‘రామరాజు విద్యాసాగర్రావు’ పేరు తెలంగాణ ఉద్యమ కాలంలో సాగునీటి రంగ నిపుణుడిగా సుపరిచితమే. కృష్ణా గోదావరి నదుల నీటి గుట్టు విప్పి ఆంధ్రా పాలకుల కుట్రలను ఛేదించి తెరదించిన ధైర్యశాలి ఆయన. చాలామందికి చీఫ్ ఇంజినీర్గా, జల నిపుణుడిగానే తెలిసిన విద్యాసాగర్రావు వృత్తి సాగునీటి రంగమైతే, ప్రవృత్తి నాటకరంగం. తెలుగు నాటకరంగంలో ఆయన నటుడిగా, నాటక రచయితగా, దర్శకుడిగా చాలామందికి తెలియదు. వాస్తవానికి నదుల నీటి నడకలు మాత్రమే కాదు, నటన ప్రతినటనలు తెలిసినవారు విద్యాసాగర్రావు.
విద్యాసాగర్రావుకు చిన్నప్పటి నుంచి గుండె కింద తడిలా అంటిపెట్టుకున్న నాటకానికి నిజాం కళాశాల వేదికైంది. అక్కడి నాటకోత్సవాల్లో నాటకాలను ప్రదర్శించేవారు. చదువుతోపాటు నాటకాల్లో తన ఆనందాన్ని వెతుక్కున్నారు. నాటక బృందాలతో జతకట్టారు. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తయ్యాక ఉస్మానియా మహిళా కళాశాలలో సైట్ ఇంజినీరింగ్ ఉద్యోగంలో చేరారు. అక్కడ ఉద్యోగం చేస్తూనే సాయంత్రం రవీంద్రభారతి, వైఎంసీఏ రంగస్థల వేదికలపై వాలిపోయేవారు.
1959లో విద్యాసాగర్రావు సాయంకాలం నటశిక్షణ కోర్సులో చేరి అబ్బూరి రామకృష్ణారావు, మంత్రి శ్రీనివాసరావు, ఏ.ఆర్.కృష్ణ దగ్గర నటనలో శిక్షణ పొందారు. అక్కడ ప్రఖ్యాత సినీనటులు త్యాగరాజు, లక్ష్మీదేవి కనకాల, భానుప్రకాశ్ వంటివారు ఆయనకు సహ విద్యార్థులు. రవీంద్రభారతి ప్రాంగణంలోని నాట్యవిద్యాలయంలో ప్రదర్శించిన ‘మృచ్ఛ కటికం, శూద్రకుడు, కన్యాశుల్కం, వీలునామా, తప్పెవరిది, కీర్తిశేషులు’ వంటి ఆనేక నాటకాల్లో విద్యాసాగర్రావు ప్రధాన భూమికను పోషించి నటుడిగా గుర్తింపు పొందారు. ఇతర నాటకాలతోపాటు, తాను స్వయంగా రాసిన నాటకాలకు దర్శకత్వం వహించి ప్రదర్శించేవారు. ‘మట్టి బంగారం, ఇదేమిటి, ఈ ఇల్లు అమ్మబడును, వాన వెలిసింది’.. వంటి ఎన్నో నాటకాల్లో పాల్గొని గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఆలిండియా రేడియోలో ప్రసారమైన ‘1000’ తెలుగు నాటకాల్లో పాల్గొనడం ఆయనకి దక్కిన అరుదైన అవకాశం.
1960 నుండి 1975 వరకు 2 నాటకాలు, 11 నాటికలు కూడా రాశారు. ఆయన రాసిన ‘నారు మనది నీరు వాడిదా’ నాటిక కుటుంబ నియంత్రణపై తెలంగాణ మాండలికంలో సాగుతుంది. ఈ నాటిక కేంద్ర ప్రభుత్వ జాతీయ పోటీల్లో మొదటి బహుమతి అందుకున్నది. ఆయన రాసిన అన్ని నాటకాలు రంగస్థలంపై ప్రదర్శించబడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యాసాగర్రావు నాటక ప్రస్థానాన్ని ఈ తరానికి తెలియజేయటం తెలంగాణ థియేటర్ రిసెర్చ్ సెంటర్కు దక్కిన గొప్ప అవకాశం అని చెప్పాలి.
తెలంగాణ నాటకరంగాన్ని విశ్లేషిస్త్తే భారతీయ నాటక లక్షణానికి సమాంతరంగా కనిపిస్తుంది. ఆంగ్ల, పారసీ, మరాఠీ, కన్న డ, ఉర్దూ, తెలుగు నాటకాలు ఈ నేలను పరిపుష్ఠం చేశాయి. తూము రామదాసు, కొండుబొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, సోమరాజు రామానుజారావు, చందాల కేశవదాసు, హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ, మఖ్దూం మొహియుద్దీన్, మంత్రి శ్రీనివాసరావు లాంటివారు అగ్రభాగాన కనిపిస్తారు. ఈ పరంపరలో ఆర్.విద్యాసాగర్రావు తెలంగాణ నాటకరంగ ముఖపత్రమై కనిపిస్తారు. ఆర్.విద్యాసాగర్రావు తెలంగాణ ఉద్యమంలో నదీజలాలపై తన బలమైన గొంతుకను వినిపించడమే కాకుండా తెలంగాణ నాటకరంగంలో బహుముఖీనమై తనదైన పాత్ర పోషించారు.
(వ్యాసకర్త: డాక్టర్ జె.విజయ్కుమార్జీ , 98480 78109, అధ్యక్షులు, తెలంగాణ థియేటర్ రిసెర్చ్ సెంటర్, (నేడు ఆర్.విద్యాసాగర్రావు వర్ధంతి)