చారిత్రకంగా చూస్తే వైదిక మతం అంటే ఈ రోజు మనం మాట్లాడుకునే హిందూ మతం కాదు. యజ్ఞాలు, వైదిక కర్మకాండల నుంచి గుడులు కట్టుకునేంత వరకు, వైదిక మతంలో విష్ణు, శివ ఆరాధనలు మొదలై వైష్ణవ, శైవ మతాలు ఏర్పడ్డాయి. రుగ్వేద కాలంలో ఇంద్రుడి కంటే తక్కువ ప్రాధాన్యత ఉన్న విష్ణు రూపానికి మలి రుగ్వేద కాలం నుంచి ప్రాధాన్యత పెరగడం మొదలైంది. విష్ణు ఆరాధన రకరకాల రూపాల్లో మొదలై ఎన్నో ప్రాంతాల, తెగల వీరులు, నాయకుల ఆరాధనల్ని కలుపుకొని ఇప్పటి వైష్ణవ మత రూపం సంతరించుకుంది. నారాయణ-విష్ణు, సంకర్షణ-బలదేవ, వాసుదేవ-కృష్ణ వంటి రూపాలు కలిసి వైష్ణవ మతంగా రూపొందింది. అందుకే విష్ణు దశావతారాల్లో కృష్ణుడితో పాటు బలరాముడు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తాడు. మథుర ప్రాంతంలోని వృష్ణి వంటి తెగల నాయకుడైన వాసుదేవ-కృష్ణ ప్రముఖ వైష్ణవ అవతారంగా రూపొందినట్టు సాహిత్య, భౌతిక ఆధారాలు చెపుతున్నాయి. ఈ రకంగా ఎదిగిన మతమే భాగవత మతం, అంటే వైష్ణవం. దేశంలోనే తొలి వైష్ణవ పురావస్తు ఆధారం మధ్యప్రదేశ్లోని బెస్నగర్లో ఉన్న క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన గరుడ స్తంభం. ఈ స్తంభాన్ని దేవదేవుడైన వాసుదేవుడిని కీర్తిస్తూ తక్షశిల వాసి, గ్రీకు రాయబారి, భాగవతుడైన (భాగవత మత అనుయాయి) హీలియోడోరస్ ఏర్పాటు చేసాడు.
తెలంగాణలో తొలి వైష్ణవం
రామానుజాచార్యుల కంటే ముందే తమిళనాట తొలి ఆళ్వారుల భక్తి ఉద్యమ ప్రభావం ఉంది. తెలంగాణలో ఈ ప్రభావం లేకున్నా స్వతంత్రంగా భాగవత మతం లాగానో, ఇతర రూపాల్లోనో వైష్ణవ మతం రూపొందింది. శాతవాహనుల కాలానికే దక్షిణానికి విస్తరించిన భాగవత మత ప్రభావం వల్లే శాతవాహన రెండో రాజు పేరు కృష్ణ లేక కన్హాగా ఉందని భావించవచ్చు. ఉత్తర భారతదేశంలో రూపుదిద్దుకుంటున్న వైష్ణవం ఇక్ష్వాకుల కాలానికి తెలంగాణలో స్పష్టంగా కనిపించింది. కృష్ణా లోయలోని నాగార్జునకొండ, ఏలేశ్వరాల్లో దొరికిన ఆధారాలు ఇందుకు సాక్ష్యం.
నాగార్జున కొండ తవ్వకాల్లో దొరికిన ఇక్ష్వాకుల కాలం నాటి అష్టభుజ స్వామి ఆలయం దేశంలో దొరికిన అతి కొద్ది తొలి వైష్ణవ ఆలయాల్లో ఒకటి. రాతితో చేసిన అధిష్ఠానం మీద కట్టెతో చేసిన అష్టభుజస్వామి (విష్ణు) విగ్రహం ఉండేదని అక్కడ దొరికిన శాసనం చెపుతుంది. మూడో రాజైన ఎహువల ఛాంతమూలను ఓడించి కొంత కాలం విజయపురిని ఆక్రమించిన ఆభీర వసుశేన అష్టభుజ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేయించినట్టు తెలుస్తున్నది.
ఫణిగిరిలో దొరికిన ఒక శాసన స్తంభంపై బుద్ధుడి గొప్పదనాన్ని చెపుతూ- ‘సక్యకులో ధ్వజేన ఇమేన చక్రేనస / ధర్మజెన మహాత్మనా కంస నిసూదనేన నసూదితో యొ మధుసూదనెన స సూదితో రాగ నిసూదనేన దోషాసురొ చక్రవరేనిమెన’ అని రుద్ర పురుషదత్తుడి రాజవైద్యుడు చెక్కించాడు. ఇది ఒక విశిష్టమైన శాసన స్తంభం. ఈ శాసనంలో బౌద్ధంతో పాటు వైదిక మతం, అందులోనూ శివుడు, కృష్ణుడు, విష్ణువుల ప్రస్తావన ఉంది. కంస నిసూదనుడు, మధుసూధనుడైన కృష్ణుడు రాగ ద్వేషాల్ని, దోషాల్ని చంపలేకపోయాడనీ, బుద్ధుడు ఆ పని చేయగలిగాడనీ ఉంది. ఈ రకమైన రెండు భిన్న మతాల పోలికలతో, వైష్ణవ ప్రస్తావన ఉన్న తొలి సంస్కృత శాసనం సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో దొరికింది.
తెలంగాణలో తొలినాళ్ళ వైదిక మతంలో వైష్ణవం ఒక ముఖ్యమైన భాగం. ఈ వైష్ణవ చరిత్రను రెండు దశల్లో చూడొచ్చు. మొదటి దశలో భారత ఉపఖండంలో లాగానే వైష్ణవ మతం రూపొందే క్రమం తెలంగాణలో కనిపిస్తుంది. ఇక రెండో దశలో కనిపించేది రామానుజాచార్య విశిష్టాద్వైత సిద్ధాంతం వెలుగులో దక్షిణ భారతంలో ఎదిగిన వైష్ణవ మతం. కాకతీయుల త్రికూట ఆలయాల్లో విష్ణు రూపాలు రావటం, పద్మ నాయకుల కాలంలో వైష్ణవ మతానికి పెద్ద ఎత్తున ఆదరణ దొరకడం, ప్రత్యేక వైష్ణవ ఆలయాల నిర్మాణం ఈ దశలో జరిగింది. అందుకే మధ్య యుగ చరిత్రలో వైష్ణవ మతం గురించి తెలుసుకునే ముందు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి కాకతీయ యుగం వచ్చే వరకు తెలంగాణలో వైష్ణవ వ్యాప్తి గురించి చర్చించాలి.
ఇక్ష్వాకుల తర్వాత వచ్చిన విష్ణుకుండి కాలంలో శైవ ఆలయాలు ఎన్నో వచ్చినా ఉండవల్లి గుహల్లో వీరు చెక్కించిన అనంత పద్మనాభ స్వామి విగ్రహం విష్ణు శయన తొలి విగ్రహాల్లో ఒకటి. అష్టభుజ విష్ణు రూపం బాదామి చాళుక్యుల కాలంలో బాదామి లోని మూడవ గుహలో, ఇంకా పల్లవ నిర్మాణాల్లో కనిపిస్తుంది.
ఏలేశ్వరంలో విష్ణు రూపాలు
నాగార్జున సాగర్ డ్యాంలో నీట మునిగిన ఏలేశ్వరంలో క్రీస్తు శకం 4 లేక 5 వ శతాబ్దం నాటి తల, కాళ్ళు ఖండితమైన అందమైన విష్ణు ప్రతిమ దొరికింది. ఇది తొలి పల్లవ లేక విష్ణుకుండి కాలం నాటిది. ఇక్కడే క్రీస్తు శకం 10 చివర లేక 11 వ శతాబ్దం నాటి విష్ణు విగ్రహం దొరికింది. విష్ణు రూపం చుట్టూ విష్ణు అవతారాలు నరసింహ, వామన, రామ, పరశురామ, బలరామ, బుద్ధ, కల్కి చెక్కి ఉన్నాయి. మిగిలిన అవతారాలున్న భాగం విరిగి ఉంది. అంటే ఈ కాలం నాటికి విష్ణు పురాణంలోని దశావతారాల కథ సమాజంలో స్థానం సంపాదించింది.
బుద్ధుడు విష్ణు అవతారం ఎలా అయ్యాడు?
విష్ణు పురాణంలో విష్ణు అవతారాల్లో బుద్ధుడిని చేర్చిన వైనం విచిత్రంగా ఉంటుంది. రాక్షసులు (దైత్యులు) ప్రహ్లాదుడి నాయకత్వంలో స్వర్గాన్ని ఆక్రమించి దేవతల్ని తరిమి వేశారు. దేవతలు విష్ణువుకు మొర పెట్టుకోగా విష్ణువు మాయామోహుడై వచ్చి మొదట దిగంబర రూపంలో (జైన మతం) రాక్షసులను ధర్మ భ్రష్టులను చేసాడు. ఆ తర్వాత రక్త వస్ర్తాలు ధరించి మరొక కొత్త ధర్మం (బౌద్ధం) లేవదీసాడు. దీంతో రాక్షసులు పూర్తిగా ధర్మ భ్రష్టులు, వేద భ్రష్టులు అయ్యారు. ఆ తర్వాత దేవతలు రాక్షసుల్ని సులభంగా ఓడించి తిరిగి స్వర్గాన్ని కైవసం చేసుకున్నారు. ఇదీ విష్ణు పురాణంలో బుద్ధుడు విష్ణు అవతారంగా మారడం వెనక ఉన్న కథ.
-డా. ఎం.ఎ. శ్రీనివాసన్ , 81069 35000