తొలి దశ అయినా మలిదశ అయినా తెలంగాణ ఉద్యమం పొడుగునా ఉద్యోగుల పాత్ర విస్మరించలేనిది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదాక అనేక పార్టీలు ‘జై తెలంగాణ’ అని నినదించాయి.
ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చినా తెలంగాణ టీఎన్జీవోస్ సంఘం తెలంగాణ వాదానికి ఊతమిచ్చి వారివెంట నడిచింది. ఇలాంటి సంఘాన్ని విమర్శించడం అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద దాడి చేయడమే. తెలంగాణ హక్కుల మీద దాడి చేయడమే. అంతేకాదు, తెలంగాణ ఉద్యమకారులనూ అవమానించడమే. ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ కనిపించని ఇప్పటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గుర్తించాలి.
నేడు బీజేపీ బండి సంజయ్లాంటి వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిని చేయడం ఆ పార్టీ చేసుకున్న దురదృష్టంగా భావిస్తున్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో మా ఉద్యోగులు 42 రోజులు సకలజనుల సమ్మె చేశారు. కానీ, ఏ ఒక్క రోజూ బండి సంజయ్ సమ్మెకు మద్దతు తెలపలేదు. కనీసం టెంట్లోనైనా అడుగుపెట్టలేదు. అలాంటి వ్యక్తికి తెలంగాణ ఎన్జీవో సంఘం మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఎన్జీవో సంఘం గతంలో పోరుయాత్రలో పాల్గొన్నది. అనేక ఉద్యమాలు చేసింది. కానీ, తెలంగాణ ఉద్యోగుల ఆకాంక్షలను ఉద్యమ సందర్భంగా పక్కనపెట్టిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా కిషన్రెడ్డి, లక్ష్మీనారాయణను రాజీనామా చేయాల్సిందిగా తెలంగాణ ఎన్జీవో సంఘం డిమాండ్ చేసింది. కిషన్రెడ్డి ఢిల్లీ పెద్దలకు అంటకాగుతూ తప్పించుకుతిరిగాడు. కానీ లక్ష్మీనారాయణ మేమందించిన ఉద్యమస్ఫూర్తితో రాజీనామా చేసి ప్రజల ముందుకువచ్చారు. ఇందులో భాగంగానే నాటి ఉద్యమ సారథి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు లక్ష్మీనారాయణను గెలిపించాలని నిజామాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించి లక్ష్మీనారాయణను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు. అప్పుడు పదవికి రాజీనామా చేయమంటే పారిపోయిన వ్యక్తి కిషన్రెడ్డి. ఈ విషయం ఆయన మరిచిపో యారా అని ప్రశ్నిస్తున్నాం.
ఈ రోజు ఎన్జీవో నాయకులు, టీఎన్జీవోలు అమ్ముడు పోయారనేటువంటి బండి సంజయ్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ నాయకుడు అమ్ముడుపోయాడో బండి సంజయ్ ప్రజల ముందుకు వచ్చి స్పష్టంగా తెలియజేయాలి. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, బేషరతుగా లక్షలాది మంది ఉద్యోగులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి.
తెలంగాణ ఎన్జీవో సంఘం నేతలు టీఆర్ఎస్ పార్టీకి, గడీలకు కాపలా కాస్తున్నారని బండి సంజయ్ ఆక్షేపణీయమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నది. ఏ ఇతర రాష్ట్రమైనా ఇటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నదా అని బండి సంజయ్ని ప్రశ్నిస్తున్నాం? అంతెందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలను కాపీ కొట్టి మరి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. అనేక సంక్షేమ పథకాలు బాగున్నాయంటూ కేంద్రమంత్రులే స్వయంగా ప్రకటిస్తున్నారు. దీనికి బండి సంజయ్ ఏమని సమాధానం చెప్తారు? ఇట్లా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం పాటుపడితే ఆయన వెంబడి తెలంగాణ ఉద్యోగుల సంఘం నిలుస్తున్నది. అంతేకానీ ఉద్యోగులు ప్రభుత్వానికి గాని, కేసీఆర్కు గాని కాపలా కాస్తున్నారని విమర్శించడం బండి సంజయ్ వికృతిబుద్ధికి, అజ్ఞానానికి పరాకాష్ఠ.
డిస్కంలు, విద్యుత్ ట్రాన్స్మిషన్ ప్రైవేటీకరణ వల్ల కేంద్ర విద్యుత్ ఉద్యోగులతో పాటు వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత 75 ఏండ్ల దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అతి తక్కువగా 14.3 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన చరిత్ర ప్రధాని నరేంద్ర మోదీది. కానీ, గత ఎనిమిదేండ్లలో దేశంలో 73 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. అయినా దేశాన్ని, దేశంలోని సహజ వనరులను అమ్మేవాళ్లకు ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులను విమర్శించే హక్కు అసలున్నదా అని ప్రశ్నిస్తున్నాం. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే ఉద్యోగస్థులను బ్లాక్మెయిల్ చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నాడని ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది.
తెలంగాణ ఉద్యమంలో ఏమైతే హామీ ఇచ్చిందో ఆ హామీలు నేరవేర్చుకోవడానికే తెలంగాణ ప్రభుత్వం వెంట తెలంగాణ ఉద్యోగుల సంఘం నడుస్తున్నదని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగులు తమ వృత్తిపరమైన బాధ్యతతో పాటు సమాజంలో పౌరులుగా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తారనే విషయాన్ని గమనించాలి. ఈ విషయం బండి సంజయ్కి తెలువకపోవడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గత కేంద్ర ఉద్యోగులను తీసివేసిందా, లేదా అదే ఉద్యోగులతో పనిచేయించుకుంటున్నదా అనే విషయాన్ని బండి సంజయ్ గుర్తెరగాలి. అలాగే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఉద్యోగులు తమ బాధ్యతలు నిర్వహిస్తారే తప్ప అమ్ముడుపోరనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. దాదాపు మూడున్నర లక్షల ఉద్యోగులు, సుమారు మూడు లక్షల పింఛనర్ల మనోభావాలను దెబ్బతీసేలా బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం ఆయన కుసంస్కారం. ఆయన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర ఉద్యోగులందరూ కన్నెర్ర జేస్తున్నరు. ఉద్యోగులు బీజేపీని ప్రజా సమూహం నుంచి బహిష్కరించే రోజు దగ్గరలోనే ఉన్నదని బీజేపీ నాయకులు గమనించాలె.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశవ్యాప్త ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులే అంబానీ, అదానీలకు అమ్ముడుపోయారు. అందువల్లనే బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ వంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలతో పాటు విద్యుత్ను సైతం ప్రైవేటీకరిస్తూ ఉద్యోగుల పొట్టకొడుతున్నది. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నది. ఈ పాపం కచ్చితంగా బీజేపీ పాలకులకు తాకుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు చంద్రబాబు, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాలను గద్దె దించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది. అదే రీతిలో ఇప్పటి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నాం. అలాగే దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను సవరిస్తూ కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా మారుతున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నాం. గత ఎనిమిదేండ్లుగా బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేనటువంటి విషయం ప్రజలకు అర్థమైంది.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కోట్లాది ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. అయినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగడం దేశానికి అరిష్టంగా భావిస్తున్నాం. ఈ స్థితిలో జాతీయ ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్న వేళ తెలంగాణ గడ్డపై కేసీఆర్ ప్రత్యామ్నాయశక్తిగా ఎదగడం దేశమంతా గర్విస్తున్నది.
కేవలం తమ విధానాలను వ్యతిరేకిస్తున్నందుకే బీజేపీ తెలంగాణ ప్రభుత్వంపై, ప్రజలపై, అన్నివర్గాలపై అనేక రూపాలలో దాడులకు దిగుతున్నది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలంతా మళ్లీ గొంతును వినిపించి బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఒక్కటి కావాల్సిన సందర్భాన్ని గుర్తుచేస్తున్నది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ అక్కసుతో తెలంగాణ ఎన్జీవోలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రం గా నిరసిస్తున్నాం. అయితే కేంద్ర విధానాల ను వ్యతిరేకించే అద్భుతమైన అవకాశం మునుగోడు ఉప ఎన్నిక రూపంలో సాక్షాత్కరించింది. ఇటువంటి సందర్భంలో మునుగో డు ప్రజలు తమ ఓటు ద్వారా ఒంటెత్తు పోకడగా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగులందరి తరఫున బాజాప్తాగా పిలుపునిస్తున్నాం. ప్రజల కోసం పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి వెన్నంటి నిలువడం మా బాధ్యతగా భావిస్తున్నాం.
(వ్యాసకర్తలు: తెలంగాణ ఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు)
స్వామిగౌడ్
దేవీ ప్రసాద్