‘సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్లను, ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించవద్దని కేంద్ర
న్యాయశాఖ మంత్రి ఎలా చెబుతారు? అసలు ఆయన ఉద్దేశం ఏమిటి?’ అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీంరావ్ లోకూర్ ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు నుంచి ఏ విధమైన రెచ్చగొట్టే చర్యలు లేనప్పటికీ.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో ఉన్న మతలబు ఏమిటని అడుగుతున్నారు. న్యాయవ్యవస్థపై కేంద్రం చేస్తున్న దాడి దిగ్భ్రాంతికరంగా ఉన్నదని..ఇది దేశానికి ఏ విధంగానూ మంచిది కాదని హితవు పలికారు. సుప్రీంకోర్టుతో కేంద్రం ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో జస్టిస్
లోకూర్తో ఎన్డీటీవీ జరిపిన ఇంటర్వ్యూ..
న్యాయవ్యవస్థపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు రెచ్చగొట్టే విధమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది? ఈ ఘర్షణలోకి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఎందుకు చేరారు?
ఇది ఎందుకు జరుగుతోందో నిజంగా నాకు కూడా తెలియదు. న్యాయవ్యవస్థ కానీ, సుప్రీంకోర్టు కానీ ఎటువంటి రెచ్చగొట్టే పనులకు పాల్పడలేదు. అయినప్పటికీ మంత్రి ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారో మరి. న్యాయవ్యవస్థ స్వతంత్రత పైన, కొలీజియం పైన ఆయన మొదలుపెట్టిన దాడి దిగ్భ్రాంతికరంగా ఉంది.
న్యాయమూర్తుల నియామకాల అంశాన్ని ‘జాతీయ న్యాయ నియమకాల కమిషన్’ పరిధిలోకి తెచ్చే విషయంలోనే ఈ ఘర్షణ జరుగుతున్నదా?
అది నిజమే కావచ్చు. ఈ మేరకు కేంద్రమంత్రి తన ప్రయత్నాలేవో తను చేస్తుండవచ్చు. అయితే ఒక్క మాట మాత్రం స్పష్టం. న్యాయవ్యవస్థకు ఉన్న స్వతంత్రతను కార్య నిర్వాహక వ్యవస్థ (ప్రభుత్వం) తొలగించలేదు. రాజ్యాంగ సవరణ ద్వారా కూడా అది సాధ్యం కాదు. న్యాయవ్యవస్థ స్వతంత్రత అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణాల్లో ఒకటి. ప్రజాస్వామ్యం మనుగడకు అది అత్యంత కీలకమైనది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను తొలగించడానికి ఏ రూపంలో ప్రయత్నించినా అది ప్రజాస్వామ్యంపై దాడి వంటిదే.
కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లోపించిందని మీరు గతంలో విమర్శించారు. దాన్ని సర్వామోదంగా తీర్చిదిద్దటానికి, మరింత పారదర్శకత తీసుకు రావటానికి ఏం చేయాల్సి ఉంటుంది?
కొలీజియం వ్యవస్థ మొత్తానికే మొత్తంగా లోపభూయిష్ఠమైనది కాదు. దానిలోని కొన్ని అంశాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. ఉదాహరణకు, ఏ అర్హతల ప్రాతిపదికన సుప్రీంకోర్టుకు హైకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేస్తున్నారన్నది ఎవరికీ తెలియదు. ఇది ఇలా ఉండగా.. కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలేమిటో కూడా తెలియదు. బాంబే హైకోర్ట్ చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 24 లేదా 25 సెప్టెంబర్ నాడు కొలీజియం సిఫారసు చేసింది. ఆ నియామకానికి ఆమోదం తెలుపడానికి కేంద్రం రెండున్నర నెలల సమయం తీసుకుంది. ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం ఇంతకాలం ఆ నియామకాన్ని ఎందుకు పెండింగ్లో పెట్టిందో ఎవరికీ తెలియదు. ఈ మధ్య అయిదుగురు న్యాయమూర్తుల నియామకం విషయంలో కూడా ఇలాగే జరిగింది. న్యాయమూర్తుల నియామకాలకు గతంలో రెండు నుంచి మూడు రోజుల కంటే ఎక్కువ సమయం పట్టేది కాదు.
దీనికి కారణమేమిటి? కేంద్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తున్నదా?
అవును. కేంద్రం కావాలనే జాప్యం చేస్తున్నట్టు ఉంది. మరో కారణం కనిపించడం లేదు.
న్యాయవ్యవస్థ నిర్వహించే పాత్రపైన కూడా ప్రస్తుతం దాడి జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. బెయిల్ పిటిషన్లను స్వీకరించొద్దని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (పిల్లను) విచారణకు తీసుకోవద్దని కేంద్ర న్యాయశాఖ మంత్రి (సుప్రీంకోర్టుకు) చెప్పడం గతంలో కనీవినీ ఎరుగనిది.
సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్లు ఎందుకు విచారించకూడదు? కారణం ఏమిటి? అందరూ జైళ్లలో ఉండాలని న్యాయశాఖ మంత్రి కోరుకుంటున్నారా? ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కూడా సుప్రీంకోర్టు ఎందుకు విచారణకు తీసుకోకూడదు? పిల్ అంటేనే ప్రజల ప్రయోజనానికి సంబంధించినది. సుప్రీంకోర్టు ప్రజల ప్రయోజనం కోసం పని చేయొద్దా? ఆయన ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కావడం లేదు.
కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్తో ఇటీవల మేము మాట్లాడినప్పుడు న్యాయవ్యవస్థను వెనక్కి నెట్టడం ప్రభుత్వంతో సాధ్యం కాదని, న్యాయవ్యవస్థ తన స్వతంత్రతను నిలబెట్టుకుంటుందని చెప్పారు. న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ఈ ఘర్షణ ఫలితంగా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవించనున్నాయి?
పరిస్థితులు ఇలాగే తీవ్రమవుతూ వెళ్తే సుప్రీంకోర్టు సిఫారసుల మీద ప్రభుత్వం ఇప్పట్లాగే జాప్యాన్ని కొనసాగిస్తూ ఉండవచ్చు. న్యాయమూర్తుల నియామకాలను ఈ విధంగానే రెండు నెలలు, మూడు నెలలు, నాలుగు నెలలు పెండింగ్లో పెట్టే అవకాశాలున్నాయి. తద్వారా ఒక రకమైన అనిశ్చితి నెలకొంటుంది. ఇది సుప్రీంకోర్టుకు కానీ, ప్రభుత్వానికి కానీ, అంతిమంగా దేశ ప్రజలకు కానీ మంచిది కాదు. కాబట్టి, పరిస్థితులను మరింత రెచ్చగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించకుండా ఉంటే మంచిది.
(ఎన్డీటీవీ సౌజన్యంతో..)