‘సూటి తప్ప పక్క పోటెరుగదు నా మాట’ అన్నది ఆమె వ్యక్తిత్వం. తెలంగాణ మాండలికానికి మెరుగులు దిద్దిన ఘనత ఆమె సొంతం. తెలంగాణ మాండలిక పద సంపదకు, పరిరక్షణకు ఆమె చేసిన సేవలు ఘనం. ఆమే పాకాల యశోదా రెడ్డి. తెలంగాణ, తెలుగు భాషలకు యశోదా రెడ్డి పెట్టింది పేరు. ఉమ్మడి రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా పనిచేసిన ఏకైక మహిళ ఆమె.
యశోదా రెడ్డి మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లిలో సరస్వతమ్మ, కాశిరెడ్డి దంపతులకు ఆగస్టు 8, 1929న జన్మించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను రుక్కునమ్మ చేరదీశారు. చదువే ప్రాణంగా పెరిగిన యశోదా రెడ్డి ఉన్నత విద్యనభ్యసించారు. 1955లో హైదరాబాద్లోని ఒక మహిళా కళాశాలలో తెలుగు ఉపన్యాసకురాలిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. సంస్కృతం, జర్మన్ భాషలను అధ్యయనం చేసిన యశోదారెడ్డి తెలుగులో ‘హరివంశములు’పై పరిశోధన చేసి 1969లో డాక్టరేట్ను పొందారు.
తన 12వ ఏట నుంచే రచనలు చేయడం మొదలు పెట్టారు యశోదా రెడ్డి. సుమారు 30 గ్రంథాలను ప్రచురించారు. ‘పారిజాతాపహరణ పర్యాలోచనము’, ‘ఆంధ్ర సాహిత్య వికాసము’,‘నేమాని భైరవకవి’, ‘ఉత్తర హరి వంశము’, ‘భారతంలో స్త్రీ’, ‘అమర జీవులు’, ‘నారదీయం’, ‘చిరుగజ్జెలు’, ‘ద్విపద’, ‘ప్రబంధ వాఙ్మయము’,‘రచ్చబండ’, ‘నాగి’, అచ్చ తెలంగాణ యాసలో రాసిన ‘మావూరి ముచ్చట్లు’, ‘ఎచ్చమ్మ కతలు’, ‘ధర్మశాల’ తదితర రచనలు ఆమె సాహిత్య పటిమకు నిదర్శనాలు.
నవల, కథ, కవిత, వ్యాసం తదితర ప్రక్రియల్లో సాగిన ఆమె రచనా వ్యాసంగం తెలుగు సాహిత్య లోకంలో ఆమెకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి. ‘మూసీ’, ‘పరిశోధన’, ‘ఆంధ్రప్రదేశ్’, ‘జాగృతి’, ‘ప్రజాతంత్ర’, ‘భారతి’, ‘నా తెలంగాణ’ పత్రికల్లో ఆమె రాసిన వందలాది పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. తెలంగాణ మాండలికంలో రాసిన కథలు, ‘హాస్యరచనలు’, ‘పండగలు-పబ్బాలు’, ‘ఎచ్చమ్మ ముచ్చట్లు’, ‘మహాలక్ష్మి ముచ్చట్లు’, ‘జెర ఇనుకోవే తల్లీ’ అనే శీర్షికలతో రెండు వందలకు పైగా ప్రసంగాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.
1949 -50 ప్రాంతంలో దక్కన్ రేడియోలో మాండలిక భాషలో మొట్టమొదటి కథలు, సంభాషణలు, పిల్లల నాటికలు ప్రారంభించిన ఘనత పాకాల యశోదా రెడ్డికే దక్కింది. తెలంగాణ నుడికారంతో కథలు, మాండలికంలో సాహిత్యాన్ని సృష్టించిన ఆద్యురాలిగా తెలంగాణ చరిత్రలో సుస్థిరంగా ఆమె పేరు నిలిచిపోయింది. యశోదారెడ్డి రచయితే కాకుండా గొప్ప వక్త కూడా. పండితులు మెచ్చే భాష లో ఉపన్యసిస్తూ, ముచ్చటగొలిపే మాండలిక యాసతో సభికులను ఆకట్టుకునేలా ప్రసంగించేవారు. ఆమె ఉపన్యాసం విన్న ప్రఖ్యాత చిత్రకారుడు పీటీ రెడ్డి ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆయనందించిన తోడ్పాటుతో ఆమె ఎన్నో రచనలు చేశారు. చిత్రకళా ప్రదర్శనల కోసం భర్తతో పాటు దేశ విదేశాల్లో పర్యటించి ‘భారతీయ చిత్రకళ’ గ్రంథాన్ని రచించారు.
మారుతున్న భాషా ప్రవాహంలో ప్రాచీన రూపాలు కొట్టుకుపోకుండా కాపాడటం భాషావేత్తల బాధ్యతగా భావించిన యశోదారెడ్డి మాండలిక పదాలను, జాతీయాలను, పదబంధాలను, పరిణామాక్రమంలో పలకడంలో వస్తున్న మార్పులను గ్రంథస్థం చేశారు. అనేక భాషా సాహిత్య సంఘాలకు విశిష్ట సభ్యురాలిగా ఉండి సేవలందించారు. ఆమె 1990-1993 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె అందుకున్న పురస్కారాలకు కొదవ లేదు. రాష్ట్ర సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని అందుకున్నారు. ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి ‘డి.లిట్’ గౌరవ పట్టాను పొందారు.
33 ఏండ్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో పనిచేసిన యశోదారెడ్డి ప్రొఫెసర్గా, సాహితీవేత్తగా, విమర్శకురాలిగా గుర్తింపు పొందారు. నిష్కర్షగా మాట్లాడే వ్యక్తిత్వం గల సమరశీల వనిత ఆమె. తెలుగు భాషను సజీవ భాషగా, తెలంగాణ మాండలికాన్ని నిలబెట్టడంలో కృషి చేసిన ఆమె అక్టోబర్ 7, 2007లో మరణించారు. వారి జీవితం స్ఫూర్తి దాయకం. యశోదా రెడ్డి అడుగుజాడల్లో పయనించడమే మనం ఆమెకు ఇచ్చే ఘన నివాళి.
(నేడు పాకాల యశోదా రెడ్డి వర్ధంతి)
కామిడి సతీష్రెడ్డి
98484 45134