బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చుతారా? లేదా? అన్న సస్పెన్స్ తెలుగు టీవీ సీరియల్ మాదిరిగా రెండేండ్లుగా సాగుతూనే ఉన్నది. బండి స్థానంలో ఈటల రాజేందర్ను నియమిస్తారన్న ప్రచారానికి చివరికి ఈటల రాజేందరే తెరదించుతూ, ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షుడిని మార్చడం కుదరదని కరాఖండిగా తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ పెద్దలే ఈటలను ఢిల్లీ పిలిపించుకొని చెప్పినట్టు వినికిడి. అయినా మార్చుతారని ఎవరైనా చెప్తారా? మార్చరనే అంటారు కదా? అని కొందరు నేతలు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈటల చెప్పింది నిజమే అయి ఉంటుందని, ఇది తెలిసే ఈ మధ్య బండి సంజయ్ స్వరం పెంచినట్టు కనిపిస్తుందని కూడా అంటున్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి గీత దాటితే… ఎంతటివారైనా వేటు తప్పదని బండి సంజయ్ ఇటీవల పార్టీ వేదికపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంటే అధిష్ఠానం నుంచి ఎన్నికల దాకా క్లియరెన్స్ లభించడమేనని విశ్లేషిస్తున్నారు.