కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రజలు ఆశించారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలు పరిష్కారమైతే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందనీ వాళ్లు భావించారు. కానీ, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవెరలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించకపోవటం శోచనీయం. విభజన సమస్యలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ఎన్నికల వేళ అనేక హామీలు ఇచ్చిన నరేంద్ర మోదీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలుచేయడంలో విఫలమయ్యారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్’ నినాదం మాటలకే పరిమితమైంది.
బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ‘పైన పటారం.. లోన లొటా రం’ అనే చందంగా ఉన్నది. మాటలతో కోటలు కడుతున్నది కానీ కాలు మాత్రం గడప దాటడం లేదు. సరికదా గంగా జముని తహజీబ్కు ప్రతీక అయిన తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నది. బడుగు, బలహీనవర్గాల నాయకులకు బీజేపీలో అసలు విలువే లేదనే చర్చ ప్రస్తుతం నడుస్తున్నది. తెలంగాణ ప్రజలేం కోరుకుంటున్నారో గుర్తించడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు. అందుకే అనేకమంది ఉద్యమకారులు, మేధావులు బీజేపీని వీడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, దాసోజు శ్రావణ్, ఆనంద భాస్కర్ లాంటివారు ఆ పార్టీలో అవమానానికి గురైనవారే. ఇమడలేక ఇంటి పార్టీకి చేరుకున్నారు. వీళ్లు తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసే ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే అని భావించారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం ఇష్టం లేక కేసీఆర్తో అడుగులు వేసేందుకు సిద్ధం కావడం ఆహ్వానించదగిన పరిణామం. అయితే కొందరు బడుగు, బలహీనవర్గాల నాయకులు, ఉద్యమకారులు ఇంకా మోసపూరిత బీజేపీలో కొనసాగుతుండటం సిగ్గుచేటు.
‘ఎస్సీ వర్గీకరణ’ అంశం కేంద్రం ద్వారా పరిష్కరించుకోవాలని మందకృష్ణ భావించి బీజేపీకి దగ్గరయ్యాడు. సభలకు, సమావేశాలకు బీజేపీ అధినాయకత్వాన్ని ఆహ్వానించాడు. వారు కూడా సభలకు, సమావేశాలకు హాజరయ్యారు. అనేక సభల్లో ‘ఎస్సీ వర్గీకరణ’ అంశం పార్లమెంటు ద్వారా పరిష్కరిస్తామని బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. మందకృష్ణ చేత కాళ్లు మొక్కించుకున్నారు. అయినా ఇంకా ‘ఎస్సీ వర్గీకరణ’ అంశం పరిష్కరించకపోవడం విడ్డూరం. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలని రిజర్వేషన్లను పెంచారు. ఆ రిజర్వేషన్ల అమలుకు చొరవ చూపకుండా వారిని అవమానిస్తున్నది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. రిజర్వేషన్లను అడ్డుకునే కుట్రకు తెరలేపుతున్నది. సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబించడం కుట్రపూరిత చర్యనే. దళిత, గిరిజన నాయకులను అవమానించడం బీజేపీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండదని బీజేపీ విధానాలను చూసి మేధావులే విస్తుపోతున్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను అంగట్లో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి దాదాపు 8 రాష్ర్టాల ప్రభుత్వాలను కూల్చివేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ఈ దుష్ట, విష సంప్రదాయాన్ని తెలంగాణకు సైతం విస్తరింపజేయాలని ప్రయ త్నం చేసి భంగపడ్డది. కోట్ల రూపాయల నగదు, కాంట్రాక్టులు, పదవుల ఆశ చూపి టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. తెలంగాణ బిడ్డలు నికార్సయిన ఆత్మగౌరవం కలిగిన వారు. అందుకే ఎమ్మెల్యేలు అమ్ముడుపోలేదు. ప్రలోభాలకు లొంగలేదు. పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం లాలూచీపడి బీజేపీకి అమ్ముడుపోతున్న నకిలీ నాయకులకు తగిన బుద్ధి చెప్పారు. వారిబాటలో బీజేపీని తరిమికొట్టడానికి తెలంగాణ ప్రజలు కూడా సిద్ధమయ్యారనడంలో సందేహం లేదు. అందుకే అమ్ముడుపోని తెలంగాణ బిడ్డలకు జేజేలు కొడుతున్నారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుకు తలొగ్గి మునుగోడు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ప్రజ లు ఓడించటం ఖాయం.
(వ్యాసకర్త: కాకతీయ యూనివర్సిటీ)
డాక్టర్ బొల్లికొండ వీరేందర్ 98665 35807