గవర్నర్ల వ్యవస్థపై సర్కారియా, పూంచ్ కమిషన్లతోపాటు పలువురు లక్ష్మణ రేఖలు గీసినా ఆ వ్యవస్థ ఏమీ మారలేదన్నది వాస్తవం. గవర్నర్లు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారారన్నదీ యధార్థం. అందుకే గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలని, వారిని రీకాల్ చేయాలన్న డిమాండ్ ప్రబలంగా వినిపిస్తున్నది.
ఆత్మగౌరవ నినాదం పునాదులపై పుట్టిన తెలంగాణ పట్ల బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతుండటాన్ని గమనిస్తున్నాం. కష్టనష్టాలకోర్చి తెచ్చుకున్న తెలంగాణను తేటగా చేస్తుంటే బీజేపీకి కంటగింపుగా ఉన్నది. ముఖ్యంగా, దక్షిణాది రాష్ర్టాలు అభివృద్ధి వెలుగులతో అంతర్జాతీయ కీర్తిని గడిస్తుంటే ఉత్తరాది నాయకత్వం భరించలేకపోతున్నది. తమ సంకుచిత మతోన్మాద భావజాలాన్ని తెలంగాణపై రుద్దాలని, ప్రజల్లో చీలికలు తేవాలని కుట్రలు పన్నుతున్నది. గవర్నర్ను పావుగా వాడుకుంటూ బీజేపీయేతర ప్రభుత్వాలపై ప్రత్యక్ష యుద్ధానికి తెరలేపుతున్నది. తెలంగాణలో రాష్ట్ర గవర్నర్ చేస్తున్న వ్యాఖ్యలను ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలి. గణతంత్ర దినోత్సవం సాక్షిగా ప్రభుత్వంపై గవర్నర్ చేసిన ఆరోపణల మీద పార్టీలకతీతంగా అన్నివర్గాలూ స్పందించే సమయం ఆసన్నమైంది.
తెలంగాణకు తొలి మహిళా గవర్నర్గా తమిళిసై నియామకమైనప్పుడు ఆమెకు ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రజానీకం ఘన స్వాగతం పలికింది. అప్పుడప్పుడు ఆమె కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. బీజేపీ కనుసన్నల్లో రాష్ట్ర రాజకీయాల్లో తలదూర్చినా భరించారు. కానీ, ‘మై గవర్నమెంట్’ (నా ప్రభుత్వం) అని పేర్కొంటూ ప్రభుత్వాధిపతిగా ఉండే గవర్నర్ తన ప్రభుత్వంపైనే రాజకీయ నేతల్లా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రమూ శోభనివ్వదు.
33 జిల్లాలు, 47 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు, 10,909 గ్రామాలతో కూడిన తెలంగాణ ఇవాళ ప్రగతి శీల రాష్ట్రంగా పరిఢవిల్లుతున్నది. 17,667 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక తెలంగాణలోనే 26 లక్షల 54 వేల వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా అందుతున్నది. రాష్ట్రం మొత్తం మీద ఒక కోటి 22 లక్షల డొమెస్టిక్, 16 లక్షల 75 వేల వాణిజ్య, లక్షా రెండు వేల పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లున్నాయి. దేశంలో కరెంట్ కోతలున్నా తెలంగాణలో మాత్రం కోతల్లేవు. మరి గవర్నర్కు తెలంగాణ విద్యుత్ వృద్ధి కనిపించలేదా? ఆర్థిక రంగంలో రాష్ట్రం శరవేగంగా వృద్ధి సాధిస్తూ, పెద్ద రాష్ర్టాలను దాటి రికార్డులు సృష్టిస్తున్నది. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.9 శాతం, జాతీయ సగటు కంటే జీఎస్డీపీ 2 శాతం అదనంగా ఉన్నది.
ఈ వాస్తవాలను గవర్నర్ తమిళిసై ఎందుకు తన ప్రసంగంలో ప్రజలకు వివరించలేకపోయారు? ఆమె పలుకుల్లో సంక్షేమాభివృద్ధి పథకాల ప్రస్తావన ఎందుకు లేదని ఇవాళ తెలంగాణ సమాజం నిగ్గదీసి అడుగుతున్నది. దేశ జీడీపీ పడిపోయినా, తెలంగాణ మాత్రం వృద్ధి రేటును నమోదు చేసుకొని యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్నది. రాష్ట్రంలోని 41,369 పాఠశాలల్లో సగటు ఎన్రోల్మెంట్ 113 శాతానికి తగ్గకుండా ఉన్నది. డ్రాపౌట్స్ శాతం 0.54గా ఉన్నది. తెలంగాణకు వ్యవసాయమే వెన్నెముక. 2015-16లో రాష్ట్రంలో 59.47 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే ప్రస్తుతం అది 147.57 లక్షల ఎకరాలకు పెరిగింది. కాళేశ్వరంతోపాటు పలు ప్రాజెక్టులు రికార్డు సమయంలో పూర్తయ్యాయి. అన్నిరంగాల్లో దేశంలోని పలు రాష్ర్టాలకు ఆద ర్శంగా నిలుస్తూ, ఇప్పటికే రెండు వందలకు పైగా అవార్డులు అందుకున్నది. ఇందుకు కేంద్రప్రభుత్వమే ప్రత్యక్ష సాక్షి.
పై గణాంకాలేవీ గవర్నర్కు కనిపించలేదేమో.. అందుకే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రగతిని, వృద్ధిని, లక్ష్యాలను రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పాల్సిన గవర్నర్ ఆ పని చేయలేదు. రిపబ్లికే డే ఉత్సవాల నిర్వహణ తీరుపై ఆమెకు ఆక్షేపణ ఉండవచ్చుగాక.. అయినా సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులు, యంత్రాంగం సమక్షంలో, మీడియా ప్రత్యక్ష ప్రసారాల్లో హుందాగా ఉండాల్సిన గవర్నర్ పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. ఆమె తీరు చూసి రాష్ట్ర ప్రజానీకం విస్తుపోతున్నది.
మొన్న ఖమ్మం సభలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తోపాటు పలువురు ముఖ్యమంత్రులు, వక్తలు గవర్నర్లను ఆడిస్తున్నది కేంద్రంలోని బీజేపీయేనని స్పష్టం చేశారు. కేంద్రం వైఖరిపై విరుచుకుపడ్డారు. అయినా తెలంగాణ గవర్నర్ తీరులో మార్పు రాకపోవడం శోచనీయం. ఢిల్లీ బీజేపీ కనుసన్నలలో గవర్నర్ పరివార్ చేస్తున్న దాడిని యావత్తు తెలంగాణపై జరుపుతున్న దాడిగా చూడాలి. రాష్ట్ర నాయకులు, ప్రజలు మరో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలి.
-వెంకట్ గుంటిపల్లి
94949 41001