నాడు జలదృశ్యంలో ప్రస్థానం ప్రారంభం కాగానే మొదలైన అవమానాలు, విమర్శలే బాట చూపాయి.. నిన్న తిరుగులేని విజయంతో తెలంగాణ సాధించాం.. నేడు తెలంగాణ సుజల దృశ్యంలో విజయాలు, కీర్తి కిరీటాలతో ముందుకువెళ్తున్నాం. ఈ అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడలేని ప్రతిపక్షాలు ఉద్యమకారులను కేసీఆర్పైకి ఎగదోసే ప్రయత్నాలు ఇప్పటికీ చేయటం శోచనీయం.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ప్రతిపక్షాలకు పట్టిలేదు కానీ కేసీఆర్ను బదనాం చేసే కుట్రలు మాత్రం చేస్తున్నాయి. వాటి విమర్శల వెనుక కుట్రలేమంటే.. ఉద్యమకారులను కేసీఆర్పై ఎగదోయడం. కానీ కేసీఆర్కు ఉద్యమకారులంటే ఎనలేని గౌరవం. ఆ విషయం తెలంగాణ ఉద్యమకారులమైన నా తోటి వారందరికీ తెలుసు.
నాటి భారత స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం దాకా ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు. తమ బతుకులు, భావితరాల భవిష్యత్తు, మన ప్రాంతాభివృద్ధి కోసమే ఉద్యమకారులు ప్రాణాలను పణంగా పెట్టారు. నాడు గాంధీజీ కోసమో, కాంగ్రెస్ కోసమో, నేడు కేసీఆర్ కోసమో లేక టీఆర్ఎస్ను అధికారంలో తీసుకురావడం కోసం కాదు. స్వపరిపాలన కోసం.. సామాజిక న్యాయం కోసం ఉద్యమం చేశాం. ఉద్యమంలో పాల్గొ న్నాం. మేం ఉద్యమకారులం. మాకు పదవులు ఎందుకివ్వడం లేదని కేసీఆర్ను ప్రశ్నించడం ఎంతవరకు న్యాయం?
తెలంగాణ ఉద్యమంలో పల్లె నుంచి పట్నం దాకా సకలజనులు పాల్గొన్నారు. అలా అని అందరికి పదవులు ఇవ్వడం ఎవరి వల్లా కాదు. ప్రజల ఆమోదం ఎవరికి లభిస్తుందో వారికే పదవులు లభిస్తాయి. ఒక వ్యక్తికి ఉన్న సామాజిక, సాంఘిక, ప్రాంత, కుల, మత, ఆర్థిక పరిస్థితులు, పలుకుబడి, నిజాయితీ, నిబద్ధత లాంటి ఎన్నో అంశాలను బట్టి వరించేది పదవి. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు పదవులు అడగలేదు. నాటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయంగా నిలదొక్కుకున్నవారే నాయకులయ్యారు.
నిస్వార్థంగా, సమాజం కోసం, ఫలాలేం ఆశించకుండా పోరాడేవాళ్లు ఉద్యమకారులు. అలాంటివారికి దక్కాల్సింది గౌరవం. నాయకులకు దక్కాల్సింది పదవి. రాజ్యాంగపరమైన పదవులకు ప్రజలెప్పుడు నాయకుడినే ఎన్నుకుంటారు. దీనికి సాక్ష్యం శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడమే. అలా ఎంతోమంది ఉద్యమకారులు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల ఆమోదం పొందలేకపోయారు. రాజకీయ నాయకులు కావాలనుకున్న ఉద్యమకారులు ముందు నాయకులుగా రూపాంతరం చెందాలి. అప్పుడు నాటి ఉద్యమపాత్ర, భాగస్వామ్యం వారిని మిగతా నాయకుల కంటే ముం దువరసలో నిలబెడుతుంది. అంతేకానీ ఉద్యమకారులమన్న ఒక్క అర్హత సరిపోదనే విషయం గమనించాలి. నాడు ఉద్యమకారులపై మదపుటేనుగుల్లా ైస్వెరవిహారం చేసిన నాయకులూ ఇప్పుడు మనతో కలవడం ఉద్యమకారులకు రుచించకపోవచ్చు. కానీ, వీరిని కట్టడిచేసే కావడి మన కేసీఆర్. నాటి మదపుటేనుగులన్నీ నేడు మన నాయకుడి చరిష్మాకు తోకముడిచి మనతో కలవడం శుభపరిణామమే.
ఉద్యమకారుడికి ఉండాల్సింది ఆవేశం. నాయకుడికి ఉండాల్సిది లౌక్యం. ఆవేశంతో రాజకీయం, లౌక్యంతో ఉద్యమం చేయలేం. తెలంగాణ ఉద్యమ సమయంలో
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆవేశం, లౌక్యం ప్రదర్శించాల్సిన ఆవశ్యకత ఏర్పడటంతో కేసీఆర్ ఉద్యమ, రాజకీయ పార్టీ నాయకుడిగా అవతరించారు. కానీ తెలంగాణ సాధించాక ప్రతిపక్షాల కుట్రలను, పక్క రాష్ట్ర నాయకుల కుతంత్రాలను ఛేదించే క్రమంలో టీఆర్ఎస్ను పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మార్చేశారు. ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రం సాధించడంతోనే వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. ఇక బంగారు తెలంగాణలో తమ మార్కు ఉండాలనుకుంటే పూర్తి రాజకీయ నాయకుడిగా మారడమే ప్రత్యామ్నాయం.
అప్పుడు ఉద్యమం కోసం గొంగళి పురుగును కూడా ముద్దాడినం. బంగారు తెలంగాణ కోసం ఇప్పుడూ ముద్దాడుతాం. ఉద్యమ వ్యతిరేకులను సైతం బంగారు తెలంగాణలో భాగస్వామ్యం చేయడం గొప్ప విషయంగా భావించాలి. గుడ్డు మీద ఈకలు పీకే ప్రతిపక్షాల మాటలను తిప్పికొట్టి బంగారు, సుజల తెలంగాణ కోసం కేసీఆర్ అడుగులో అడుగులు వేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుద్దాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై టీఆర్ఎస్.
-(వ్యాసకర్త: టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు)
కాసర్ల నాగేందర్ రెడ్డి