వర్తమాన పరిస్థితుల్లో దేశానికి ఒక దిక్సూచి అవసరం. సామాజికంగా, ఆర్థికంగా, వెనుకబడిన వ్యవసాయ రంగానికి చేయూత అవసరం. నిరుద్యోగులకు ఉపాధి అవసరం. వీటన్నింటినీ పరిష్కరించడానికి దేశానికి సమర్థుడైన నాయకుడు అవసరం. ఈ అవసరాన్ని గుర్తించిన ఒక బక్క పలుచని మనిషి బీఆర్ఎస్ జెండా పట్టుకుని ముందుకు వచ్చారు. 75 ఏండ్లలో బీజేపీ, కాంగ్రెస్ చేయలేని అభివృద్ధి తాను చేసి చూపిస్తానని హామీ ఇస్తున్నారు. ఆయనే ‘దేశ్ కీ నేత’ కేసీఆర్.
1947 నుంచి 1977 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ దేశంలో నిరాటంకంగా కొనసాగింది. ఇందిరా గాంధీ నిరంకుశత్వం వల్ల ప్రాభవం కోల్పోయిన ఆ పార్టీ రెండేళ్లు అధికారానికి దూరమైంది. ఆ తర్వాత మళ్లీ ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్కే దేశ ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఆ తర్వాత మధ్యలో బీజేపీ అనేక పార్టీల సాయంతో అధికారం కొనసాగించింది. 2004 నుంచి 2014 వరకు మళ్లీ కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమి సాయంతో అధికారం చేపట్టింది. గత 8 ఏండ్లుగా ఎన్టీయే కేంద్రంలో అధికారంలో ఉంది. అంటే ఇప్పటివరకు దాదాపుగా బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే దేశాన్ని పాలించాయి. కానీ దేశ ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం ఏర్పడింది. రాజ్యాంగ వ్యవస్థలు బలహీన పడ్డాయి. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారు.
గౌతమ బుద్ధుడి బోధనలు, గాంధీ చూపిన మార్గం, అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేస్తున్న కేసీఆర్కు యావత్ దేశం బ్రహ్మరథం పడుతుందనడంలో సందేహం లేదు. దేశంలో రైతు రాజ్యం స్థాపించాలంటే అది కేసీఆర్తోనే సాధ్యమవుతుందని 29 రాష్ర్టాలకు చెందిన రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారు. దేశంలో ఉండే సహజ వనరులు సద్వినియోగం చేయగల సమర్థుడైన నాయకుడు కేసీఆర్ అని వాళ్లు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశానికి మోడల్గా ఉపయోగపడుతుందని జాతీయ రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారు. కేసీఆర్ పోరాట పటిమ, పాలనా దక్షత తెలిసిన అనేక రాజకీయ పార్టీలు బీఆర్ఎస్కు తమ మద్దతును ప్రకటిస్తున్నాయి.
తెలంగాణలో అమలవుతున్న ‘రైతుబంధు’, ‘రైతుబీమా’ లాంటి రైతు సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉన్నది. రోజురోజుకూ దిగజారుతున్న భారత ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేసీఆర్ తన మేధో సంపత్తిని ఉపయోగిస్తారని భారత సమాజం ఆశిస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ అభివృద్ధిలో మాత్రం పెద్దన్న పాత్ర పోషించలేకపోతున్నది. దేశంలో మానవ వనరులు, ఖనిజ సంపదకు కొదవలేదు.
కానీ వాటిని సద్వినియోగం చేసుకునే సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వల్ల దేశం వెనుకబడిపోతున్నది. కాబట్టి కొత్త రాజకీయాలకు చేయూతనిచ్చి దేశాన్ని ముందుకుతీసుకుపోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపైనే ఉన్నది. దేశంలో 50 శాతం భూమి వ్యవసాయ యోగ్యమైనది, అందులో 43 శాతం భూమికి సాగునీటి సౌకర్యం ఉంది. అయినా దేశంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. భారత్ను ఆకలి కేకలు లేని దేశంగా తీర్చిదిద్దాలంటే దీర్ఘ కాలిక ప్రణాళిక అవసరం. ఇప్పటివరకు దేశాన్ని పాలించిన పార్టీలు ఈ సమస్యను పరిష్కరించలేకపోయాయి. కొత్త జాతీయ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ ఈ సమస్యను పరిష్కరిస్తుందని దేశ ప్రజానీకం ఆశిస్తున్నది.
దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సమర్థవంతమైన ఆర్థిక నిపుణుల అవసరం ఈ దేశానికి ఎంతో ఉన్నది.రోజురోజుకు పెరుగుతున్న డాలర్ ధరలతో పోలిస్తే రూపాయి విలువ పడిపోతున్నది. దేశం నుంచి ఎగుమతుల కంటే దిగుమతులు వేగంగా పెరుగుతుండటంతో మన ద్రవ్య లోటు కూడా పెరుగుతున్నది.
భారత్ ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం మంచిదే. కానీ, దేశ జనాభాలో ఒక శాతం మాత్రమే 20 శాతం ప్రజల జాతీయాదాయాన్ని అనుభవిస్తున్నారు. 50 శాతం మంది చేతుల్లో 13 శాతం జాతీయాదాయం ఉన్నదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ ఆర్థిక అసమానతల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికీ దేశంలో స్వచ్ఛమైన నీరు, పోషక విలువలున్న ఆహారం అందుబాటులో లేదని, విద్యా ప్రమాణాలు అతి పేలవంగా ఉన్నాయని మేధావులు అంటున్నారు. దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సమర్థవంతమైన ఆర్థిక నిపుణుల అవసరం ఈ దేశానికి ఎంతో ఉన్నది. రోజురోజుకు పెరుగుతున్న డాలర్ ధరలతో పోలిస్తే రూపాయి విలువ పడిపోతున్నది.
దేశం నుంచి ఎగుమతుల కంటే దిగుమతులు వేగంగా పెరుగుతుండటంతో మన ద్రవ్య లోటు కూడా పెరుగుతున్నది. ఇది దైనందిన జీవితంపై, సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక బలమైన రాజకీయశక్తి అవసరమని గుర్తించి బీఆర్ఎస్ ముందుకు సాగుతున్నది. కేసీఆర్ ఆలోచనా ధోరణి గురించి దేశంలో గతకొంత కాలంగా చర్చ జరుగుతున్నది. దేశానికి ఆయనే సరైన నాయకుడు అని పలువురు రాజకీయ నేతలు, విద్యావేత్తలు, సీనియర్ జర్నలిస్టులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలకు న్యాయం చేసే కొత్త జాతీయ పార్టీ అవసరం. అ అవసరాన్ని బీఆర్ఎస్ తీరుస్తుందని ఆశిద్దాం.
(వ్యాసకర్త: పౌర సంబంధాల అధికారి, కేయూ)
డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి