ఎన్నో వాగ్దానాలు, హామీలతో అధికారం చేపట్టిన మోదీ ఎనిమిదేండ్లు అవుతున్నా ఏ ఒక్క హామీని
నెరవేర్చలేదు. మోదీ గెలవడానికి ప్రధాన కారణమైన ‘ఓబీసీల జనగణన’ను కూడా మోదీ అటకెక్కించారు. తాను బీసీనని చెప్పుకొని ఓబీసీ జనగణన చేస్తానన్నందుకే మోదీని ప్రజలు విశ్వసించి భారీ మెజారిటీని కట్టబెట్టారు. కానీ నది దాటేదాక ఓడ మల్లయ్య, దాటిన తర్వాత బోడి మల్లయ్య
అన్నరీతిగా మోదీ వ్యవహరిస్తూ మొత్తం దేశాన్నీ, ఓబీసీలను వంచించటం గర్హనీయం.
సమాజంలో అన్నివర్గాలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలంటే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అవసరం. అందుకు ఆయా వర్గాల జనగణన అనివార్యం. ఈ విషయాన్ని నాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి కులాలవారీగా జనగణన చేసింది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత నుంచి నేటివరకు ఏ ప్రభుత్వం ఓబీసీల కులగణన జరపలేదు. ఫలితంగా దేశంలో ఓబీసీల జనాభా ఎంతనో ఎవరికీ తెలియదు. ఏవో అంచనాలు తప్ప అధికారిక గణాంకాలు లేవు.
2010లో బీసీల కులాలవారీగా లెక్కలు తీయాలని పార్లమెంటులో బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ ప్రభుత్వం ఓబీసీ జనగణన జరుపుతామని 2018లో అంటే లోక్సభ ఎన్నికలకు ఏడాదిముందు నాటి హోంమంత్రి రాజ్నాథ్సింగ్ స్వయంగా ప్రకటించారు. కానీ, అధికారం మళ్లీ దక్కిన తర్వాత బీజేపీ మాట మార్చింది. సామాజిక న్యాయం, ఓబీసీ జనగణనపై కేంద్రం కుంటి సాకులు చెప్తున్నది.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు బీసీల సమస్యలను అధ్యయనం చేయడానికి ఓబీసీకి చెందిన ఎంపీ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించి 3,743 కులాలను బీసీ కులాలుగా గుర్తించింది. వారి పరిస్థితులను మెరుగుపరచడం కోసం వారికి రాజకీయపరమైన రిజర్వేషన్లతో సహా అన్నిరంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నది. జనాభా నిష్పత్తి ప్రకారం.. 52 శాతం ఉండాల్సిన రిజర్వేషన్లు కేవలం 27 శాతానికే పరిమితమయ్యాయి.
ఆధునిక కాలంలో పారిశ్రామిక అభివృద్ధి కారణంగా కులవృత్తులకు దూరమైన వెనుకబడిన కులాల ప్రజలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారు. బీసీల అభ్యున్నతి కోసం మోదీ ప్రభుత్వం ఓబీసీ జనగణన చేపట్టాల్సిన అవసరం ఉన్నది. బీసీ వ్యక్తి ప్రధాని అని చెప్పుకొంటున్న బీజేపీ ఓబీసీ గణన చేపట్టకపోవడం అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ది కూడా బీసీలపై గోడ మీది పిల్లివాటమే. కుల జనగణన అనేది ప్రజాస్వామిక పాలనలో అవసరమైన అనివార్యమైన ప్రక్రియ. దీన్ని చేపట్టకుండా ఏ ప్రజా ప్రభుత్వం ప్రజానుకూల పాలన చేయలేదు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు. ఏ కులం, వర్గం ప్రజలు ఎంత శాతం ఉన్నారో తెలియకుండా సంక్షేమ పథకాలను రూపొందించటం అసాధ్యం. అలాంటప్పుడు ఓబీసీ జనగణన వ్యతిరేకించటమంటే.., బీసీల పట్ల వారికి ఎంత ప్రేమ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మతాల పేరిట రాజకీయం చేసే బీజేపీ.. ఈ డిమాండ్ను విచ్ఛిన్నకరమైనదిగా సోషల్మీడియాలో ప్రచారం చేయటం విడ్డూరం.
ఓబీసీ జనగణనపై తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. మహారాష్ట్ర, ఒడిషా, జార్ఖండ్, బీహార్ కూడా దీనికి మద్దతు తెలిపాయి. అయినా మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓబీసీ జనగణన అసాధ్యమని అంటున్నది. ఎందుకంటే.. కులగణన ద్వారా సామాజిక ఉద్రిక్తతలకు కారణమవుతుందట! ఇంతకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా? మతం, దేవుని పేర ప్రజల్లో విభజన రేఖలు గీసి రాజకీయ పబ్బం గడుపుకొనే బీజేపీ కులగణన వచ్చేసరికి కబుర్లు చెప్తున్నది. ఇది మెజారిటీ ప్రజలైన ఓబీసీలను అవహేళన చేయటమే. ఇంతటి ద్రోహం తలపెట్టిన మోదీకి రాబోయే రోజుల్లో ఓబీసీలు తగిన గుణపాఠం తప్పకచెప్తారు.
దేశంలో దాదాపుగా అన్ని రాష్ర్టాల నుంచి ఓబీసీ జనగణన చేపట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. బీజేపీయేతర పాలిత రాష్ర్టాలు ప్రత్యేకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాయి. ఢిల్లీలో బీసీ సంఘాలు ధర్నా చేశాయి. దీనికి అన్నిపార్టీల నేతలూ మద్దతిచ్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు ఓబీసీ జనగణన చేయడం సాధ్యం కాదని తేల్చేయడం ద్రోహపూరితం. ఎనిమిదేండ్లుగా జంతువుల గణన చేస్తున్న ‘నమో’ నయవంచన మోదీ ప్రభుత్వం ఓబీసీల జనగణన మాత్రం చేయలేదు. 52 శాతం ఉన్న ఓబీసీలు జనగణన కోసం ఉద్యమిస్తూ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి బైబై చెప్పడం ఖాయం.
(వ్యాసకర్త: డాక్టర్ సంగని మల్లేశ్వర్ , 98662 55355, విభాగాధిపతి, జర్నలిజం శాఖ,కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్)