రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆరు కొత్త ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చింది. గురునానక్, అమిటీ, సీఐఐ, ఎంఎన్ఆర్ ఫార్మా, కావేరి వ్యవసాయ, ఎన్ఐసీఎంఏఆర్ వర్సిటీలు ఏర్పాటుకానున్నాయి. వీటితోపాటు మల్లారెడ్డి, అనురాగ్లకు కూడా వర్సిటీ అనుమతులు వచ్చాయి. హైదరాబాద్ వంటి మహానగరంలో ఇటువంటి యూనివర్సిటీల ఆవశ్యకత ఎంతో ఉన్నది.
సాంకేతికత, ప్రపంచీకరణ దృష్ట్యా హైదరాబాద్ నగరానికి పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి విద్యార్థులకు అందుబాటులో ఉండే కోర్సు ల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్న ది. ప్రైవేట్ వర్సిటీలకు స్వయంప్రతిపత్తి ఇవ్వడం వల్ల మార్కెట్ ఆధారిత కోర్సులను విద్యార్థులకు చేరువచేసే అవకాశం ఉంటుంది. అసలు ఈ ప్రైవేట్ వర్సిటీలు రాష్ట్ర ఆర్థిక, సేవల, పరిశ్రమ రంగంలో ఎలా తోడ్పాటునందిస్తాయో తెలుసుకుందాం.
ఉమ్మడి రాష్ట్రంలో వర్సిటీల అవసరం ఉన్నప్పటికీ అప్పటి పాలకులు ఏర్పాటు చేయలేదు. ఉస్మానియా, కాకతీయ, జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలు మాత్రమే ఉండగా, వాటికి అనుబంధంగా వందల కళాశాలలు ఉండేవి. తర్వాత పాలమూరు, తెలంగాణ శాతవాహన వంటి వర్సిటీలు ఏర్పాటయ్యాయి. ప్రవేశపరీక్ష ద్వారా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకే వీటిలో అడ్మిషన్ దొరికేది. మారుతున్న సాంకేతికత, చదువులో వస్తున్న మార్పుల నేపథ్యంలో మార్కెట్ ఆధారిత కోర్సులకు డిమాండ్ నెలకొంది. కానీ, ప్రైవేట్ వర్సిటీల అనుమతికి అప్పటి ప్రభుత్వాలు విముఖత చూపాయి. దీంతో చాలామంది విద్యార్థులు (డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, ఆటోమొ బైల్స్) వంటి కోర్సుల కోసం ఎస్ఆర్ఎం, విట్, అమృతానందమయి, మణిపాల్ వంటి వర్సిటీల్లో ప్రవేశ పరీక్ష రాసి ఇతర రాష్ర్టాల్లో చదువుకునే పరిస్థితి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఉత్తర, దక్షిణ భారతదేశాలకు వారధి. ఇక్కడ ఇంజినీరింగ్, సాంకేతికత, వైద్య సంబంధిత విద్యను విస్తరింపజేయడం అవసరం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రి కేటీఆర్ జరుపుతున్న కృషి కారణంగా అనేక పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి. స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ) ఈ రోజు రూ.11 లక్షల కోట్లకు చేరుకున్నది. టీఎస్ ఐపాస్ వంటి విధానాల వల్ల సింగిల్ విండో సిస్టంతో అనేక పరిశ్రమలు వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి.
ఇందుకోసం మనం మానవ వనరులను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచ టం ద్వారా పరిశోధన, అభివృద్ధి రంగాల్లో వారి పాత్రను కీలకంగా మార్చవచ్చు. వైద్య విద్యలో సైతం పరిశోధనలను, స్పెషలైజేషన్ కోర్సులను ప్రవేశపెట్టాలి. వర్సిటీల్లో గేమిం గ్, యానిమేషన్, సినిమా, లా వంటి వొకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టాలి. ‘జాతీయ నూతన విద్యా విధానం-2020’లో సైతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ప్రైవేట్ వర్సిటీలను ఏర్పాటుచేయాలని కస్తూరి రంగన్ కమిటీ సిఫారసు చేసింది.
నగరాల్లో పరిశ్రమల అభివృద్ధికి ప్రైవేట్ వర్సిటీలు కీలకపాత్ర పోషిస్తాయి. విద్యార్థులు తమ మొదటి సంవత్సరం నుంచే పరిశోధనల వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రైవేటు వర్సిటీలు సిలబస్ రూపొందిస్తాయి. విద్యార్థులకు నాణ్యమైన కోర్సులతో పాటు ఉద్యోగ కల్పనకు ఈ వర్సిటీలు తోడ్పడుతాయి. జర్మనీ, ఇంగ్లండ్ వంటి దేశాల్లో విద్యార్థులు చదువు మధ్యలో విరామం ఇచ్చి కొన్నేండ్లు ఉద్యోగం చేసి ఆ తర్వాత మళ్లీ ఆయా కోర్సులను ముగించుకునే వెసులుబాటు ఉంటుంది. మన వద్దా ఇటువంటి సదుపాయం తీసుకురావాల్సిన అవసరం ఉంది.
వైద్య కోర్సులో స్పెషలైజేషన్లో మరింతగా పురోగమిస్తే మన విద్యార్థులు విదేశాలకు వెళ్లవలసిన అవసరం ఉండదు. వైద్య కోర్సులో నీట్ పరీక్ష ద్వారా ముడిపడి ఉన్న అనేక సమస్యలకు ఈ ప్రైవేట్ వర్సిటీలు ఎంతగానో ఉపయోగపడుతాయి. వ్యవసాయంలోనూ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యా మ్నాయ పంటలు, డ్రోన్ టెక్నాలజీపై శ్రద్ధ తీసుకోవడంతో వాటిపై పరిశోధనలు పెరిగాయి. మన రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి అనుగుణంగా ప్రైవేట్ వర్సిటీలతో వ్యవసాయరంగాన్ని అనుసంధానం చేస్తే వ్యవసాయ కోర్సులకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నది.
మన రాష్ట్రంలో గ్రానైట్, సున్నపురాయి వంటి పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఆయుధాల తయారీ రంగం, డిఫెన్స్, విమాన, స్పేస్ రంగాల్లో అనేక అవకాశాలు, పెట్టుబడులు హైదరాబాద్కు వస్తున్నాయి. కేవలం ఐటీ పరిశ్రమలకే పరిమితం కాకుండా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెకానికల్, సివిల్ వంటి రంగాల్లో సైతం పెట్టుబడులను ఆకర్షించడానికి, పరిశ్రమలు నెలకొల్పడానికి ఈ ప్రైవేట్ వర్సిటీలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
అంతర్జాతీయ కోర్సులకు తీసిపోకుండా మన రాష్ట్రంలో సైతం అనేక కొత్త కోర్సులు వీటిద్వారా అందుబాటులోకి వస్తాయి. పరిశోధనలు జరుపటం, జర్నల్స్కు వ్యాసాలను పంపటం వంటి కార్యక్రమాలను విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే ప్రారంభిస్తారు. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ కోర్సులో సైతం మాతృభాషను ప్రవేశపెట్టడంతో గ్రామీణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.
QS World University Rankingలో టాప్ 100 ర్యాం కుల్లో మన రాష్ట్రం నుంచి ఒక యూనివర్సిటీ ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం సాకారం కావాలి.
-కన్నోజు శ్రీహర్ష ,89851 30032