భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ.. దేశ న్యాయవ్యవస్థపై తనదైన ముద్ర వేశారు. ఆ అత్యున్నత పదవిని చేపట్టిన ఏడాదిలోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దేశ న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టే తీర్పులిచ్చారు. కేంద్రం ఏకపక్ష పోకడలను నియంత్రించి, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకునేలా చర్యలు తీసుకున్నారు.
కేంద్రం ఏకపక్ష పోకడల ప్రభావం వివిధ రాజ్యాంగ వ్యవస్థలపై పడుతున్న ప్రస్తుత తరుణంలో.. సీజేఐగా జస్టిస్ రమణ న్యాయవ్యవస్థ తలెత్తుకునే విధంగా కృషి చేస్తున్నారు. సీబీఐ అధిపతి ఎంపిక విషయంలో తనఅభిప్రాయాన్ని విస్పష్టంగా తెలిపి, కేంద్రం అనుసరించేలా చేశారు.
న్యాయవ్యవస్థను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని పరితపించే జస్టిస్ రమణ.. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా గత ఏడాది ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టగానే రెండు అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. 1. కోర్టుల్లో ఉన్న ఖాళీలను సత్వరం భర్తీ చేయ టం. 2. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కొరతను తీర్చటం. ఖాళీగా ఉన్న జడ్జి పోస్టులను భర్తీచేయాలని, ఈ మేరకు అర్హుల పేర్లను సిఫారసు చేయాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను (సీజేలను) ఆదేశించారు. హైకోర్టుల సీజేలతో జరిగిన ఆన్లైన్ సమావేశంలో కూడా ఈ అంశాన్ని మరోసారి నొక్కిచెప్పారు. దీనివల్లే గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టులో తొమ్మిది జడ్జి పోస్టులు భర్తీ అయ్యాయి. కొత్తగా నియమితులైన ఈ తొమ్మిదిమంది న్యాయమూర్తుల్లో మూడోవంతు మంది మహిళలు. వీరిలో ఒకరు భవిష్యత్తులో భారతదేశ ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. ఈ విధంగా దేశ న్యాయవ్యవస్థలో కొత్త చరిత్ర లిఖితమయ్యే సందర్భానికి జస్టిస్ రమణ ఆద్యులుగా నిలిచారు.
గత ఏడాది కాలంలో హైకోర్టు జడ్జీలుగా 192 మంది పేర్లు సిఫారసు కాగా.. వీరిలో 126 మంది ఇప్పటికే నియమితులయ్యారు. వీరిలో 20 శాతం మంది మహిళా న్యాయమూర్తులు. మరోవైపు, కొత్తగా 10 మంది వివిధ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఆరుగురు ప్రధాన న్యాయమూర్తులు, 27 మంది జడ్జీలు బదిలీ అయ్యారు. న్యాయమూర్తుల నియామకంలో మహిళలకు మాత్రమే కాదు, దేశంలోని వివిధ సామాజిక వర్గాలకు కూడా భాగస్వామ్యం కల్పించేలా ప్రాధాన్యం ఇవ్వాలని జస్టిస్ రమణ సూచించారు.
జడ్జీల నియామకాలు వేగంగా జరగటంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జస్టిస్ రమణ గౌరవార్థం ఒక కార్యక్రమం నిర్వహించింది. అక్కడ వక్తలు ఆయనను క్రికెటర్ సచిన్ టెండూల్కర్తో పోల్చారు. వెంటనే జస్టిస్ రమణ సరిదిద్దుతూ.. తాను టీం ప్లేయర్ను అని, నియామకాలు అనే ప్రక్రియ కొలీజియంలోని సభ్యులందరి ఉమ్మడి కృషి వల్ల జరిగిందని చెప్పారు. ఇది ఆయన వినమ్రతకు నిదర్శనం.
కోర్టుల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా.. ఆ సమస్యను పరిష్కరించటానికి జస్టిస్ రమణ ప్రాధాన్యం ఇచ్చారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీతో ఈ అంశంలో సర్వే జరిపించారు. ఆ సమాచారం ఆధారంగా కేంద్ర న్యాయశాఖకు వివరణాత్మక నివేదికను అందించారు. జాతీయ, రాష్ర్టాల స్థాయిల్లో వేర్వేరుగా ‘జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ’లను ఏర్పాటుచేయాలని సిఫారసు చేశారు. గత ఏడాది కాలం మొత్తం కరోనా తీవ్రంగా విరుచుకుపడిన సమయం. అంతటి విపత్కర పరిస్థితిలోనూ కోర్టులు నడిచేలా జస్టిస్ రమణ చర్యలు తీసుకున్నారు. దిగువస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకున్న సిబ్బంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఆయన.. దేశ న్యాయవ్యవస్థ పనిలో ఆటంకాలు ఏర్పడకుండా దిశానిర్దేశం చేశారు. కరోనా సమయంలో కోర్టు ప్రొసీడింగ్స్ను రిపోర్ట్ చేసే జర్నలిస్టుల కోసం మొబైల్ యాప్ను తయారుచేయించారు.
కేంద్రం ఏకపక్ష పోకడల ప్రభావం వివిధ రాజ్యాంగ వ్యవస్థలపై పడుతున్న ప్రస్తుత తరుణంలో.. సీజేఐగా జస్టిస్ రమణ న్యాయవ్యవస్థ తలెత్తుకునే విధంగా కృషిచేస్తున్నారు. సీబీఐ అధిపతి ఎంపిక విషయంలో తన అభిప్రాయాన్ని విస్పష్టంగా తెలిపి, కేంద్రం అనుసరించేలా చేశారు. యూపీలో యోగి ప్రభుత్వం అరెస్టు చేసి జైలుపాలు చేసిన జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్ను చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించాలని సీజేఐగా బాధ్యతలు చేపట్టిన వారంలోపే జస్టిస్ రమణ ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాక్సిన్లకు ధరలు నిర్ణయించిన కేంద్రం తీరును దుయ్యబట్టి, వ్యాక్సిన్లను ఉచితంగా అందించేలా కేంద్రాన్ని అంగీకరింపజేశారు.
స్వాతంత్రోద్యమం కాలంలో ఉద్యమకారులను నిర్బంధించటానికి ఉపయోగించిన రాజద్రోహం చట్టం అవసరం ఇప్పుడేముంది? అంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆగ్రా జైలు నుంచి ఖైదీల విడుదలలో జాప్యం అంశాన్ని సుమోటోగా తీసుకొని.. కోర్టు ఆదేశాలు తక్షణం దేశవ్యాప్తంగా ఏ జైలుకైనా అందేలా ‘ఫాస్టర్’ అనే సాఫ్ట్వేర్ ప్లాట్ఫాం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. పెగాసస్ ఉదంతంపై పిల్కు అంగీకారం.. దర్యాప్తునకు ఆదేశం. ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసులను ఉపసంహరించాలంటే సంబంధిత హైకోర్టు అనుమతి తప్పనిసరని ఆదేశాలు జారీచేశారు.
అదానీ పవర్ కంపెనీకి వ్యతిరేకంగా క్యురేటివ్ పిటిషన్కు అంగీకరించారు. ఈ నేపథ్యంలో, ఈ వివాదం కోర్టు బయట పరిష్కారమైంది. ఎలక్టోరల్ బాండ్స్ కేసుపై విచారణకు అంగీకారం తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీలకు బానిసలుగా మారొద్దంటూ అధికారులకు, పోలీసులకు జస్టిస్ రమణ హితవు పలికారు. సం పాదనే ధ్యేయంగా న్యాయవాద వృత్తిలోకి రావద్దంటూ యువ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ‘ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్’ ఏర్పాటులో జస్టిస్ రమణ కీలకపాత్ర పోషించారు.
జస్టిస్ రమణ చిన్న చిన్న విషయాల పట్ల కూడా ఎంత శ్రద్ధ తీసుకుంటారనేదానికి ఒక ఉదాహరణ.. కేరళ బాలిక లిడ్వినా జోసెఫ్ ఉదంతం. కరోనా సమయంలో ఆక్సిజన్ సరఫరా తగినంత లేక అనేకమంది మరణిస్తున్న నేపథ్యంలో, తగు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం కదిలి చర్యలు తీసుకుంది. దీనిపై సుప్రీంకోర్టు చొరవను ప్రశంసిస్తూ ఐదోతరగతి బాలిక లిడ్వినా సీజేఐకి ఒక లేఖ రాసింది. దానికి ప్రతిగా ఆ చిన్నారిని ఆశీర్వదిస్తూ, మెచ్చుకుంటూ వ్యక్తిగత లేఖ రాయటమేగాక ఆ బాలికకు రాజ్యాంగ ప్రతిని కూడా సీజేఐ పంపించారు. ఇటువంటిదే మరొక అంశం. 20 ఏండ్లుగా విడిగా ఉంటూ, కోర్టును ఆశ్రయించిన తెలుగువారైన ఒక జంటకు తెలుగులో మంచి మాటలు చెప్పి వారు కలిసి ఉండేలా ఒప్పించారు.
రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలనే ఆలోచన ఉందని ఇటీవల అమెరికా సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ స్టీఫెన్ బ్రేయర్ జస్టిస్ రమణను అడిగినప్పుడు.. వ్యవసాయం చేద్దామనుకుంటున్నానని తెలిపారు. సాగు అంటే ఆయనకు అంత ఇష్టం. ఇక మాతృభాష తెలుగు మీద జస్టిస్ రమణకు ఉన్న గౌరవం, ఇష్టం అందరికీ తెలిసిందే. ‘నేను తెలుగు మీడియంలో చదువుకున్నా. ఇంగ్లిష్ భాషను నేర్చుకోవటం అన్నది ఎనిమిదో తరగతి నుంచే ప్రారంభమైంది’ అని ఆయన తెలిపారు. మాతృభాషను, మాతృభూమిని మరువొద్దు అని పలుమార్లు హితవు చెబుతుంటారు.
(సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా..)