‘బీజేపీ-హిందూ-మోదీ’ పట్ల వ్యతిరేకతతో కాదు, చుట్టుముడుతున్న పెను ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకోవాలన్న తపనతో చేస్తున్న సూచనగా దయచేసి దీన్ని చదవండి, చదివించండి, వినిపించండి!
వృక్ష రాజ్యంలో జరిగిన ఎన్నికల్లో.. దానికున్న కర్రను జూచి, అది తమ జాతిదే గదా అని మురిసిపోతూ, ‘గొడ్డలి’కి ఓట్లేసాయట చెట్లు! అంతే, ప్రపంచంలో నెంబర్ వన్గా ఎక్కదీసేందుకని నాలుగైదు మహావృక్షాలను ఎంపిక జేసుకొని, తక్కిన చిన్నా, చితకా చెట్లన్నింటినీ నరకటం ప్రారంభించిందట గొడ్డలి! ‘మనవాడు, మన హిందువులంటూ భోరుమంటున్నారు హిందువులు!
కార్పొరేట్ల కోసం పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నది మాత్రం కోట్లాది సామాన్యులే! అయితే చైతన్యం పెరిగి, వాళ్లంతా ఐక్యమైతే, కార్పొరేట్ల మోదీలను ఎన్నుకోరు గదా?, అందుకే కోట్లాది ప్రజలను విభజించి పాలించేందుకు అలవాటు పడ్డారు పాలకులు. ప్రజలు విడిపోవాలంటే వాళ్లలో పరస్పర ద్వేషాన్ని రగిలించాలి. అందుకు కులం-మతం-జాతి-ప్రాంతాలను ఆయుధాలుగా మలుచుకుంటారు.
ప్రపంచ కుబేరులలో పదో స్థానంలో ఉన్న అదానీ, అంబానీలు- మోదీ హయాంలో నాలుగో స్థానానికి ఎగబాకటమే అందుకు నిదర్శనం. కానీ, మన దేశం మాత్రం, పేదలెక్కువున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న నైజీరియాను కిందికి లాగి నెంబర్-1 స్థానానికి చేరిందన్నది, జగమెరిగిన సత్యం. మన రాజ్యాంగ 39వ అధికరణం ప్రకారం, సంపద పోగుబడకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత. కానీ తద్విరుద్ధంగా పీవీ, మన్మోహన్ ప్రభుత్వాలు వ్యవహరించిన మాట వాస్తవమే. అయితే దివాళా అంచున ఉన్న భారత్ను గట్టెక్కించి, తాకట్టులో ఉన్న మన బంగారాన్నంతా విడిపించారు. కనుక పీవీని తప్పుబట్టలేం, మన్మోహన్ మాత్రం కార్పొరేట్ల అందరి వద్ద పోగుబడేలా చేశారు. కానీ, మోదీ మాత్రం సంపదనంతా అదానీ, అంబానీల వద్దకే చేర్చి గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది దేశానికే ప్రమాదం.
ప్రపంచ మానవాళికి నేడు సంభవించిన దురదృష్టమేమంటే? 85-90 శాతం సంపద కేవలం పదులు, వందల సంఖ్యలో ఉన్న కార్పొరేట్ల వద్ద పోగుబడుతున్నది. మిగిలిన 15-10 శాతం సంపదనే కోట్లాది ప్రజలకు దక్కుతున్నది. ఇలాంటి దుస్థితిలో మన భారత్ అగ్రభాగాన నిలిచింది. ముఖ్యంగా ప్రధాని మోదీ హయాంలో!
ఈ గుత్తాధిపతుల వల్ల దేశాన్ని చుట్టుముట్టనున్న మరో పెను ప్రమాదమేమంటే? వాళ్లు ప్రభుత్వాలనే శాసించగలుగుతారు. ఉదా॥ అమెరికా అధ్యక్షుడు ‘బుష్-ఒబామా; ట్రంప్-బైడెన్’ ఎవరైనా ఆ దేశపు ఆయుధ, ఆయిల్ కార్పొరేట్ల చేతిలోనూ- పాక్ ప్రధాని ఎవరైనా సంపద పోగేసుకున్న ఆ దేశపు సైనికాధికారుల చేతిలోను రిమోట్లా వ్యవహరిస్తుంటారు. అలాగే రేపు భారత ప్రధాని అదానీ, అంబానీల రిమోట్గా వ్యవహరించాల్సొస్తుంది. అప్పుడు మోదీయే కాదు ఎవరు ప్రధాని అయినా పరిస్థితి ఇలాగే ఉండొచ్చు! తస్మాత్ జాగ్రత్త భారతీయులారా.
మోదీ వల్ల దేశానికి సంభవించిన మరో ప్రమాదమేమంటే అదానీ, అంబానీయేతర కార్పొరేట్లను శాంతింపజేసేందుకని, వాళ్ల టాక్సును 30-23 శాతానికి తగ్గించారు, వాళ్లు చేసిన రూ.లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మొండి పద్దులుగా మద్రవేసి, రద్దుచేశారు. ఆ లోటును పూడ్చుకునేందుకు భారీగా అప్పులు చేశారు. గత పాలకులు దశాబ్దాలుగా చేసిన (విదేశీ+స్వదేశీ) అప్పుల మొత్తం ‘రూ.58,59,33’ కోట్లు కాగా ఈ ఎనిమిదేండ్లలో మోదీ చేసిన అప్పు మొత్తం ‘94,58,579’ కోట్లు. ఇంకా చాలక గ్యాస్-డీజిల్-పెట్రోల్ ధరలను తద్వారా నిత్యావసరాల ధరలను చుక్కల్ని తాకించారు మోదీ! అంతటితో వదల్లేదు పిల్లలు, పెద్దలు తాగే పాలూ, పెరుగూ; విద్యార్థులు వాడే పెన్సిల్, రబ్బర్ల మీద గూడ జీఎస్టీని బాది సామాన్య జనాల్ని, మిషన్లో చెరుకును పిండినట్లు పిండేస్తున్నారు మోదీ.
గర్వంగా చెప్పుకోగలిగిన ఒక్క ఘనకార్యం కూడా చేయలేదు మోదీ ప్రభుత్వం. ఏ వర్గానికి మంచి, చేయకపోగా.. కోట్లాది కార్మికులను కార్పొరేట్లకు కట్టుబానిసలను చేసేలా కార్మిక చట్టాలను సవరించారు. మరి ఆ కార్మికుల్లో అత్యధికులు హిందువులే కదా? రైతులు తమ పొలాలను కార్పొరేట్లకమ్ముకొని, వాళ్ల కూలీలుగా మారేలా రైతు చట్టాలను తెచ్చారు. మరి మెజారిటీ రైతులు, హిందువులే గదా? ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి, రిజర్వేషన్లకు తావులేకుండాజేసి, దళితులు, బీసీలు, ఓబీసీల నోట్లో దుమ్ముగొట్టారు మోదీ! సదరు బాధితుల్లో అత్యధికులు హిందువులే గదా? దేశ రక్షణరంగాన్ని కూడా ప్రైవేటీకరించి, సైనికులను కూడా, సైనిక కూలీలను జేసే ‘అగ్నిపథ్’ను ప్రవేశపెట్టారు. అత్యధిక సైనికులూ హిందువులే గదా?
మోదీ హయాంలో ఇదీ మన దేశ పరిస్థితి. 1.కరోనాకు ముందే భారత్లో నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. 2.బీజేపీ నాలుగు దశాబ్దాల నాటి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 3.కొత్త పరిశ్రమలు రాకపోగా, ‘ఫోర్డు’ వంటి విదేశీ పరిశ్రమలు ఎల్లిపోయినయి. 4.విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటినయి. 5.రూపాయి మారకం విలువ డాలరుకు రూ.80కి దిగజారింది. 6.పేదలు ఎక్కువున్న దేశాల్లో ప్రపంచ అగ్రస్థానానికి చేరింది భారత్. 7.ప్రజాస్వామ్యం, పత్రికాస్వేచ్ఛలో 177వదిగా నిలిచింది. 8.మత విద్వేష దేశాల్లో ఒకటైనందుకు భారతీయులకు సిగ్గుతో తలదించుకునే దుస్థితికి వచ్చింది. ఈ పరిస్థితిలో ప్రజాభిమానంతో తిరిగి గద్దెనెక్కటం గగనమన్న వాస్తవాన్ని గ్రహించింది మోదీ బీజేపీ!
అందుకే… మెజారిటీ మీడియాను గ్రిప్లో పెట్టుకోవటం. వ్యవస్థలను ఉసిగొల్పి ప్రతిపక్షాల ఆర్థికవనరులను దెబ్బతీయటం. పార్టీలను చీల్చటం, ప్రభుత్వాలను కూలగొట్టడం!- కొన్నింటిని బినామీ పార్టీలుగా మలుచుకోవటం. లొంగివచ్చిన వారికి తమ కండువా కప్పటం, ఆయా పార్టీలలో ‘షిండే’లను సృష్టించటం. హిందువుల్లో హైందవేతరుల పట్ల విద్వేషాన్ని చల్లారకుండా నిరంతరం ఆజ్యం పోసే ప్రణాళికను బీజేపీ రూపొందించుకున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు!
మాటలతో గాదు- ‘వ్యవసాయాభివృద్ధి ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, పారిశ్రామిక, ఉద్యోగ, విద్యాభివృద్ధిని సాధిస్తూ అమెరికాను సవాలు చేసే స్థాయికెదిగిన చైనా మార్గాన తెలంగాణను తీర్చిదిద్దారు కేసీఆర్. ఆ ఆచరణాత్మక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపుతూ మోదీని ఢీకొడుతున్నారు కేసీఆర్! తథాస్తు! విజయీభవ!
పాతూరి ,వేంకటేశ్వరరావు
98490 81889