు రాజకీయ నాయకుల తరహా లో రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాల్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో బోధనా సిబ్బందిని నియమించాలని ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో యూనివర్సిటీల బోధనా సిబ్బంది కామన్ రిక్రూట్మెంట్ బిల్లును ప్రవేశపెట్టింది. దాన్ని ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లును ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్ తమిళిసైకు పంపించారు.
గవర్నర్ ఈ బిల్లును పెండింగులో పెట్టడంతో బోధనా సిబ్బంది నియామక ప్రక్రియ ప్రశ్నార్థకమైంది. గవర్నర్ అవలంబిస్తున్న ఈ అప్రజాస్వామిక విధానంపై రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థుల ఐక్య కారాచరణ సమితి భగ్గుమన్నది. సమస్య పరిష్కారం కోసం వెం టనే ప్రత్యక్ష చర్యకు దిగాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో రాష్ట్ర గవర్నర్ చెలగాటమాడుతున్నారని జేఏ సీ విమర్శించింది. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగా వ్యవహరిస్తూ, రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించిన బిల్లును తొక్కి పెట్టి, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం శోచనీయమని పేర్కొంది.
గవర్నర్ వెంటనే స్పందించి బిల్లును క్లియర్ చేయాలని, లేని పక్షంలో విద్యార్థుల శక్తి ఏమిటో చూపిస్తామని జేఏసీ అల్టిమేటం జారీచేసింది. లేకపోతే నవంబర్ 12న చలో రాజ్భవన్ నిర్వహిస్తామని హెచ్చరించింది. తమిళనాడు గవర్నర్ కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. జాతీయస్థాయిలో కేంద్ర ప్రభు త్వం నిర్వహిస్తున్న నీట్ పరీక్ష లోపభూయిష్టంగా ఉన్నదనీ, దీంతో తమ విద్యార్థులు నష్టపోతున్నారని తమిళనాడు ప్రభుత్వం భావించింది. రాష్ట్రంలో నీట్ పరీక్షకు బదులు గా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకునేందుకు వీలు కల్పించే బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపింది.
కానీ ఆ రాష్ట్ర గవర్నర్ రవి ఆ బిల్లును తిరస్కరించారు. దీం తో డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడి ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజ్ భవన్ను బహిష్కరించే వరకూ వివాదం సాగింది. గవర్నర్ తీరుపై తమిళనాడులో విద్యార్థి లోకం భగ్గుమంది. గవర్నర్ను వెం టనే ఆ పదవి నుంచి తొలగించాలని అధికార డీఎంకే డిమాండ్ చేసింది. దీనికి ప్రతిపక్షాల మద్దతును కూడా కూడగట్టింది. తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును అధికార, ప్రతిపక్షాలు త్వరలోనే రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లనున్నాయి.
కేరళ గవర్నర్ తీరూ అంతే…: కేరళలోని అన్ని యూనివర్సిటీల ఉప కులపతులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలను వీసీలు నిరాకరించారు. దీంతో మిమ్మల్ని పదవుల నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలంటూ గవర్నర్ వీసీలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. దీనిపై ఆగ్రహించిన వీసీలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ ఇలా నోటీసులు జారీచేయడం అక్రమమని ప్రకటించాలని, వాటిని రద్దుచేయాలని వారు హైకోర్టును అభ్యర్థించారు. గవర్నర్ అంతిమ ఉత్తర్వులు ఇచ్చేవరకు వీసీలు ఆ పదవిలో కొనసాగవచ్చని కోర్టు ఆదేశించింది. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేరళ గవర్నర్ కొన్ని మీడియా సంస్థలపైనా ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదాస్పదమైం ది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థను పత నం చేసేందుకు ప్రయత్నిస్తున్నది గవర్నర్ ఆరి ఫ్ వ్యాఖ్యానించడం కేరళలో రాజకీయ దుమారం లేపింది.
గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాం డ్ చేశారు. ఈ క్రమంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న గవర్నర్లపై పోరాడటానికి బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ప్రజా ప్రభుత్వాల పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజాగ్రహం చవిచూడక తప్పదని గవర్నర్లు తెలుసుకోవాలి. రాజ్యాంగ పరిధిలో విధులను నిర్వర్తించాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)
తక్కళ్లపల్లి
రవీందర్ రావు