మితవాద రాజకీయ పక్షమైన బీజేపీ పేదల సంక్షేమానికి సమాధి కడుతున్నది! ఘనంగా ప్రారంభించిన పథకాలకు తక్కువ నిధులు కేటాయిస్తూ వాటిని నీరుగారుస్తున్నది. ‘ఉచితాల’ చర్చ పేరిట మిగతా రాజకీయ పక్షాలు ప్రజలకు సంక్షేమాన్ని అందించకుండా అడ్డుకోవాలని చూస్తున్నది. ఆర్థిక, సాంస్కృతిక అభద్రతలను ఆసరాగా చేసుకొని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నది. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ పేదల జీవితాలను దుర్భరం చేస్తున్నది.
‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్టుగా ఉంది ప్రధాని తీరు. తమతో పాటుగా ఇతర ప్రభుత్వాలనూ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కట్టడి చేయగలిగితే ప్రజలకు సంక్షేమాన్ని అందించే ప్రత్యామ్నాయమే ఉండదు. తద్వారా ఎన్నికల సమయంలో తమకు పోటీ ఉండదు. తమ పాలనకు ఢోకా ఉండదు. తమ కార్పొరేట్ అనుకూల విధానాలకు అడ్డూ అదుపూ ఉండదు. ఇదీ అసలు విషయం!
కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ ప్రణబ్ బర్ధన్ రాసిన ‘ఎ వరల్డ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ: డెమోక్రటిక్ డిసెన్ఛాన్మెంట్ ఇన్ రిచ్ అండ్ పూర్ కంట్రీస్’ పుస్తకంలో వివిధ దేశాల్లో మితవాద రాజకీయ పక్షాలు అధికారంలోకి రావడానికి అక్కడి ఆర్థిక, సాంస్కృతిక అభద్రతలు అనుకూలిస్తాయని విశ్లేషించారు. ఈ రెండు అంశాలు కలగలిసి ఉంటాయి. అనేక సందర్భాల్లో సాంస్కృతిక అభద్రత ఆర్థిక అభద్రతను దాటి ఉండే పరిస్థితి ఉంటున్నది. ముఖ్యంగా మితవాద రాజకీయ పక్షాల విషయంలో వాటి ప్రధాన బలమైన సాంస్కృతిక అజెండా ప్రజలను పెద్ద స్థాయిలో ప్రభావితం చేయగలదు. ఈ కారణం వల్లే అనేక దేశాల్లో మితవాద ప్రభుత్వాలకు నాయకత్వం వహించినవారు, వహిస్తున్నవారు ఆయా దేశాల్లోని అత్యంత ధనవంతుల తాలూకు ప్రతినిధులు కావడం గమనార్హం. రెసెప్ ఎర్డోగాన్, విక్టర్ ఆర్బన్, డోనాల్డ్ ట్రంప్ వంటి వారందరూ ధనిక వర్గ ప్రతినిధులే. భారత్ను పాలిస్తున్న మితవాద పక్షం బీజేపీ నేతగా ఉన్న నరేంద్ర మోదీ మహా ధనవంతుడు కాకున్నా… ఆయన దేశంలోని అత్యంత ధనవంతులైన బిలియనీర్లతో చెట్టా పట్టాలు వేసుకొని ఉన్నారనేది పదే పదే వినపడే మాట!
ఈ నేపథ్యంలో మితవాద పక్షాలేవీ తమ ఆర్థిక విధానాల్లో సాధారణంగా పేద ప్రజల అనుకూలతనూ, సంక్షేమ నిబద్ధతనూ చూపవు! అయితే, సంక్షేమ విధానాలకు పెద్ద పీట వేసే అతివాద లేదా వామపక్ష రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొని అధికారంలో కొనసాగడానికి అనివార్యంగా ఎంతో కొంత మేరకు మితవాద రాజకీయ పక్షాలు కూడా సంక్షేమ జపం చేయాల్సి వస్తుంది. జనాల తాలూకు ఆర్థిక అభద్రతకు ఎంతో కొంత పరిష్కారంగా ఈ సంక్షేమ కోణం కావాల్సి వస్తుంది. అందుకే ఒక పక్క సంక్షేమ జపం చేస్తూనే, మరో పక్క ఆ సంక్షేమానికి మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. దీనికి అనేక తార్కాణాలున్నాయి.
కేంద్రం ‘పీఎం కిసాన్’ పథకంలో భాగంగా రైతులకు సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న ‘రైతు బంధు’ పథకం నమూనాలో 2018 డిసెంబర్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం ప్రారంభించినప్పుడు లబ్ధిదారుల సంఖ్య 11.84 కోట్లు కాగా మూడేండ్ల తర్వాత (మే-జూన్ 2022 నాటికి) ఆ సంఖ్య 3.87 కోట్లకు పరిమితమైంది. కానీ ఈ పథకానికి మూలమైన ‘రైతు బంధు’ కింద 2018 వానాకాలంలో 50.25 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, 2022 యాసంగికి ఈ సంఖ్య 66.61 లక్షలకు పెరిగింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.57,956 కోట్లు రైతులకు అందాయి. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఇప్పటి వరకు అందిన మొత్తం రూ.2 లక్షల కోట్లని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ గమనించాల్సింది 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రైతుల ఖాతాల్లో జమ అయ్యింది రూ.2 లక్షల కోట్లు కాగా, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో దాదాపు రూ.58 వేల కోట్లు జమయ్యాయి.
ఇక ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ను పరిశీలిద్దాం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 5 కోట్ల కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ఈ పథకాన్ని 2016 మే 1న ప్రారంభించారు. కట్టెల పొయ్యి పొగతో అనారోగ్యం పాలయ్యే పేద మహిళలకు ఈ పథకం ఉపశమనం కలిగిస్తుందని కేంద్రం గొప్పగా ప్రకటించింది. ఈ పథకంలో లబ్ధిదారుకు మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా లభిస్తుందని, తరువాత తీసుకునే సిలిండర్లపై రాయితీ ఇస్తామని చెప్పారు. కానీ కాలక్రమేణా ఈ పరిస్థితిని మార్చేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.400గా ఉన్న సిలిండర్ ధర మూడింతలు పెరిగి ప్రస్తుతం రూ.1100 దాటింది. మరోపక్క మెల్లమెల్లగా గ్యాస్ సిలిండర్పై ఇచ్చే సబ్సిడీని తగ్గిస్తూ వచ్చారు. దీంతో, పెరిగిన భారం మోయలేక 2022 మే నెల నాటికి ఉజ్వల యోజన లబ్ధిదారుల్లో 90 లక్షల మంది ఒక్క సిలిండర్ కూడా బుక్ చేయలేదు. మరో కోటి మంది లబ్ధిదారులు కేవలం ఒకే ఒక్క సిలిండర్ కొనుగోలు చేశారు. కేంద్రం నిర్వాకం వల్ల పేద జనానికి మళ్ళీ పిడకలు, కట్టెల పొయ్యే దిక్కయ్యాయి.
ఇక మూడవది.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. పంట నష్టపోయిన రైతులకు పరిహారం దక్కేలా చేసి.. తద్వారా వ్యవసాయానికి, రైతుకు భరోసా కల్పించడం ఈ పథకం లక్ష్యం. కానీ వాస్తవంలో ఈ పథకం ప్రైవేట్ బీమా కంపెనీలకు మాత్రమే కాసుల వర్షం కురిపిస్తున్నది. 2016-17 నుంచి 2020-21 మధ్య కాలంలో ఈ పథకం ద్వారా 10 ప్రైవేట్ బీమా కంపెనీలు రూ.24,350 కోట్ల లాభాన్ని గడించాయి. ఇందులో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అత్యధికంగా రూ.4,731 కోట్ల లాభాన్ని గడిచింది. 10 ప్రైవేటు బీమా కంపెనీలు గడించిన లాభాలు ఇదే పథకంలో భాగస్వామిగా ఉన్న ప్రభుత్వ రంగ బీమా సంస్థలు గడించిన లాభం కంటే రెట్టింపు. అంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోదీ వాగ్దానం ఆయన పాలనాకాలం ఎనిమిదేండ్లు గడిచినా నెరవేరలేదు.
కానీ, ఐదేండ్లలోనే ఫసల్ బీమా యోజన కింద ప్రైవేటు బీమా కంపెనీల లాభాలు మాత్రం వాటి సరసన ఉన్న ప్రభుత్వరంగ కంపెనీల కంటే రెట్టింపు అయ్యాయి. ఫసల్ బీమా నిబంధనల ప్రకారం పంట నష్టపోయిన రైతుకు 6 నెలల్లోగా పరిహారం అందించాలి. కానీ ఆచరణలో 12-18 నెలల సమయం పడుతున్నది. ఈ జాప్యం వల్ల బీమా సంస్థలకు వడ్డీ రూపంలో భారీగా ఆదాయం లభిస్తున్నది. రైతులకు మాత్రం ఒరుగుతున్నదేమీ లేదు. దీనివల్లే గుజరాత్ సహా పలు రాష్ర్టాలు ఈ పథకం నుంచి తప్పుకున్నాయి. 2018 యాసంగిలో ఈ పథకంలో 22 రాష్ర్టాలు చేరగా, ప్రస్తుత యాసంగికి ఈ సంఖ్య 19కి పడిపోయింది. రబీ వరకు లభించిన గణాంకాల మేరకు కేవలం 14 రాష్ర్టాలే ఆసక్తి చూపాయి. మరోవైపు, ఈ పథకం ద్వారా 2018లో 2.16 కోట్ల మంది లబ్ధి పొందగా ఈ ఏడాది యాసంగికి ఆ సంఖ్య 1.53 కోట్లకు పడిపోయింది.
మరో కీలక పథకం.. జాతీయ ఉపాధి హామీ పథకం. యూపీఏ-1 హయాంలో వామపక్షాల భాగస్వామ్యంతో తీసుకొచ్చిన ఈ పథకం 2009 అనంతరం యూపీఏ-2 హయాంలోనే కొంత నిర్వీర్యమైంది. మోదీ హయాం మొదలైన తర్వాత దీనికి తూట్లు పొడిచి, అటకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. యూపీఏ హయాంలో ప్రజలకు ఉపాధి కల్పించలేక ఈ పథకాన్ని తీసుకువచ్చారని, తమ ప్రభుత్వంలో ఈ పథకం అవసరం లేకుండా ప్రజలకు మంచి ఉపాధిని కల్పిస్తామని మోదీ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. కానీ ఆయన హయాంలో కొత్త ఉద్యోగాలు లేక ఉన్న ఉద్యోగాలే పోతున్న పరిస్థితి దాపురించింది. ఉపాధి హామీ పథకం బాగా అమలైతే గ్రామీణ ప్రాంతాల నుంచి తమకు కూలీల సరఫరా తగ్గిపోతుందని.. ఫలితంగా కార్మికుల వేతనాలు పెంచాల్సి వస్తుందని కార్పొరేట్ కంపెనీలు భయపడుతున్నాయి.
కార్పొరేట్లకు పూర్తి అనుకూల విధానాలను అనుసరిస్తున్న మితవాద పక్షమైన బీజేపీ నేతగా ఉన్న మోదీకి ఉపాధి హామీ పథకం పట్ల సానుకూలత లేకపోవడం ఆశ్చర్యమేమీ కలిగించదు. ఈ క్రమంలోనే ఈ పథకానికి కేంద్ర బడ్జెట్లో కనీసం 4 శాతం నిధులు కేటాయించాలనే నిబంధనను పక్కనపెట్టింది. 2022-23 బడ్జెట్లో ఈ పథకానికి రూ.73 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. ఇది 2021-22 బడ్జెట్ కేటాయింపుల కంటే 25.51 శాతం తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకానికి నేటికీ.. కొవిడ్ ముందటి (2019 నాటి) కంటే ఎక్కువగానే డిమాండ్ ఉంది. కానీ కేంద్రం మాత్రం గ్రామీణులను ఆదుకోవడం లేదు. కూలీ చెల్లింపుల్లో జాప్యం, వేతనాల్లో బకాయిలు, చేపట్టే పనులపై రాష్ర్టాలకో రీతిగా రకరకాల నియంత్రణలు పెట్టి ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నది. ఇలా సంక్షేమ పథకాలన్నింటినీ కాలరాస్తున్నది. ఇదంతా చాలదన్నట్టు, తాను చేయని సంక్షేమాన్ని వేరెవ్వరూ చేయకూడదని, అలా ఇతరులెవరైనా సంక్షేమ పాలన అందిస్తే… అది తన విధానాలకు విఘాతం అని మోదీ భావిస్తున్నారు. అందుచేతనే ఆయన పదే పదే ‘ఉచితాల’ పేరిట చర్చను లేవనెత్తుతూ ఇతర రాజకీయ పక్షాల సంక్షేమ విధానాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
-డి.పాపారావు
98661 79615