రాష్ట్ర విభజన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి సీఎం కిరణ్కుమార్రెడ్డి ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి ఎవరైనా రాజకీయ ముత్తైదువ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్న రాహుల్ గాంధీకి తెల్లని దుస్తులు ధరించి చీకటి గదిలో కూర్చున్న ఒక వ్యక్తి కలలో కనిపించారట. దీంతో ఆయన్ను వెతికి పట్టుకొని ఢిల్లీ రప్పించుకున్నారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అయితే వద్దు.. ఏ రాజ్యసభనో, ఏఐసీసీ ఇంచార్జీ బాధ్యతలో అయితే తనకు ఓకే అని చెప్పేసి మళ్లీ ఆయన మటు మాయం అయ్యారు. ఆయన అడిగినట్టు పార్టీ తనను రాజ్యసభకు పంపుతుందా? లేక ఏఐసీసీ ఇంచార్జీగా ఏదైనా రాష్ర్టానికి పంపుతుందా? అని ఏపీ కాంగ్రెస్ నేతలు ఏఐసీసీని ఆరా తీయకుండా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావును సంప్రదిస్తున్నారట.
ఇదేమి లాజిక్కు.. ఆయనేమి కాంగ్రెస్ లీడర్ కాదు కదా? అనే అనుమానం మీకు వచ్చిందా? ఇందులో తిరకాసు ఏమిటంటే.. కిరణ్కుమార్రెడ్డికి ఏమి ఇస్తారనేది డొక్కాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి, కాంగ్రెస్కు రాజీనామా చేసి కిరణ్కుమార్రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టినప్పుడు.. ‘ఇదంతా ఏఐసీసీ స్క్రిప్టు ప్రకారం జరుగుతుంది.. ఆయన ఎక్కడికీ వెళ్లరు.. ఓ ఐదారేండ్లు అజ్ఞాతంలో ఉండీ మళ్లీ వన్ ఫైన్ మార్నింగ్ ఏఐసీసీ కార్యదర్శిగా ప్రత్యక్షం అవుతారు చూడండి’ అని 2014లోనే డొక్కా జోస్యం చెప్పిన సంగతిని గుర్తు చేస్తున్నారు.