అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాలకు పెట్టింది పేరైన మోదీ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం అగ్నిపథ్. హఠాత్తుగా నోట్లరద్దు, ఆకస్మిక లాక్డౌన్, వ్యవసాయ నల్లచట్టాలు… ఇప్పుడు ఏకంగా దేశ సరిహద్దులను రక్షించే సైన్యంతో ప్రయోగాలు! నరేంద్ర మోదీ ప్రభు త్వం పాలనా విధానమిది! ప్రధాని మోదీ కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునేముందు ప్రతిపక్షాలతో కాదుగదా కనీసం సహచర క్యాబినెట్ మంత్రులతో కూడా చర్చించకపోడం ఆశ్చర్యకరం. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే స్పృహ ఉన్నట్టు కూడా ఆయన ప్రవర్తించడం లేదు. దేశ భవిష్యత్తును, కోట్లాదిమందిని అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసే నిర్ణయాలను ఇంత ప్రణాళికా రహితంగా, ఇంత యథాలాపంగా తీసుకోవడమేమిటి?
సైన్యం బడ్జెట్లో వేతనాలకు, పింఛన్లకు వ్యయం అధికమవుతుందని, దానిని తగ్గించుకునే ఉద్దేశంతో కేంద్రం అగ్నిపథ్ను తీసుకొచ్చినట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. అది నిజమేనని అనుకున్నా.. ఆ సమస్యకు పరిష్కారం ఇదా అనేదే అసలు చర్చ. సైన్యా న్ని, అందులో పనిచేసే సైనికులను ఇతర ప్రభుత్వ విభాగాల్లాగా, ప్రభుత్వరంగ సంస్థల్లాగా, వాటిలోని సిబ్బందిలాగా చూడవచ్చా? ఒక ప్రభుత్వ కంపెనీని మూసివేసే పరిస్థితి రావచ్చు లేదా ప్రైవేట్పరం చేసే పరిస్థితీ రావచ్చు.. కానీ సైన్యంతో అటువంటి ప్రయోగాలు చేయగలమా? సైన్యం పటిష్ఠంగా లేకపోతే దేశం ఉనికిలో ఉంటుందా? అసలే ఓవైపు దాయాది పాకిస్థాన్తో దశాబ్దాల వైరం, మరోవైపు మోదీ హయాంలో, భారత భూభాగంలోకి చొచ్చుకొస్తున్న చైనా. ఇటువంటి పరిస్థితుల్లో సైన్యాన్ని ఆధునిక యుద్ధసామగ్రితో, భవిష్యత్ యుద్ధవ్యూహాలతో సర్వసన్నద్ధంగా మలచాలి. మరింత బలోపేతం చేయాలి. కానీ, ఈ అసలు పనిని వదిలిపెట్టి, ఏటా 46 వేల మందిని సైనికులుగా తీసుకొని, వారిలో మూడొంతుల మందిని నాలుగేండ్ల తర్వాత వెనక్కి పంపేటువంటి ప్రయోగాలకు కేంద్రప్రభుత్వం దిగటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
నాలుగేండ్ల కాంట్రాక్టు కింద జవాన్లను తీసుకోవటానికి ఇదేమన్నా సెక్యూరిటీ ఏజెన్సీనా? ప్రాణాలకు తెగించి నిర్వహించే మహత్తర బాధ్యత మాతృభూమి పరిరక్షణ. అంతటి త్యాగానికి, సాహసానికి ఒక సైనికుడు సిద్ధం కావాలంటే.. తన కుటుంబాన్ని ఈ దేశం, ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందనే భరోసా అతడిలో ఉండొద్దా? నాలుగేండ్లు పని చేయించుకొని వదిలేస్తారనే అభద్రతతో ఉన్న సైనికుడు దేశానికి ఏం భద్రత కల్పించగలడు? వేలాదిమంది యువకులు అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగింది ఈ నిరాశలోంచే. రెండేండ్లుగా కరోనా పేరు చెప్పి సైనిక నియామకాలను పలుమార్లు వాయి దా వేసినా, ఓపికగా ఎదురుచూసిన యువతపై మోదీ సర్కారు నీళ్లు గుమ్మరించింది. సహనం నశించిన వారి ఆగ్రహం అవధులు దాటిం ది. ఇప్పటికైనా కేంద్రం వివేకాన్ని ప్రదర్శించాలి. రైతులతో ఏడాదిపాటు చెలగాటమాడి చివరికి క్షమాపణ చెప్పినట్లు కాకుండా, ఈసారైనా హుందాగా వ్యవహరించి అగ్నిపథ్పై పునరాలోచించాలి. సైన్యం వేతనాలు, పింఛన్లపై ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి.