మునుగోడు ప్రజలు తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వనున్నారనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదివారం నాటి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటువంటి నమ్మకాన్ని వ్యక్తపరచటం అట్లుండగా, పలువురు స్వతంత్ర పరిశీలకులు నియోజకవర్గమంతటా వేర్వేరుగా పర్యటించి, భిన్నవర్గాల ప్రజలతో మాట్లాడిన అనంతరం వెల్లడిస్తున్న అభిప్రాయాలు కూడా ఏకగ్రీవమైన రీతిలో ఇదేవిధంగా ఉంటున్నాయి. హైదరాబాద్ నుంచే మానిటర్ చేస్తున్న మేధావుల అభిప్రాయాలు సైతం ఇందుకు భిన్నంగా లేవు.
ఇందులో గమనించదగ్గ విశేషం ఏమంటే, ఈ క్షేత్రస్థాయి పరిశీలకులు, హైదరాబాద్ పరిశీలకులలో దాదాపు ముప్పావు మంది టీఆర్ఎస్ విమర్శకులు. కాని వారందరి అంచనాలు టీఆర్ఎస్ గెలవబోతున్నదనే. ప్రజలు తమతో ఏమన్నారని వారు చెప్తున్న విషయాలను, వీరికి స్వయంగా ఏర్పడిన అభిప్రాయాలను క్రోడీకరించి చూసినప్పుడు అక్కడి వాస్తవ పరిస్థితులు ఏమిటో మనకు అర్థమవుతాయి. అదేవిధంగా, ఈ ఎన్నికల సందర్భంగా అక్కడ తలెత్తిన ప్రశ్నలు ఏమిటో, వాటిగురించి ప్రజల ఆలోచనలు ఏమిటో కూడా అవగతమవుతాయి. వాటిలో కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా టీఆర్ఎస్కు అనుకూలంగా తేలుతుండటం గమనార్హం. ఇందుకు విరుద్ధంగా బీజేపీ, కాంగ్రెస్లలో దేనికీ అనుకూలమైనది ఏదీ ప్రజల నుంచి గాని, ఈ పరిశీలకుల నుంచి గాని వ్యక్తం కావ టం లేదు. అదేవిధంగా టీఆర్ఎస్కు స్పష్టంగా వ్యతిరేకమనదగ్గది కూడా ఏదీ వీరి దృష్టికి రాలేదు. కాకపోతే, ఆశించినవి కొన్ని జరగకపోవటం పట్ల కొంత అసంతృప్తి ఉంది. అదే సమయంలో ఆ పనులు మున్ముందు అధికారపక్షం ద్వారానే జరుగుతాయనే ఆశాభావాలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ల పట్ల ఏ ఆశలూ లేవు. కేంద్రం పట్ల అంతకన్నా లేవని ప్రజలే అంటున్నారు.
స్థూలంగా ఇదీ పరిస్థితి. ఇప్పుడు కొంత వివరాల్లోకి వెళ్దాం. అసలీ ఉప ఎన్నిక ఎందు కు వచ్చినట్లనే ప్రశ్న మొదటినుంచే రెండువైపుల నుంచి రాగా, ప్రజల్లో బాగా చర్చనీయాంశమైంది. దీనిపై టీఆర్ఎస్ విమర్శే ప్రజ ల నుంచి కూడా వినవస్తున్నది. బీజేపీ, ఆ పార్టీ అభ్యర్థి వివరణలను ఎవరూ నమ్మటం లేదు. అభివృద్ధి, సంక్షేమాలు ఇప్పటికి చేసిన వి, ఇకముందు చేయగలమనేవి అధికారపక్షానికి బాగా కలసివస్తున్నాయి. ఇది రెండవ అం శం. జరగవలసినవి గాని, వేర్వేరు వర్గాల వా రు ఇంకా సమస్యలు అనుకునేవి గాని ఉన్నా యి. అయితే వాటిని రానున్న రోజులలో కేసీఆర్ ప్రభుత్వం తీర్చగలదనే నమ్మకమే అం తటా వినవస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్లు గాని, వాటి అభ్యర్థులు గాని, తరచూ ప్రస్తావనకు వచ్చే నరేంద్ర మోదీ ప్రభుత్వం గాని ఏమైనా చేయగలవనే మాటను అందరూ తోసిపుచ్చుతున్నారు. అది కూడా అవహేళనగా. ఇందుకు తగినట్లు బీజేపీ అభ్యర్థి తను ఎమ్మెల్యేగా ఉండిన నాలుగేండ్లలో చేసినట్లు చెప్పేందుకు ఎవరికి ఏమీ కనిపించటం లేదు.
మూడవది డబ్బు ఖర్చు. డబ్బు హడావుడి నగదు రూపంలో, వస్తు రూపంలో, ఖర్చు రూపంలో బాగానే ఉన్నది. కాని అది ఓటింగ్ విషయంలో నిర్ణయాత్మక పాత్ర వహించటం ఒక పరిమితికి మించగలదనే సూచనలు ఎక్కడా ఏ వర్గం నుంచి కూడా ఈ పరిశీలకులకు లభించలేదు. నాలుగవ అంశం ఇటు రాష్ట్ర ప్రభుత్వం, దాని నాయకునిగా కేసీఆర్, అటు కేంద్ర ప్రభుత్వం, దాని నాయకునిగా నరేంద్ర మోదీల పనితీరు, అందువల్ల ప్రజలకు కలుగుతున్న మంచిచెడుల చర్చ. ఆ వివరాలు వార్తల్లో నానుతున్నవే అయినందున, ఈ పోటీలో కేసీఆర్ది పూర్తిపై చేయి అవుతున్నదనేది ఈ పరిశీలకుల అభిప్రాయం. ఇక మోదీ పాలన వల్ల కలుగుతున్న కష్ట, నష్టాలపై కేసీఆర్ విమర్శలతో అందరూ దాదాపు పూర్తిగా ఏకీభవిస్తున్నారు.
మునుగోడు ఎన్నిక ఫలితం మామూలుగానే ముఖ్యం కావటాన్ని వదిలితే, అది ఒక మైలురాయి కావటం ఎందువల్లనో ఇప్పుడు చూద్దాం. 1.అభివృద్ధి సంక్షేమాలకు, ధన బలానికి మధ్య ఇంతటి పోటీ తెలంగాణలో ఇంతకుముందు ఏర్పడిన సందర్భం ఏదీ గుర్తుకురావటం లేదు. 2.అభ్యుదయ శక్తులు ఒకవైపు, పచ్చి మతతత్తం మరొకవైపు మోహరించటం, మత తత్తానికి ధనబలం తోడవటం స్పష్టంగా కనిపిస్తున్నది. 3.ఈ ఒక్క ఉప ఎన్నికను అనువుగా చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు, ఎమ్మెల్యేలను ఖరీదు చేసేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం సర్వశక్తులు ఒడ్డటం, రాష్ట్ర నాయకులు శివమెత్తినట్లు ఊగిపోతుండటం కూడా ఒక పరీక్షగా మారింది. 4.వచ్చే సంవత్సరం జరిగే సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఇది చివరి ఉప ఎన్నిక అయినందున, ఉభయులకు ఇది పెద్ద పరీక్ష అవుతున్నది. 5.అసలు మొత్తం దక్షిణాదిలోనే కర్ణాటక తర్వాత మరొ క రాష్ట్రంలోకి ఏమి చేసైనా సరే ప్రవేశించి తీరాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అధిష్ఠానానికి మునుగోడు మహా కీలకంగా మారింది. 6.కేసీఆర్ను చిరకాలం పాటు విమర్శించిన తెలంగాణతో పాటు ఆంధ్రా ప్రాంతానికి చెం దిన కొన్ని మేధావి వర్గాలకు ఇటీవలి మాసాలలో వివిధ కారణాల వల్ల ఆయన పట్ల సానుకూలత ఏర్పడుతున్నది. తన అభివృద్ధి-సంక్షేమాలు, మత సామరస్యం, బీజేపీ-కేంద్రం-మోదీ దురాగతాల పట్ల ధిక్కారం, బీఆర్ఎస్ పార్టీ ప్రకటన ఇందుకు ముఖ్య కారణాలు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇప్పుడిందుకు తోడయింది. వీరంతా మునుగోడు వైపు ఉత్కంఠగా చూస్తున్నారు. 7.ఆదివారం నాటి సభలో కేసీఆర్ స్వయంగా ప్రకటించినట్లు, మునుగోడు విజయం భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్మాణానికి పునాదిరాయి వంటిది కాగలదు. ఈ కారణాలన్నింటి వల్ల అది ఒక మైలురాయి అవుతున్నది.
టంకశాల అశోక్