దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూలకు భిన్నాభిప్రాయాలుండేవి. వాటిని వారు నిజాయితీ, నిబద్ధతలతో అవసరమైతే గాంధీ సలహాతో చర్చించుకొని పరిష్కరించుకునేవారు. ఫలితాలను దేశ ప్రగతికి ఉపయోగించేవారు. ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఏకాభిప్రాయాలు, ఐక్యతలున్నాయి. కానీ, వారు తమ సామూహిక శక్తియుక్తులను దేశం కోసం వాడటంలేదు.
సంఘ్, అధికారం, కార్పొరేట్ సంస్థలకు అడ్డగోలుగా పంచిపెట్టడం, హిందుత్వ పేరుతో ప్రజల మధ్య విభజన, ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ పతనాల కోసం దుర్వినియోగిస్తున్నారు. విచారించాల్సిన విషయమేమంటే, వీరు పటేల్ పేరును తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. కానీ, ఆయన విధానాలను దేశ సంక్షేమం కోసం, పరిపాలన పరిపూర్ణత కోసం వాడటం లేదు. పటేల్ జీవితాంతం పాటించిన విలువలకు, ఆచరణకు వీరు పూర్తి వ్యతిరేకంగా వెళ్తున్నారు. అంశాలవారీగా వాటిని చూద్దాం.
1. గుజరాత్కు చెందిన పటేల్.. గాంధీ తొలి రాజకీయ అనుచరులలో ఒకరు. సహాయ నిరాకరణ ఉద్యమంలో, కుటుంబ సమేతంగా విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నారు. అహింసాయుత శాసనోల్లంఘనలో చురుకైన పాత్ర పోషించారు. గుజరాత్ రైతులను, 80 వేల బర్దోలి రైతు కూలీలను ఆ ఉద్యమంలో భాగస్వాములను చేశారు. తిరుగులేని గుజరాత్ నాయకునిగా ఎదిగారు. కాంగ్రెస్ అధ్యక్షునిగా 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. దేశ విభజన సమయంలో శరణార్థుల కోసం సహాయక చర్యలను నిర్వహించి శాంతి పునరుద్ధరణకు కృషిచేశారు. గుజరాత్లో అసమానతలు, మద్యపానం,అస్పృశ్యత, కుల మత వివక్షలకు వ్యతిరేకంగా, స్వయం సమృద్ధి, మహిళా సాధికారిత కోసం విస్తృతంగా ఉద్యమించారు. హిందు-ముస్లిం సమస్యలు పరిష్కరించి వారి ఐక్యతకు కృషిచేశారు. సామాజికంగా, ఆర్థికంగా చీల్చబడిన కులాలు, వర్గాల ఐక్యత, విశ్వాసాలను పెంపొందించడం పటేల్ ముఖ్య విజయం.
స్వాతంత్ర ఉద్యమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పాల్గొనలేదు. క్విట్ ఇండియా ఉద్యమంలో దేశమంతా పాల్గొన్నా ఆ సంస్థ దూరంగానే ఉంది. జాతీయ ఉద్యమంలో తమ నాయకులు, కార్యకర్తలను పాల్గొనవద్దని చెప్పటమే కాకుండా, ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేయమని ఆదేశించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏలో సైనికుల నియామకం జరుగుతూ ఉంటే, దానిని ఆటంకపరుస్తూ ఆర్ఎస్ఎస్ సభ్యులను రిక్రూట్ చేసుకొని, వారిని బ్రిటిష్ అధికారుల అంగరక్షక దళంలో చేర్చారు. స్వాతంత్రోద్యమ వ్యతిరేక పనులు చేశారు. ఆంగ్లేయులకు వంతపాడారు. జైలు బయటికి రావడానికి వీరి నాయకులు బ్రిటిష్ వారికి ఊడిగం చేస్తామన్న వాగ్దానంతో క్షమాభిక్ష ఉత్తరాలు రాశారు. భారతీయుల ఊచకోతకు ఆంగ్లేయులకు సహకరించారు. ప్రజలను మతం పేరుతో చీల్చారు. స్వాతంత్య్ర సమరంలో హిందు-ముస్లిం విభేదాలను రెచ్చగొట్టారు. పటేల్ ఆదర్శాలకు విరుద్ధంగా నేడు సంఘ్ ఆధ్వర్యంలో కేంద్ర పాలకులు అంటరానితనం, కుల మత వివక్షతలను పెంచుతున్నారు. స్వయంగా గుజరాత్లోనే మద్యం, మత్తుపదార్థాల వినియోగం విపరీతంగా పెరిగాయి. ఆ రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజన, ముస్లిం ప్రాంతాల్లో మంచినీరు, విద్యుత్తు, ప్రయాణ సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాలు లేవు. ముస్లింలపై హిందు నిప్పు రాజేశారు. దళితులను, ముస్లింలను చంపారు. నిన్నటిదాకా సంఘ్, బీజేపీ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయలేదు. ఓ వైపు చైనాను బహిష్కరించాలని ప్రచారం చేసిన వీరు నేడు చైనాలోనే విగ్రహాలను తయారుచేయించారు. మోదీ వాడేవన్నీ విదేశీ వస్తువులే. విదేశీ పెట్టుబడులకు, కంపెనీలకు పెద్దపీట వేశారు.
2. పటేల్ అహ్మదాబాద్ మున్సిపాలిటీకి 1922-24 మధ్య తొలి భారతీయ కమిషనర్గా, 1924-28 మధ్య ఎన్నికైన అధ్యక్షునిగా పనిచేశారు. విద్యుత్తు, మంచినీరు, మురుగునీటి పారుదల, పారిశుద్ధ్యం, విద్య వంటి మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచారు. బ్రిటిష్ రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలు, కౌలు, పన్నులకు వ్యతిరేకంగా రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల కోసం పోరాడారు. సర్దార్ (నాయకుడు) అనే బిరుదును ప్రజల నుంచి పొం దారు. పటేల్ అధ్యక్షతన కాంగ్రెస్ 1931లో ‘ప్రాథమికహక్కులు-ఆర్థిక విధానం’ తీర్మానాన్ని ఆమోదించింది. కనీస వేతనం, హక్కులు, పౌరహక్కుల రక్షణ, లౌకికరాజ్య స్థాపన, అంటరానితనం, బానిసత్వం నిర్మూలనలను ఈ తీర్మానం సూచించింది. యెరవాడ జైల్లో ఉన్నప్పుడు గాంధీజీతో పటేల్ అనేక అంశాలపై చర్చించారు. వారి బంధం అన్నదమ్ముల అనుబంధంగా మారింది. పటేల్ తనకు తానుగా ఒక స్థానానికి పోటీ పడకుండా, వివిధ రాష్ర్టాలలో, జాతీయస్థాయిలో ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులకు మార్గదర్శకత్వం వహించారు. 1936 నాటి కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ సోషలిజం ప్రతిపాదనను పటేల్ వ్యతిరేకించారు. 1938లో గాంధీ అహింసా సూత్రాలను కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ తిరస్కరించారు. బోస్ను పటేల్ వ్యతిరేకించారు. బోస్ రాజీనామాకు దారితీసిన నిరసనలకు పటేల్ నాయకత్వం వహించారు. అయినప్పటికీ, నెహ్రూ, బోస్లతో ఆయనకు ఉన్నవి సైద్ధాంతిక వైరుధ్యాలే. అవి వ్యక్తిగతమైనవి కావు.
పటేల్ తీర్మానించిన ప్రాథమిక, పౌరహక్కులు, కనీస వేతనం, లౌకిక సమాజ స్థాపన, అస్పృశ్యత నిర్మూలన, పేదల సంక్షేమ ఆర్థిక విధానాలను మోదీ పక్కనపెట్టడమేగాక వాటికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. సోషలిజం, అహింస సరిపడవు. సైద్ధాంతిక వైరుధ్యాన్ని కూడా సహించని నిరంకుశత్వం ఆయనది. వ్యక్తిగతంగా దాడులకు దిగే రాజకీయం మోదీ-షా రాజకీయం.
3. నెహ్రూ ప్రధానమంత్రిత్వంలో భారత ప్రథమ ఉపప్రధానిగా, హోం, సమాచార, రాష్ర్టాల-శాఖల మం త్రిగా పటేల్ పనిచేశారు. 565 స్వతంత్ర రాచరిక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. రాజకీయ ఏకీకరణ సాధించారు. పటే ల్ రాజీ లేని జాతీయభావంతో, నిబద్ధతతో దేశసమగ్రత, సమైక్యతలకు విశేష కృషిచేశారు. ఉక్కు మనిషిగా పేరుగాంచారు. తనకు నెహ్రూతో ఎలాంటి విభేధాలు లేవన్నారు. తనకు ఎప్పుడూ ప్రధాని కావాలన్న కోరిక లేదని ప్రకటించారు.
పటేల్ సాధించిన భౌగోళిక సమగ్రత, సామాజిక ఐక్యతలను సంఘ్, బీజేపీ ఎగతాళి చేశాయి. ఛోటా సర్దార్, ఉక్కుమనిషి బిరుదులు తగిలించుకున్న మోదీ తన తిరుగులేని నాయకత్వాన్ని, ఉక్కు మనస్తత్వాన్ని ప్రజల కోసం కాకుండా అంబానీ, అదానీల కోసం వాడుతున్నారు. రాజకీయ జీవితంలో తన ఉన్నతికి సహకరించిన అద్వా నీ, మురళీ మనోహర్ జోషీ వంటి వారిని మోదీ అవమానించారు.
4. రాజ్యాంగ నిర్మాణసభలో పటేల్ సీనియర్ నాయకుడు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పాత్ర గణనీయమైనది. మైనారిటీలు, గిరిజనులు, బహిష్కృత జాతులు, ప్రాథమిక హక్కులు, రాష్ర్టాల రాజ్యాంగ విధానాలు మొదలగు కమిటీలకు పటేల్ అధ్యక్షుడు. ఈ మేరకు దేశాధ్యక్షునికి ఉన్నన్ని హక్కులు గవర్నర్లకు లేకుండా చేసి, రాష్ర్టాల్లో ప్రజా ప్రభుత్వాల మనుగడను సుస్థిరం చేశారు. మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించారు. పౌర అధికారుల సేవల్లో రాజకీయ జోక్యాన్ని అరికట్టారు. ఇండియాను హిందూ దేశంగా, హిందూ మతాన్ని అధికార మతంగా ప్రకటించాలన్న సలహాను పటేల్ తిరస్కరించారు. భారత్ లౌకిక రాజ్యం. పాకిస్థాన్ వంటి మతరాజ్యం లాగా మనం ఉండలేమన్నారు. 1949లో బాబ్రీ మసీదులో కొందరు రాము ని బొమ్మలను పెట్టినప్పుడు నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జీబీ పంత్కు పటేల్ లేఖ రాస్తూ.. ఈ సమస్యను బలప్రయోగంతో పరిష్కరించలేమని, ముస్లింల ఐచ్ఛిక సమ్మతితోనే అది సాధ్యమని స్పష్టం చేశారు. దేశ విభజన సందర్భంలో ముస్లింలు పయనిస్తున్న రైళ్లపై దాడిని పటేల్ అనేకమార్లు ఆపారు. 1947 సెప్టెంబర్లో పదివేల మంది ముస్లింలకు ఎర్రకోటలో శిబిరాలను ఏర్పాటుచేసి ఉచిత భోజనంతోపాటు ఇతర సౌకర్యాలను అందించారు. స్వతంత్ర భారతానికి పునాది వంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికార వ్యవస్థను పటేల్ స్థాపించారు. గుజరాత్ సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాల స్థాపనకు పటేల్ ఆద్యుడు. గాంధీ హత్య తర్వాత పటేల్, నెహ్రూ తమ మధ్య ఉన్న స్వల్ప విభేదాలను మరిచి కలిసి పనిచేశారు. హింస, అల్లర్లు జరగకుండా చూశారు. గాంధీ మరణించిన రెండు నెలల్లోపే పటేల్ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దీనికి కారణం గాంధీ హత్యతో తనకు కలిగిన అంతులేని బాధేనన్నారు.
కరడుగట్టిన మతోన్మాదంతో సంఘీయులు గాంధీనే చంపారు. వారి వారసులు ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నారు. పటేల్ ఆశయాలకు వ్యతిరేకంగా దేశాన్ని హిందూ దేశంగా, హిందూ మతాన్ని రాజమతంగా, హిందీని జాతీయ భాషగా అనధికారికంగా మార్చారు. లౌకికతను మంటగలిపారు. ముస్లింల మనసు గెలవడం మాట అటుంచి, వారి ధన, మాన ప్రాణాలను హరించారు. రాజ్యమే హత్యలు, మానభంగాలను ప్రోత్సహించే స్థాయికి దిగజారింది. పటేల్ కల్పించిన మత మైనారిటీ, హరిజన, గిరిజన, ఆదివాసీల హక్కులను, రిజర్వేషన్లను రద్దుచేస్తున్నారు. గవర్నర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలపై నిఘా సంస్థలుగా, నియంత్రణ వ్యవస్థలుగా మార్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బానిసలుగా చేసుకున్నారు. సహకార సంఘాలను పాలకపక్ష చందా సంస్థలుగా మార్చారు.
5. దేశంలో ఎవరూ ఆకలితో కన్నీరు కార్చరాదని పటేల్ ఆకాంక్షించారు. భారతీయుల ఐక్యత, స్వరాజ్యం నుంచి సురాజ్యం సాధించుకునే సామర్థ్యంపై ఆయనకు అపార నమ్మకం. పటేల్ సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి పథకాలను సమర్థించారు. నా కల్చర్ (సంస్కృతి) అగ్రికల్చర్ (వ్యవసాయం) అన్నారు. మోదీ భారతీయులను మతస్థులుగా మార్చారు. హక్కులు సంపన్నులకే. బాధ్యతలు మాత్రం ప్రజలకు అంటున్నారు. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు మినహాయింపునిస్తూ, పేదలకు ఇచ్చే చిన్నపాటి సబ్సిడీలను, ఉచిత పథకాలను రద్దుచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ మేరకు ఒత్తిడి తెస్తున్నారు.
పటేల్ ఆదర్శాలను పాతిపెట్టిన మోదీ ప్రభుత్వం.. ఆయన విగ్రహాన్ని మాత్రం భారీ ఎత్తున ఏర్పాటు చేయటం ప్రజలను మోసపుచ్చటమే. జీవితాంతం కాంగ్రెస్ వాది అయిన పటేల్ను బీజేపీ సొంతం చేసుకోవడం విచిత్రమని ప్రసిద్ధ చరిత్రకారుడు రామచంద్రగుహ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర సమరంలో తమకంటూ ఒక పాత్ర లేని బీజేపీ స్వాతంత్య్ర యోధులను, జాతీయ నాయకులను, రాజకీయవేత్తలను దొంగిలించిందని, ఆ పార్టీ చేసే నెహ్రూ నిందల్లో, పటేల్ పొగడ్తల్లో స్వార్థ చింతన ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పటేల్ను ప్రచారానికి, రాజకీయ లబ్ధికి వాడుకోవడం కాదు. ఆయన ఆశయాలను ఆచరించాలి. దేశ ప్రగతికి దారులు తెరవాలి.
గాంధీ హత్య తర్వాత పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధించారు. నిషేధం ఎత్తేయమని ఆ సంస్థ అధిపతి గోల్వాల్కర్ విజ్ఞప్తి చేసినప్పుడు, భారత రాజ్యాంగానికి కట్టుబడేలా ఆర్ఎస్ఎస్ లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించమని షరతు విధించారు.
రాజ్యాంగ విధేయత, జాతీయ పతాకం ఆమోదం, సంఘ్ అధినేత అధికారాల నిర్వచన, అంతర్గత ఎన్నికలతో సంఘ్ ప్రజాస్వామ్యీకరణ, పిల్లలను సంఘ్ సభ్యులుగా చేర్చుకోటానికి తల్లిదండ్రుల అనుమతి, హింస, రహస్య కార్యక్రమాలను చేపట్టబోమనే నిబంధనలతో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని స్పష్టం చేశారు పటేల్. దీనికి వ్యతిరేకంగా గోల్వాల్కర్ పెద్ద ఎత్తున ఆందోళన జరిపారు. పటేల్ ఆయన్ను జైల్లో పెట్టారు. చివరికి సంఘ్ నాయకుని ఎన్నిక విధానం, బాలల సభ్యత్వానికి పెద్దల అనుమతి తప్ప అన్ని షరతులు అంగీకరించారు గోల్వాల్కర్. కానీ, ఈ విధంగా పొందుపరిచిన నిబంధనలను కూడా సంఘ్ తుంగలో తొక్కింది. ఆర్ఎస్ఎస్ నిర్మాణం, నిర్వహణలలో పటేల్కు ఇచ్చిన హామీలను పాటించలేదు.
ద్విజాతి సిద్ధాంతంతో మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని మొట్టమొదట కోరింది సావర్కర్. ముస్లింలందరు మరో దేశానికి పోతే భారత్ దానంతటదే హిందూ దేశమవుతుందని ఆయన ఆలోచన. ఈ నేపథ్యంలో జిన్నా నేతృత్వంలో ముస్లిం వేర్పాటువాద ఉద్యమం పెరిగిపోయింది. దీనికి పరిష్కారంగా దేశ విభజనను అంగీకరించిన మొదటి కాంగ్రెస్ నాయకుల్లో పటేల్ ఒకరు. గాంధీ, నెహ్రూలు విభజనను వ్యతిరేకించారు.
కానీ, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఈ రోజు దేశ విభజనకు సావర్కర్ను కాక గాంధీ, నెహ్రూలను తిడుతోంది. మాకు స్వాతంత్య్రం వద్దు, మీరే పాలించండని ఆంగ్లేయులను అర్థించిన వీరు ఈ రోజు అసలైన దేశభక్తులుగా మీసాలు దువ్వుతున్నారు.
(వ్యాసకర్త: సంగిరెడ్డి హనుమంత రెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి)