స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి, రాష్ట్ర, జాతీయ గౌరవ పురస్కారాలు పొందిన మహా నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. పోరాటం, సాహసం, ధైర్యం, పట్టుదల, త్యాగం, అంకితభావం, ఉద్యమ స్ఫూర్తి, పాలనా దక్షత, ప్రజాహిత సేవ, విలక్షణమైన నాయకత్వ లక్షణాల సమ్మేళనమే కొండా.
1915 సెప్టెంబర్ 27న ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రస్తుతం కుమ్రం భీం ఆసిఫాబాద్) జిల్లా వాంకిడి గ్రామంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మించారు. తన 25వ ఏట న్యాయవాద కోర్సు పాసయ్యారు. లక్ష్మణ్ బాపూజీ 1945లో న్యాయవాదవృత్తిని చేపట్టారు. స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీతో కలిసి, ఆయన అడుగుజాడల్లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా 1947-48 మధ్యకాలంలో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని 1947 డిసెంబర్ 4న నిజాం నవాబు మీద బాంబు విసిరిన నారాయణరావు పవార్ బృందంలో లక్ష్మణ్ బాపూజీ కూడా ఉన్నారు. 1952-69 మధ్యకాలంలో జరిగిన ‘నాన్ ముల్కీ’ ఆందోళనలో పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ 1945లో కాంగ్రెస్లో చేరారు. స్వాతంత్య్రానంతరం 1952 లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1957లో నల్గొండ జిల్లా చిన్నకొండూరు (ప్రస్తుతం భువనగిరి) నియోజకవర్గం నుంచి గెలిచి 1957-60 మధ్యకాలంలో నీలం సంజీవరెడ్డి హయాంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా, ఆ తర్వాత 1960- 62 మధ్యకాలంలో దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో ఎక్సైజ్, లఘు పరిశ్రమలు, చేనేత, టెక్స్టైల్స్ శాఖ మంత్రిగా పదవులు నిర్వహించి ఆ శాఖలకు వన్నె తెచ్చారు. 1967-69 కాలంలో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచారశాఖ మంత్రిగా రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు.
హైదరాబాద్ రాష్ట్రంలో వెనుకబడిన, బలహీనవర్గాల ఉద్యమానికి నాయకుడిగా గణనీయమైన కృషిచేశారు. బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హక్కుల పరిరక్షణకు, సామాజిక వివక్షకు అవిశ్రాంత పోరాటం చేశారు. అనంతరాం కమిషన్, మురళీధర్ కమిషన్లు బీసీల కోసం 1986లో తిరుపతిలో చేసిన సిఫార్సుల అమలుకు, సర్దార్ గౌతు లచ్చన్నతో కలిసి బీసీల సభ విజయవంతం కావడానికి కృషిచేశారు. ఆ సభా వేదిక కొండా లక్ష్మణ్ బాపూజీకి ‘ఆచార్య’ అనే బిరుదును ప్రకటించింది
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ మండల్ కమిషన్ సిఫారసులను వ్యతిరేకించిన సందర్భంలో 1987లో కాం గ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బాపూజీ రాజీనామా చేశారు. తన 97 ఏండ్ల వయస్సులో తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసిన నిఖార్సయిన గొప్ప తెలంగాణవాది మన లక్ష్మణ్ బాపూజీ.
బాపూజీ జ్ఙాపకాలకు గుర్తుగా 2014లో రాష్ట్ర ప్రభుత్వం ‘హైదరాబాద్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చరల్, విశ్వవిద్యాలయంగా పేరు పెట్టింది. అంతేకాకుండా సెప్టెంబర్ 27న తన పుట్టినరోజును ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుండటం ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి.
(నేడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి)
కామిడి సతీష్రెడ్డి
98484 45134