కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రస్తుత, పాత రాజీనామాలపై గాంధీభవన్లో తాజాగా కొత్త స్టోరీ ఒకటి చక్కర్లు కొడుతోంది. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినట్టు టీపీసీసీ ఆరోపించిన విషయం తెలిసిందే. గతంలో ఈయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసింది కూడా ఒక కాంట్రాక్టు విషయంలోనేనని అంటున్నారు. అయితే దానికి తెలంగాణ రాష్ట్రం కోసం చేసినట్టు కలరింగ్ ఇచ్చినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. దేవాదుల ప్రాజెక్టుకు చెందిన ఒక కాంట్రాక్టు విషయంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గొడవపడి తన మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణ కోసం చేసినట్టు ప్రచారం చేసుకున్నాడని ఈ వర్గాల కథనం. దేవాదుల ప్రాజెక్టులో కాంట్రాక్టు ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దక్కించుకుంటే, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తొక్కి పెట్టారు. దీంతో ఆగ్రహించిన కోమటిరెడ్డి ఆయనతో గొడవకు దిగారు.
ఆ సందర్భంగా ‘మీ సోదరుడు (సీఎం సోదరుడు) కావూరిహిల్స్లో దుకాణం తెరిచారు.. అక్కడికి వెళ్లి వచ్చిన వారికే పనులు జరుగుతున్నాయి. మరి దాని సంగతేంటి’ అని కోమటిరెడ్డి నిలదీసారు. చేతనైతే సీబీఐకి ఫిర్యాదు చేసుకో… అంతే కానీ ఈ విధంగా మాట్లాడితే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి అసలే మెంటల్.. బర్తరఫ్ చేసినా చేస్తాడని తన సన్నిహితుల వద్ద వాపోయిన కోమటిరెడ్డి, ఆ తర్వాత కొన్ని రోజులకే మంత్రి పదవికి రాజీనామా చేశాడు. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా ఉండటంతో రాష్ట్రం కోసం చేసినట్టు కలరింగ్ ఇచ్చాడన్నది అసలు కథ.