మండల్ కమిషన్ కేసు తీర్పులో సుప్రీంకోర్టు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన రిజర్వేషన్లు కులాలపరంగా అమలుజరపవలసిన రిజర్వేషన్లు కావని చెప్పింది. అయినప్పటికీ సామాజికంగా వెనుకబాటుకు అవే ప్రామాణికం.
2017కి సంబంధించిన సివిల్ సర్వీసెస్ ఓబీసీ అభ్యర్థుల సమస్య పరిష్కారం, ఓబీసీలకు సంబంధించిన క్రీమిలేయర్ విధానాన్ని సరళీకృతం చేసి ఆదాయ పరిమితిని పెంచాలనే ఉద్దేశంతోనే 2019లో బీపీ శర్మ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీలో ఓబీసీ కులానికి చెందినవారు ఒక్క రూ లేరు. బీజేపీ వెనుక రిజర్వేషన్ల వ్యతిరేక హిందూత్వ శక్తులు ఎంత బలంగా పనిచేస్తున్నాయో దీన్నిబట్టే అర్థమవుతున్నది.
మన దేశంలో కులం ప్రాధాన్యత విస్మ రించలేనిది. కాబట్టే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాలకు రిజర్వేషన్లు అమ లుచేస్తున్నాయి. ఆయా కులాల్లో సామాజికం గా, ఆర్థికంగా వృద్ధి చెందినవారిని (Socially Advance Persons/ Creamy Layers) ఓబీసీ రిజర్వేషన్ల నుంచి తొలగించి మిగతా వారికి 27 శాతం కోటా కేంద్రంలో అమలుచేసుకోవడానికి అనుమతిని ఇచ్చింది. అందుకు కేంద్రం 1993లో జాతీయస్థాయిలో నిపుణుల కమిటీని వేసి ఓబీసీల్లో సంపన్న శ్రేణిని గుర్తించడానికి జస్టిస్ రామ్నందన్ ప్రసాద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేసి సంపన్నశ్రేణి/ క్రీమిలేయర్ వారిని శాస్త్రీయంగా ఆరు తరగతులుగా గుర్తించింది. అందులో 1.రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు. 2.తల్లి లేదా తండ్రి గ్రూపు-1, గ్రూపు-2లో నియమితులైనవారు. 3. ఆర్మీ, పారామిలటరీలలో కర్నల్ లేదా ఆపై స్థాయి అధికారులు. 4.వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు. 5.స్థిర, చరాస్తులు కలిగినవారు. 6.ఆదాయ పరిమితి. చివరిదైన ఆదాయ పరిమితిలో ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయాదాయాన్ని మినహాయించారు. మొదట 1993లో వార్షిక ఆదాయం రూ.లక్షగా నిర్ధారించారు, ప్రతి మూడేండ్లకు సమీక్షించి ఆదాయ పరిమితిని పెంచాలని స్పష్టంగా ఉత్తర్వుల్లో తెలిపారు. కేంద్ర ఉద్యోగాల్లో 29 ఏండ్ల నుంచి ఓబీసీ రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. అంటే నేటికీ ఆదా య పరిమితిని తొమ్మిది సార్లు సమీక్షించి పెంచితే వార్షిక ఆదాయ పరిమితి ముప్ఫై లక్షల్లో ఉండేది. కానీ, చివరగా 2017లో 4వసారి సమీక్షించి రూ.8 లక్షలుగా ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయాన్ని మినహాయిం చి నిర్ధారించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. అనేక సందర్భాల్లో ఈ విధానాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది.
దేశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలామేరకు కులం, మతం ఆధారంగా ఏర్పాటయ్యా యి. బీజేపీ హిందూ మతం ఆధారంగా ఏర్పడింది. కాబట్టి, పవిత్ర గ్రంథాలుగా చెప్పబడుతున్న హిందూ మత గ్రంథాల ప్రకారం శూద్రులు చదువు నేర్చుకోవడం మహా నేరం. సహజంగానే ఉన్నతస్థాయి ఉద్యోగం చేయడం కూడా నిషేధమే. బీజేపీ శూద్ర, అతిశూద్రులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పక తప్పదు. కేంద్రంలో 1989లో జనతాదళ్ ప్రభుత్వం వీపీ సింగ్ ప్రధానిగా బీజేపీ మద్దతుతో ఏర్పడింది. 1990లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కేంద్ర ఉద్యోగాల్లో ప్రకటించగానే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నది. వెంటనే ప్రభుత్వం 12 నెలలకే పడిపోయిందంటే మొదటినుంచి ఓబీసీ రిజర్వేషన్ల పట్ల బీజేపీ ఎంత వ్యతిరేకమో అర్థమవుతుంది.
2014లో బీజేపీ సొంత మెజారిటీతో ఓబీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చింది. కొంత బీసీల పక్షాన ఉన్నట్లుగా నటిస్తూ ఓబీసీ వర్గానికి చెందిన మోదీని ప్రధానిగా చేసింది. ‘ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినంక బోడ మల్లన్న’ అన్నట్లు బీజేపీ నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది.
ఒకవైపు రాజ్యాంగబద్ధమైన ఓబీసీ పార్లమెంటరీ కమిటీ 2020లో గణేష్సింగ్ అధ్యక్షతన సమర్పించిన నివేదికలో క్రీమిలేయర్ వార్షిక ఆదాయాన్ని ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయం మినహాయింపుతో 8 నుంచి 15 లక్షలకు పెంచాలని ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు జాతీయ బీసీ కమిషన్ బీపీ శర్మ కమిటీ నివేదికను వ్యతిరేకిస్తుంది. ఒకవేళ కేంద్రం బీపీ శర్మ కమిటీ నివేదికను ఆమోదించి ఉద్యోగుల జీతాలను సంపన్నశ్రేణి నిర్ధారణలో కలిపినట్లయితే దేశంలో కోట్ల మంది ఓబీసీ విద్యార్థులు, నిరుద్యోగ యువత రిజర్వేషన్లను కోల్పోతారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న బీసీ రిజర్వేషన్లు కూడా కోల్పోవలసి వస్తుంది. దేశంలో 70 కోట్ల మందికి సంబంధించిన రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్నప్పుడు జాతీయ, ప్రాంతీయ, రాజకీయ పార్టీలు స్పందించకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పటివరకు తమిళనాడు నుంచి డీఎంకే పార్టీ బీపీ శర్మ కమిటీ నివేదికను రద్దుచేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ లేఖను సమర్పించింది. అదేవిధంగా అన్ని రాజకీయపార్టీలు బీపీ శర్మ కమి టీ నివేదికను వ్యతిరేకించి, క్రీమిలేయర్ వార్షిక ఆదాయాన్ని ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయాదాయం మినహాయింపుతో 8 లక్షల నుం చి 30 లక్షలకు పెంచాలని డిమాండ్ చేయాలి. కేంద్రం బీపీ శర్మ కమిటీ నివేదికను ఆమోదించినట్లయితే దేశంలో ఓబీసీలు పెద్దఎత్తున ఉద్యమించి మరో మండల్ ఉద్యమానికి సిద్ధమవుతారు. ఇది బీజేపీ రాజకీయ పతనానికి నాంది అవుతుంది.
(వ్యాసకర్త: రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం)
-కోడెపాక కుమారస్వామి
94909 59625