‘గడిచిన ఎనిమిదేండ్లలో మేం అత్యంత నిజాయితీగా పనిచేశాం. దేశ రక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. ఏ ఒక్క వ్యక్తి లబ్ధి కోసం పని చేయలేదు. దేశ పునర్నిర్మాణంలో భాగంగా మహాత్మా గాంధీ, సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ కలల సాకారం దిశగా అడుగులు వేశాం..’
మే 26వ తేదీన గుజరాత్, రాజ్కోట్ జిల్లా, ఆట్కోట్ లోని పాటీదార్ కులస్థుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో ప్రధాని మోదీ. నిజాయితీగా పాలన చేశామని చెప్పుకొంటున్న ప్రధాని మోదీ ఎనిమిదేండ్ల పాలనా విధానాన్ని ఒకసారి పరిశీలిద్దాం. 2014 ఎన్నికలకు ముందు మోదీ ఇచ్చిన హామీలకు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన అనుసరిస్తున్న విధానాలకు ఎక్కడా పొంతన లేదు. దేశవ్యాప్తంగా అనేకచోట్ల ప్రసంగిస్తూ.. ‘విదేశాల్లో మూలుగుతున్న దేశ నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తా’నని హామీ ఇచ్చారు. కానీ అణా పైసా నల్లధనాన్ని కూడా తీసుకురాలేకపోయారు. 2016లో మోదీ ‘ఆదాయ వెల్లడి పథకం’ (ఐడీఎస్) అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. దీనిద్వారా నల్లధనం బయటపడుతుందని ప్రగల్భాలు పలికారు. కేంద్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు. కానీ, ఈ పథకం ద్వారా ఇప్పటివరకు ఏం ఒరిగిందో చెప్పలేదు. ‘నోట్లరద్దు’ గొప్ప నిర్ణయమే అయితే, అప్పటినుంచి ఇప్పటివరకు దేశ జీడీపీ వృద్ధి రేటు ఎందుకు తగ్గుతున్నదో మోదీజీ చెప్పాలి?
కేంద్ర ఎక్సైజ్ సుంకం గత ఎనిమిదేండ్లుగా పెట్రోల్పై 247, డీజిల్పై 793 శాతం పెంచి సామాన్యుల నడ్డి విరగగొట్టడమే ప్రధాని మోదీ నిజాయితీ పాలనగా భావిస్తున్నారేమో. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు తగ్గుతూ ఉంటే, దేశంలో మాత్రం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఎందుకు పైపైకి పెరిగిపోతున్నాయో మోదీ నోట ఇప్పటివరకు జవాబు లేదు. గ్యాస్ సిలిండర్లపై పేద, మధ్యతరగతి ప్రజలకు ఇచ్చే సబ్సిడీకి చడీచప్పుడు కాకుండా ఎందుకు భారీ కోత పెట్టారో? కనీసం ఆ మేరకు ఒక ప్రకటన సైతం ఇప్పటివరకు చేయలేదు. అమెరికన్ డాలర్తో రూపాయి మారకం విలువ దిగజారటానికి అప్పటి కేంద్ర ప్రభుత్వ చేతగానితనం కారణమని తీవ్రంగా స్పందించిన మోదీ గత ఎనిమిదేండ్లుగా రూపాయి మారకపు విలువ దిగజారుతుంటే ఎందుకు స్పందించడం లేదు. గత ప్రభుత్వాల్లో జరిగిన బొగ్గు కుంభకోణం, 2జీ, అగస్టా, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణాల విచారణలను ఎందుకు నిలిపివేశారు? 2014లో మోదీ చేసిన ఎన్నికల ప్రసంగాలు విని ఆయన అవినీతిని సహించరని దేశ ప్రజలనుకున్నారు. కానీ ప్రజల అంచనాలను మోదీ తలకిందులు చేశారు. తన కండ్లముందే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి ఎందరో ఘరానా మోసగాళ్లు దేశం దాటి వెళ్లిపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నలు నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం 16 నెలలుగా పోరాటం చేసి 700 మంది రైతులు చనిపోయారు. అయినా కనికరం లేని మోదీ వారిని ఆందోళన జీవులని గేలి చేశారు. పంజాబ్లో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తుండగా మోదీని రైతులు 8 గంటల పాటు నడిరోడ్డు మీద అడ్డుకున్నారు. అక్కడి స్థానిక ప్రభుత్వం శాంతిభద్రతల వైఫల్యంగా కేంద్రం విమర్శించింది. మరి 16 నెలలు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దీక్ష చేస్తే దానిపై స్పందించడం ప్రధానిగా మోదీ బాధ్యత కాదా? అప్పుడు మోదీకి ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా? తన కార్యక్రమానికి ఆటంకం కలిగితే స్పందించే ప్రధాని, రైతుల విషయంలో ఎందుకు స్పందించలేదు. ప్రపంచంలో ఏ ప్రభుత్వాధినేత మీడియా సమావేశం నిర్వహించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను నడపలేదు. కానీ మోదీ గత ఎనిమిదేండ్లుగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
(వ్యాసకర్త: మాందాల భాస్కర్, 97050 53483, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్)